గత వైసీపీ ప్రభుత్వ కాలంలో రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపిన మద్యం కుంభకోణం కేసు దర్యాప్తులో మరోసారి కీలక పరిణామం చోటుచేసుకుంది. కోట్లాది రూపాయల విలువైన అక్రమ లావాదేవీలు, బినామీ ఆస్తుల కొనుగోళ్లు, పన్ను ఎగవేత ఆరోపణలతో రాష్ట్ర ప్రజలను కుదిపేసిన ఈ కేసు తాజాగా మళ్లీ దృష్టిని ఆకర్షిస్తోంది. కేసును విచారిస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) దర్యాప్తు వేగాన్ని పెంచగా, ఈ క్రమంలో విజయవాడ ఏసీబీ కోర్టు పెద్ద నిర్ణయం తీసుకుంది. నిందితుల ఆస్తులను జప్తు చేయడానికి సిట్ దాఖలు చేసిన పిటిషన్పై కోర్టు అనుకూలంగా తీర్పు వెలువరించి, మొత్తం 11 మంది నిందితుల ఆస్తులను స్వాధీనం చేసుకునేందుకు అనుమతి మంజూరు చేసింది.
దర్యాప్తు సందర్భంగా సిట్ అధికారులు చెన్నైలోని బినామీ ఆస్తుల కొనుగోళ్లను గుర్తించారు. నిందితులు చెన్నైని కార్యకలాపాల కేంద్రంగా చేసుకొని పలు నకిలీ కంపెనీలు ఏర్పాటు చేసి, బ్యాంకు ఖాతాలు తెరిచి, విపరీతంగా ఆస్తులు కూడబెట్టినట్లు ఆధారాలు లభించాయి. ఈ క్రమంలోనే సిట్ అధికారులు చెన్నై స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ విభాగం ఐజీకి పలు మార్లు లేఖలు రాయడంతో పాటు ఇమెయిల్స్ పంపి ఆస్తుల రిజిస్ట్రేషన్ వివరాలు కోరారు. అయితే, అటువైపు నుంచి ఎటువంటి స్పందన రాకపోవడంతో విచారణలో ఆటంకం ఏర్పడింది. దాంతో సిట్ అధికారులు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.
దీనితో సిట్ రెండు వేర్వేరు పిటిషన్లు దాఖలు చేసింది. ఒకటిలో చెన్నై స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ శాఖకు సమాచారం అందించాలంటూ కోర్టు ఆదేశాలు ఇవ్వాలని కోరగా, మరొక పిటిషన్లో ప్రభుత్వం జారీ చేసిన జీవో నంబర్లు 111, 126 ప్రకారం నిందితులతో పాటు వారికి సహకరించిన మరో 11 మందికి చెందిన ఆస్తులను కూడా జప్తు చేసేందుకు అనుమతి ఇవ్వాలని విజ్ఞప్తి చేసింది. సిట్ సమర్పించిన ఆధారాలను, దర్యాప్తు పురోగతిని పరిశీలించిన ఏసీబీ కోర్టు, సిట్ వాదనలతో ఏకీభవిస్తూ రెండు పిటిషన్లపైనా అనుకూల తీర్పు ఇచ్చింది.
న్యాయమూర్తి పి. భాస్కరరావు శుక్రవారం ఇచ్చిన ఈ తీర్పుతో సిట్ దర్యాప్తు దిశా మార్చుకునే అవకాశం ఉంది. చెన్నైలోని ఆస్తుల రికార్డులు బయటపడటంతో, కుంభకోణ పరిమాణం మరింత స్పష్టమయ్యే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. ఈ కేసులో నిందితుల ఆర్థిక లావాదేవీలపై సిట్ ఇప్పటికే పలు ఆధారాలు సేకరించగా, ఇప్పుడు ఆస్తుల స్వాధీన ప్రక్రియ మొదలవడం దర్యాప్తుకు వేగం చేకూర్చనుంది. ఏసీబీ కోర్టు తాజా ఆదేశాలతో మద్యం కుంభకోణ దర్యాప్తు మరో దశలోకి ప్రవేశించిందని భావిస్తున్నారు.