Politics- వైసీపీ నేతల భూదందాలపై గ్రీవెన్స్లో ఫిర్యాదుల వెల్లువ..
వల్లభనేని వంశీ అనుచరుడి భూకబ్జా… పేద రైతులకు అండగా నిలిచిన టీడీపీ నేతలు.
ఉద్యోగం పేరుతో యువతిపై వేధింపులు…
Praja Vedika: మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో నేడు నిర్వహించిన ప్రజా వినతుల స్వీకరణ కార్యక్రమం (గ్రీవెన్స్) బాధితుల గోడుతో నిండిపోయింది. రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాల నుండి తరలివచ్చిన ప్రజలు తమకు ఎదురవుతున్న అన్యాయాలను బీసీ సంక్షేమ, చేనేత మరియు టెక్స్టైల్స్ శాఖ మంత్రి సవిత గారు, అలాగే ఎమ్మెల్సీ బీద రవిచంద్ర యాదవ్ గారికి విన్నవించుకున్నారు. భూకబ్జాలు, మోసాలు, వైసీపీ నేతల వేధింపులపై బాధితులు సమర్పించిన అర్జీలను స్వీకరించిన నేతలు, వాటిని తక్షణమే పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రజా సమస్యల పరిష్కారమే కూటమి ప్రభుత్వ మొదటి ప్రాధాన్యత అని ఈ సందర్భంగా వారు స్పష్టం చేశారు.
ప్రధానంగా నెల్లూరు మరియు కృష్ణా జిల్లాల్లో వైసీపీ నేతల అండతో సాగుతున్న భూదందాలపై ఫిర్యాదులు వెల్లువెత్తాయి. నెల్లూరు జిల్లా పడుగుపాడుకు చెందిన మురళీకృష్ణ ఫిర్యాదు చేస్తూ.. పేద ప్రజల కోసం కేటాయించిన ప్రభుత్వ స్థలాన్ని వైసీపీ నాయకులు మల్లవరపు చిరంజీవి, ప్రసాద్ ఆక్రమించుకుని అక్రమ నిర్మాణాలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే, కృష్ణా జిల్లా గొల్లగూడెంలో మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అనుచరుడు వింతా శంకరరెడ్డి తన మామకు చెందిన 0.59 సెంట్ల భూమిని దౌర్జన్యంగా ఆక్రమించి రోడ్డు వేశారని చిట్టిబాబు అనే వ్యక్తి వాపోయారు. రెవెన్యూ అధికారులు కూడా భూస్వాములతో కుమ్మక్కై రికార్డులు తారుమారు చేశారని బాధితులు ఆరోపించారు.
మహిళలపై జరుగుతున్న దౌర్జన్యాలు, వేధింపుల ఉదంతాలు ఈ గ్రీవెన్స్లో కలకలం రేపాయి. తాడేపల్లికి చెందిన మౌనిక అనే యువతి పడుతున్న నరకయాతన వింటే ఎవరికైనా కళ్లు చెమర్చుతాయి. ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తామని నమ్మించిన పాలపాటి రఘు, శ్రీనివాసరెడ్డి అనే వ్యక్తులు తన సర్టిఫికేట్లు లాక్కుని, తనను లొంగదీసుకోవాలని చూస్తున్నారని ఆమె కన్నీటిపర్యంతమైంది. నిరాకరించినందుకు తన బ్యాగులో బంగారం వేసి దొంగతనం కేసులో ఇరికిస్తామని, వైసీపీ నేతల అండతో పోలీసులు కూడా తమకే మద్దతు ఇస్తున్నారని ఆమె భయం వ్యక్తం చేసింది. మరోవైపు భర్త అక్రమ సంబంధం వల్ల వేధింపులకు గురవుతున్న అనంతపురానికి చెందిన ఉమా కూడా తనకు న్యాయం చేయాలని వేడుకుంది.
