Mental Health Survey 2025: యువతే అతిపెద్ద బలం రేపటి భవిష్యత్తు వారి చేతుల్లోనే ఉందని మనం ఎప్పుడూ గర్వంగా చెప్పుకుంటాం. కానీ, తాజాగా వెలువడిన ఒక అంతర్జాతీయ నివేదిక మనల్ని ఒక్కసారిగా ఆలోచనలో పడేసింది. సాపియన్ ల్యాబ్స్ విడుదల చేసిన ‘గ్లోబల్ మైండ్ హెల్త్ ఇన్ 2025’ నివేదిక ప్రకారం, నేటి తరం యువత తీవ్రమైన మానసిక ఒత్తిడిని ఎదుర్కొంటోందని వెల్లడైంది. ప్రపంచవ్యాప్తంగా 84 దేశాల్లో నిర్వహించిన ఈ సర్వేలో భారతీయ యువత పరిస్థితి చాలా ఆందోళనకరంగా ఉందని, వారి మానసిక స్థితి ఇతర దేశాలతో పోలిస్తే వెనుకబడి ఉందని స్పష్టమైంది.
ఈ నివేదికలోని గణాంకాలను పరిశీలిస్తే, 18 నుంచి 34 ఏళ్ల మధ్య వయస్సు గల యువత మానసిక ఆరోగ్య ర్యాంకింగ్స్లో భారత్ 60వ స్థానంలో నిలిచింది. వీరి మానసిక ఆరోగ్య స్కోరు (MHQ) కేవలం 33 మాత్రమే నమోదు కావడం గమనార్హం. ఇదే సమయంలో ఒక ఆసక్తికరమైన విషయం బయటపడింది. మన ఇంట్లోని పెద్దవారు, అంటే 55 ఏళ్లు పైబడిన వారు నేటి యువత కంటే మానసిక దృఢత్వంలో చాలా మెరుగ్గా ఉన్నారట. వారి స్కోరు 96గా నమోదై, వారు 49వ స్థానంలో నిలిచారు. దీన్ని బట్టి చూస్తే పాత తరం వారే మానసిక ఒత్తిడిని తట్టుకోవడంలో గట్టివారని అర్థమవుతోంది.
యువత ఇలా కుంగిపోవడానికి ప్రధానంగా మూడు కారణాలు ఉన్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మొదటిది స్మార్ట్ఫోన్ సోషల్ మీడియా ప్రభావం. చిన్న వయసు నుంచే గంటల కొద్దీ డిజిటల్ తెరలకు అతుక్కుపోవడం వల్ల నిజమైన మనుషులతో సంబంధాలు తగ్గిపోతున్నాయి. రెండోది మారిన ఆహారపు అలవాట్లు. ఇంటి భోజనం కంటే బయట దొరికే జంక్ ఫుడ్, నూనెలో వేయించిన పదార్థాలకు అలవాటు పడటం వల్ల మెదడు పనితీరుపై ప్రభావం పడుతోంది. మూడవది ఒంటరితనం. ఒకప్పుడు ఉమ్మడి కుటుంబాల్లో అందరితో కలిసి ఉండేవారు, కానీ ఇప్పుడు వర్చువల్ ప్రపంచంలో బతుకుతూ ఒంటరిగా ఫీలవుతున్నారు.
ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే దేశ భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉందని సాపియన్ ల్యాబ్స్ వ్యవస్థాపకురాలు తారా త్యాగరాజన్ ఆందోళన వ్యక్తం చేశారు. నేటి యువత చిన్నపాటి ఒత్తిడిని కూడా తట్టుకోలేకపోవడం, ఏకాగ్రత కోల్పోవడం, భావోద్వేగాలను అదుపు చేసుకోలేకపోవడం వంటి సమస్యలతో సతమతమవుతున్నారు. ఇది కేవలం వారి వ్యక్తిగత సమస్య మాత్రమే కాదు, దేశ ఆర్థిక వ్యవస్థ ఉత్పాదకతను కూడా దెబ్బతీస్తుంది. యువశక్తి నిర్వీర్యం కావడం అనేది దేశ అభివృద్ధికి పెద్ద అవరోధంగా మారుతుందని నిపుణులు సూచిస్తున్నారు.
మానసిక ఆరోగ్యంపై ఇప్పటికైనా ప్రభుత్వం, తల్లిదండ్రులు సమాజం ప్రత్యేక శ్రద్ధ చూపాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పిల్లలకు చిన్నతనం నుంచే స్మార్ట్ఫోన్లకు దూరంగా ఉంచడం, పోషకాహారం అందించడం మరియు వారిని శారీరక ఆటల వైపు ప్రోత్సహించడం ద్వారా ఈ సమస్యను కొంతవరకు తగ్గించవచ్చు. లేకపోతే, దేశానికి వెన్నెముక కావాల్సిన యువత భవిష్యత్తులో దేశానికే భారంగా మారే ప్రమాదం ఉందని ఈ రిపోర్ట్ హెచ్చరిస్తోంది