రాయలసీమ, కోస్తాలో వడగాలుల ముప్పు..
ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి.. అత్యవసర సమాచారం కోసం ఈ నెంబర్లకు కాల్ చేయండి.
చిన్నపిల్లలు, వృద్ధులు ఇళ్లకే పరిమితం కావాలి…
AP Weather Update: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ ఏడాది మార్చి నెల నుంచే ఎండల తీవ్రత సాధారణం కంటే ఎక్కువగా ఉండబోతోందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (Disaster Management) హెచ్చరించింది. ఏప్రిల్, మే నెలల్లో భానుడు మరింత భగ్గుమంటాడని, ముఖ్యంగా రాయలసీమ మరియు కోస్తా జిల్లాల్లో వడగాలుల ప్రభావం తీవ్రంగా ఉంటుందని సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. ఉష్ణోగ్రతలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రాణనష్టం జరగకుండా జిల్లాల యంత్రాంగాన్ని ఇప్పటికే అప్రమత్తం చేశారు. ప్రజలకు ఎప్పటికప్పుడు హెచ్చరిక సందేశాలు పంపడంతో పాటు, అత్యవసర సమాచారం కోసం 112, 1070 వంటి టోల్ ఫ్రీ నెంబర్లను అందుబాటులో ఉంచారు.
వడదెబ్బ బారిన పడకుండా ప్రజలు తగిన జాగ్రత్తలు (Safety Measures) తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. మధ్యాహ్నం సమయంలో బయటకు వెళ్లేవారు తప్పనిసరిగా గొడుగు, టోపీ ధరించాలని, డీహైడ్రేషన్ కాకుండా ఉండటానికి మజ్జిగ, కొబ్బరి నీళ్లు, ఓఆర్ఎస్ వంటి పానీయాలు ఎక్కువగా తీసుకోవాలని కోరారు. ముఖ్యంగా గర్భిణీలు, చిన్నపిల్లలు, వృద్ధులు ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు ఇంటి పట్టునే ఉండటం శ్రేయస్కరం. ఇళ్లను చల్లగా ఉంచుకోవడానికి కూల్ రూఫ్ పెయింట్స్ మరియు ఇండోర్ ప్లాంట్స్ పెంచుకోవాలని సూచించారు.
ఎండలతో పాటు ఆకస్మికంగా కురిసే భారీ వర్షాలు, పిడుగుల పట్ల కూడా ప్రజలు జాగ్రత్తగా ఉండాలి. క్యుములోనింబస్ మేఘాల వల్ల పిడుగులు పడే అవకాశం ఉన్నందున, వర్షం పడే సమయంలో చెట్ల కింద ఉండకూడదని విపత్తుల సంస్థ హెచ్చరించింది. పొలాల్లో పనిచేసే రైతులు, కూలీలు వాతావరణ సమాచారాన్ని ఎప్పటికప్పుడు గమనిస్తూ అప్రమత్తంగా ఉండాలి. ప్రభుత్వం జారీ చేసే సూచనలను పాటిస్తూ, ఎండ తీవ్రతను తట్టుకునేందుకు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా వడదెబ్బ ప్రమాదాల నుంచి మనల్ని మనం కాపాడుకోవచ్చు.