Amaravati: నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో తెలుగు జాతి గర్వించదగ్గ రీతిలో ఒక భారీ ప్రాజెక్టుకు అంకురార్పణ జరుగుతోంది. తెలుగు వారి ఆత్మగౌరవ ప్రతీక, స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి స్మృత్యర్థం నీరుకొండ కొండపై 600 అడుగుల భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టులో భాగంగానే రూ. 119 కోట్లతో 'తెలుగు కల్చరల్ సెంటర్' నిర్మాణానికి రాష్ట్ర క్యాబినెట్ ఇటీవల ఆమోద ముద్ర వేసింది. ఇది కేవలం ఒక విగ్రహం మాత్రమే కాకుండా, అంతర్జాతీయ స్థాయి పర్యాటక కేంద్రంగా విరాజిల్లబోతోంది.
నీరుకొండ భౌగోళికంగా అమరావతికి దక్షిణాన ఎత్తైన ప్రదేశంలో ఉండటం ఈ ప్రాజెక్టుకు ప్రధాన ఆకర్షణ. ఇక్కడ నిర్మించబోయే 600 అడుగుల విగ్రహం ప్రపంచంలోని ఎత్తైన విగ్రహాల సరసన నిలవనుంది. 'తారకరామం' అనే పేరుతో పిలవబడే ఈ స్మృతి వనంలో ఎన్టీఆర్ సినీ ప్రస్థానం, రాజకీయ ప్రయాణం ఆయన సాధించిన విజయాలను కళ్లకు కట్టేలా మ్యూజియంను ఏర్పాటు చేయనున్నారు. అమరావతి విజన్ మొత్తం ఈ కొండ పైనుంచి కనిపించేలా డిజైన్ చేయడం విశేషం.
సాంస్కృతిక కేంద్రం విషయానికొస్తే, ఇందులో ఒక భారీ ఆడిటోరియం, చారిత్రక పరిశోధనలకు ఉపయోగపడే లైబ్రరీ తెలుగు వారసత్వ సంపదను ప్రదర్శించే మ్యూజియం ఉంటాయి. తెలుగు భాష, సంస్కృతులకు పూర్వ వైభవం తీసుకురావడమే లక్ష్యంగా ఈ కేంద్రం పనిచేస్తుంది. విగ్రహ నిర్మాణంతో పాటు పారలల్ గా ఈ కల్చరల్ సెంటర్ పనులను కూడా పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. దీనికోసం ప్రత్యేక ప్యాకేజీల కింద టెండర్లను పిలవడానికి అధికారులు కసరత్తు చేస్తున్నారు.
ఈ ప్రాంతాన్ని 'బ్లూ అండ్ గ్రీన్ బెల్ట్'గా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం మాస్టర్ ప్లాన్ సిద్ధం చేసింది. నీరుకొండ చుట్టూ అందమైన సరస్సు, పచ్చని పార్కులు, అంతర్జాతీయ స్థాయి రిసార్టులు కన్వెన్షన్ సెంటర్లను నిర్మించనున్నారు. పర్యాటకులు ఇక్కడ బస చేసేందుకు వీలుగా రెస్టారెంట్లు, స్టేయింగ్ ఫెసిలిటీస్ కూడా అందుబాటులోకి రానున్నాయి. దీనివల్ల అమరావతికి వచ్చే పర్యాటకుల సంఖ్య పెరగడమే కాకుండా, స్థానికులకు ఉపాధి అవకాశాలు కూడా మెరుగుపడతాయి.
ప్రస్తుతం ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ఎగ్జిక్యూషన్ పార్ట్ వేగవంతం అయింది. ఇప్పటికే డిజైన్లు సిద్ధంగా ఉన్నందున, నెల రోజుల్లోనే టెండర్ల ప్రక్రియ పూర్తి చేసి పనులు ప్రారంభించాలని ప్రభుత్వం యోచిస్తోంది. విగ్రహ నిర్మాణానికి కనీసం ఏడాది సమయం పడుతుందని అంచనా వేస్తున్నందున, పనులన్నీ ఒకేసారి జరిగేలా విభాగాలుగా విభజించి బాధ్యతలు అప్పగించారు. రాబోయే రోజుల్లో అమరావతికి ఈ నీరుకొండ ప్రాజెక్ట్ ఒక తలమానికంగా నిలవనుంది.