ఆర్థిక మోసాలకు సంబంధించి విశాఖపట్నం నుండి వచ్చిన రామలక్ష్మి ఫిర్యాదు ప్రత్యేక దృష్టిని ఆకర్షించింది. సింహాచలం దేవస్థాన ఉద్యోగి అప్పారావు, ఆయన భార్య కలిసి చీటీల పేరుతో తన వద్ద నుండి రూ. 18 లక్షలు వసూలు చేసి, ఇప్పుడు తిరిగి ఇవ్వకుండా మోసం చేస్తున్నారని ఆమె వాపోయింది. రిటైర్మెంట్ డబ్బులతో ఇస్తామని నమ్మించి ఇప్పుడు తప్పించుకు తిరుగుతున్నారని ఆమె ఫిర్యాదు చేశారు. అలాగే కడప జిల్లా సింహాద్రిపురానికి చెందిన భవిత అనే యువతి, తనను ప్రేమించి పెళ్లి చేసుకున్న అమరనాథ్ రెడ్డి ఇప్పుడు రాజకీయ పలుకుబడితో తనను భార్యగా అంగీకరించడం లేదని, పోలీసుల విచారణ కూడా సక్రమంగా జరగడం లేదని మొరపెట్టుకుంది.
భూ రికార్డుల సమస్యలపై కూడా అనేక అర్జీలు అందాయి. మార్కాపురం జిల్లాకు చెందిన మహబూబ్ యాసీన్ తన తండ్రికి చెందిన 82 సెంట్ల వ్యవసాయ భూమిని సాంకేతిక కారణాల వల్ల '22-A' నిషేధిత జాబితాలో చేర్చారని, దీనివల్ల తమ హక్కులకు ఆటంకం కలుగుతోందని తెలిపారు. అదే జిల్లాకు చెందిన రమణయ్య, తమ గ్రామంలోని దేవుని ఊరేగింపులు జరిగే 'కళ్లెం పోరంబోకు' భూమిని స్థానిక బలవంతులు ఆక్రమించి ఇళ్లు కడుతున్నారని ఫిర్యాదు చేశారు. కడప జిల్లా గునకనపల్లెకు చెందిన మంజుల లక్ష్మీదేవి, తాము మూడు దశాబ్దాలుగా సాగు చేసుకుంటున్న 12 ఎకరాల బంజరు భూమికి పట్టా మంజూరు చేయాలని కోరారు.
మంత్రి సవిత గారు బాధితుల సమస్యలను ఓపికగా విని, ప్రతి అర్జీని క్షుణ్ణంగా పరిశీలించారు. వైసీపీ హయాంలో సామాన్యులను ఇబ్బంది పెట్టిన ఏ ఒక్కరినీ వదిలిపెట్టే ప్రసక్తి లేదని ఆమె హెచ్చరించారు. ముఖ్యంగా భూకబ్జాలు, మహిళా వేధింపుల విషయంలో కఠినంగా వ్యవహరించాలని పోలీసులకు, రెవెన్యూ యంత్రాంగానికి సూచించారు. బాధితులకు న్యాయం జరిగే వరకు తాము అండగా ఉంటామని, కూటమి ప్రభుత్వంలో సామాన్యుడికి భద్రత ఉంటుందని భరోసా ఇచ్చారు. అర్జీదారులు తమ ఇబ్బందులను నేరుగా ప్రభుత్వం దృష్టికి తీసుకురావడం శుభపరిణామమని ఆమె పేర్కొన్నారు.
వీటితో పాటు వందలాది మంది నిరుద్యోగులు ఉద్యోగ అవకాశాల కోసం తమ రెస్యూమ్లను నేతలకు అందజేశారు. మరికొందరు పెన్షన్లు, రేషన్ కార్డులు, ఇళ్ల స్థలాల మంజూరు వంటి వ్యక్తిగత సమస్యలపై వినతులు సమర్పించారు. అనారోగ్యంతో బాధపడుతూ ఆర్థిక స్థోమత లేని పలువురు బాధితులకు ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి సాయం అందేలా చూస్తామని నేతలు హామీ ఇచ్చారు. ఉదయం నుండి సాయంత్రం వరకు కొనసాగిన ఈ గ్రీవెన్స్ కార్యక్రమం, ప్రజా సమస్యల పరిష్కార వేదికగా నిలిచింది.
తేదీ 23-04-2026 న మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించబడనున్న "ప్రజా వేదిక" కార్యక్రమంలో పాల్గొననున్న ముఖ్య నాయకుల షెడ్యూల్
ప్రజా వేదిక షెడ్యూల్
తేదీ: 23 ఏప్రిల్ 2026 (గురువారం)
స్థలం: తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం, మంగళగిరి
1. శ్రీ భూమిరెడ్డి రామ్ గోపాల్ రెడ్డి గారు (ఎమ్మెల్సీ)
2. శ్రీ ఎస్. రాజశేఖర్ గారు (ఎడ్యుకేషన్ & వెల్ఫేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఛైర్మన్ )