తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు ఎటు చూసినా పులి భయం ప్రజలను వెంటాడుతోంది. అరణ్యంలో ఉండాల్సిన క్రూర మృగాలు అడవి హద్దులు దాటి జనారణ్యంలోకి ప్రవేశిస్తుండటంతో అటు ఆంధ్రప్రదేశ్, ఇటు తెలంగాణ సరిహద్దు గ్రామాల ప్రజలు కంటిమీద కునుకు లేకుండా గడుపుతున్నారు. గోదావరి తీరం మొదలుకొని రాయలసీమ కొండల వరకు, అటు సిరిసిల్ల అడవుల నుంచి యాదాద్రి గుట్టల వరకు వన్యమృగాల సంచారం ఇప్పుడు ఒక హై-వోల్టేజ్ థ్రిల్లర్ను తలపిస్తోంది. పొలాల్లోకి వెళ్లాలంటేనే రైతులు వణికిపోతుండగా, మృగాల దాడుల్లో మూగజీవాలు బలైపోతుండటం గ్రామీణ ప్రాంతాల్లో ఆందోళన కలిగిస్తోంది.
ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలంలో గత కొన్ని రోజులుగా పెద్దపులి సంచారం స్థానికులను హడలెత్తిస్తోంది. ఛత్తీస్గఢ్ అటవీ ప్రాంతం నుండి వచ్చినట్లు భావిస్తున్న ఈ పులి, ప్రస్తుతం పెదపూడి మరియు తొర్రేడు పరిసరాల్లో తిరుగుతూ పశువులపై దాడులు చేస్తోంది. పులి పాదముద్రలను గుర్తించిన అటవీశాఖ అధికారులు ఇప్పటికే 15 ట్రాప్ కెమెరాలను, రెండు బోన్లను ఏర్పాటు చేశారు. పులి కదలికల నేపథ్యంలో ముందు జాగ్రత్తగా కొన్ని గ్రామాల్లో పాఠశాలలకు సెలవులు ప్రకటించడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది.
అటు ఏలూరు జిల్లా ఏజెన్సీ ప్రాంతంలోనూ తెలంగాణ నుంచి ప్రవేశించిన మరో పులి వరుస దాడులతో హడలెత్తిస్తోంది. గత ఐదు రోజుల్లోనే పదికి పైగా మూగజీవాలను ఈ క్రూర మృగం పొట్టనబెట్టుకుంది. తెలంగాణలో చిరుతల గుంపుల స్వైరవిహారం
తెలంగాణలోని రాజన్న సిరిసిల్ల జిల్లాలో పరిస్థితి మరింత భీతి గొల్పుతోంది. ఇక్కడ ఒకటో రెండో కాదు, ఏకంగా ఐదు నుంచి ఆరు చిరుతలు ఒక గుంపుగా సంచరిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ఎల్లారెడ్డిపేట, వీర్నపల్లి మండలాల్లోని సుమారు 38 వేల ఎకరాల అటవీ ప్రాంతాన్ని ఇవి తమ అడ్డాగా మార్చుకున్నాయి.
ముఖ్యంగా ఈ చిరుతలు తమ కూనలకు వేట నేర్పిస్తున్న క్రమంలో పశువుల పాకలపై దాడులు చేస్తున్నాయి. యాదాద్రి భువనగిరి జిల్లాలో కూడా పెద్దపులి సంచారం గత వారం రోజులుగా నిద్రలేకుండా చేస్తోంది. తుర్కపల్లి నుంచి యాదగిరిగుట్ట మీదుగా సిద్దిపేట జిల్లా పీర్లపల్లి రిజర్వ్ ఫారెస్ట్లోకి ఈ పులి ప్రవేశించినట్లు అటవీశాఖ అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు.
అప్రమత్తంగా ఉండాలని అధికారుల హెచ్చరిక వన్యమృగాల సంచారం నేపథ్యంలో అటవీశాఖ అధికారులు ప్రజలకు పలు సూచనలు జారీ చేశారు. చిరుత పాదం సుమారు 9 సెంటీమీటర్లు ఉంటే, పెద్దపులి పాదం 15 సెంటీమీటర్ల కంటే ఎక్కువగా ఉంటుందని, వీటిని బట్టి ఆయా మృగాలను గుర్తించవచ్చని తెలిపారు. రైతులు పొలాలకు ఒంటరిగా వెళ్లకుండా గుంపులుగా వెళ్లాలని, చేతిలో కర్రలు ఉంచుకోవాలని సూచించారు. ముఖ్యంగా నీటి వసతి ఉన్న చోట ఈ మృగాలు మాటు వేసే అవకాశం ఉన్నందున పశువుల కాపరులు అత్యంత అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. అడవికి ఆనుకుని ఉన్న గ్రామాల్లో గస్తీని ముమ్మరం చేసిన అధికారులు, ఏదైనా సమాచారం ఉంటే వెంటనే అటవీశాఖకు తెలపాలని కోరారు.