Business- ఎలక్ట్రిక్ వాహనాల కోసం ఢిల్లీ సర్కార్ సరికొత్త ముసాయిదా.
ఈవీలు కొంటే భారీ రాయితీలు.. లక్షన్నర వరకు లబ్ధి!
కాలుష్యానికి చెక్: ఢిల్లీలో ఎలక్ట్రిక్ విప్లవం…
Bikes Regestrations: దేశ రాజధాని ఢిల్లీలో కాలుష్యాన్ని అరికట్టేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పెరుగుతున్న వాహన కాలుష్యానికి అడ్డుకట్ట వేస్తూ, ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించేందుకు "ఎలక్ట్రిక్ వెహికిల్ ముసాయిదా పాలసీ 2026-30"ని రవాణా శాఖ విడుదల చేసింది. ఈ నూతన విధానం ద్వారా రాబోయే కొద్ది సంవత్సరాల్లో పెట్రోల్ మరియు డీజిల్ వాహనాల రిజిస్ట్రేషన్లను పూర్తిగా నిలిపివేసి, ఢిల్లీని గ్రీన్ సిటీగా మార్చాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
ముసాయిదాలోని నిబంధనల ప్రకారం, 2027 జనవరి 1వ తేదీ నుంచి కేవలం ఎలక్ట్రిక్ త్రీ-వీలర్ల రిజిస్ట్రేషన్లకు మాత్రమే అనుమతి లభిస్తుంది. దీనిని అనుసరిస్తూ టూ వీలర్ల విభాగంలో కూడా భారీ మార్పులు రానున్నాయి. ఏప్రిల్ 1, 2028 నుంచి ఢిల్లీలో పెట్రోల్ ఆధారిత ద్విచక్ర వాహనాల రిజిస్ట్రేషన్లను పూర్తిగా నిలిపివేయనున్నారు. ఆ తేదీ నుంచి కేవలం ఎలక్ట్రిక్ మోడళ్లను మాత్రమే నమోదు చేసుకోవడానికి వీలుంటుందని అధికారులు స్పష్టం చేశారు.
ప్రజలు స్వచ్ఛందంగా ఎలక్ట్రిక్ వాహనాల వైపు మళ్లేలా ప్రభుత్వం భారీ ప్రోత్సాహకాలను ప్రకటించింది. ఈవీలను కొనుగోలు చేసే వారికి బ్యాటరీ సామర్థ్యాన్ని బట్టి కిలోవాట్ అవర్కు రూ. 10 వేల నుంచి రూ. 30 వేల వరకు సబ్సిడీ అందించనున్నారు. ఉదాహరణకు రెండున్నర లక్షల లోపు విలువైన టూ వీలర్ కొంటే ఈ రాయితీ వర్తిస్తుంది. అలాగే త్రీ-వీలర్ల కొనుగోలుపై మొదటి ఏడాది రూ. 50 వేల వరకు ప్రోత్సాహకం లభిస్తుంది, అయితే కాలక్రమేణా ఈ సబ్సిడీ మొత్తం తగ్గుతూ ఉంటుంది.
పాత వాహనాలను కలిగి ఉన్న వారు వాటిని తుక్కు (స్క్రాప్) కింద మార్చి కొత్త ఎలక్ట్రిక్ వాహనం కొనుగోలు చేస్తే అదనపు ప్రయోజనాలు కల్పించనున్నారు. వాహనదారుల సౌకర్యార్థం నగరం అంతటా ఛార్జింగ్ కేంద్రాలను భారీ స్థాయిలో ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది. దీనివల్ల ఛార్జింగ్ సమస్యలు తలెత్తకుండా ప్రయాణం సులభతరం అవుతుందని భావిస్తున్నారు. ఈ నిర్ణయాల వల్ల విద్యుత్ వినియోగం పెరిగినా, పర్యావరణానికి మేలు జరుగుతుందని ప్రభుత్వం నమ్ముతోంది.
ఈ ముసాయిదా పాలసీపై ప్రజల నుంచి సలహాలు, సూచనలు స్వీకరించేందుకు 30 రోజుల సమయం ఇచ్చారు. ప్రజల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాత ప్రభుత్వం తుది విధానాన్ని ఖరారు చేయనుంది. ప్రతి ఏటా శీతాకాలంలో ఢిల్లీని వణికిస్తున్న కాలుష్య కోరల నుంచి ప్రజలను కాపాడటమే ఈ పాలసీ ప్రధాన ఉద్దేశమని రవాణా శాఖ పేర్కొంది.