ఏడు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్
దక్షిణ తెలంగాణలో పరిస్థితి
ముంచుకొస్తున్న వేసవి తీవ్రత
Weather Update: గత కొన్ని రోజులుగా ఎండ వేడితో అల్లాడుతున్న తెలంగాణ ప్రజలకు వాతావరణ శాఖ ఒక తీపి కబురు అందించింది. రాష్ట్రంలో మరో రెండు రోజుల పాటు అక్కడక్కడా వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ముఖ్యంగా ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో ఆకాశంలో క్యుములో నింబస్ మేఘాలు ఏర్పడటమే ఈ అకాల వర్షాలకు ప్రధాన కారణమని అధికారులు చెబుతున్నారు.
వచ్చే 24 గంటల్లో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ మేరకు జగిత్యాల, కామారెడ్డి, కరీంనగర్, నిజామాబాద్, పెద్దపల్లి, సిద్దిపేట సిరిసిల్ల జిల్లాలకు వాతావరణ శాఖ 'ఆరెంజ్ అలర్ట్' జారీ చేసింది. వర్షం పడే సమయంలో గంటకు సుమారు 60 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని, ప్రజలు ముఖ్యంగా రైతులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
దక్షిణ తెలంగాణ జిల్లాల్లో కూడా రాగల రెండు రోజుల్లో తేలికపాటి జల్లులు పడే అవకాశం ఉంది. అయితే ఇవి గతంలో కురిసిన భారీ వర్షాల అంత తీవ్రంగా ఉండకపోవచ్చని స్పష్టం చేశారు. మిగిలిన ప్రాంతాల్లో వాతావరణం పొడిగా ఉన్నప్పటికీ, ఈ వర్షాల వల్ల పగటి ఉష్ణోగ్రతలు కాస్త తగ్గి వాతావరణం కాస్తంత ప్రశాంతంగా మారనుంది. హైదరాబాద్ నగరంలో గరిష్ట ఉష్ణోగ్రతలు 31 నుంచి 33 డిగ్రీల మధ్య నమోదయ్యే అవకాశం ఉంది.
వర్షాలు కురిసినప్పటికీ గాలిలో తేమ శాతం 41 నుండి 80 శాతం వరకు ఉండటంతో మధ్యాహ్న సమయంలో ఉక్కపోత ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. అయితే రాత్రి వేళల్లో ఉష్ణోగ్రతలు 20 డిగ్రీల వరకు పడిపోతుండటంతో ఉదయం, రాత్రి సమయాల్లో వాతావరణం చల్లగానే ఉంటుంది. ఇది సామాన్యులకు కొంత ఉపశమనం కలిగించే విషయమే అయినప్పటికీ, మారుతున్న వాతావరణ పరిస్థితుల దృష్ట్యా ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు.
అయితే ఈ చల్లటి వార్త కేవలం తాత్కాలికమేనని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ రెండు రోజుల వర్షాల తర్వాత ఎండల తీవ్రత ఒక్కసారిగా పెరిగే అవకాశం ఉంది. ఏప్రిల్, మే నెలల్లో భానుడు ప్రతాపం చూపిస్తాడని, వడగాలులు వీచే ప్రమాదం కూడా ఉందని అంచనా వేస్తున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరి నుండే వేసవి సెగలు మొదలవ్వగా, మార్చిలో కురిసిన వర్షాలు కొంత ఊరటనిచ్చాయి. ఇకపై బయటకు వెళ్లేవారు తగిన జాగ్రత్తలు తీసుకోవడం అవసరమని అధికారులు స్పష్టం చేశారు.