భారత ప్రభుత్వానికి చెందిన బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (BSF) క్రీడా ప్రతిభ కలిగిన యువతకు పెద్ద అవకాశాన్ని కల్పించింది. గ్రూప్ ‘సి’ నాన్-గెజిటెడ్, నాన్-మినిస్టీరియల్ కేటగిరీలో స్పోర్ట్స్ కోటా కింద కానిస్టేబుల్ (జనరల్ డ్యూటీ) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ప్రకటన ద్వారా మొత్తం 391 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇందులో పురుషులకు 197, మహిళలకు 194 పోస్టులు కేటాయించారు. ఈ అవకాశాన్ని అందిపుచ్చుకోవాలనుకునే క్రీడాకారులు 2025 నవంబర్ 4 లోపు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.
ఈ ఉద్యోగాలకు అథ్లెటిక్స్, బాక్సింగ్, బాస్కెట్బాల్, హాకీ, ఫుట్బాల్, స్విమ్మింగ్, షూటింగ్, జూడో, కరాటే, రెజ్లింగ్, వెయిట్లిఫ్టింగ్, వాలీబాల్, హ్యాండ్బాల్, టేబుల్ టెన్నిస్, ఆర్చరీ, బ్యాడ్మింటన్, సైక్లింగ్ వంటి విభాగాల్లో ప్రతిభ చూపిన క్రీడాకారులు అర్హులు. అభ్యర్థులు కనీసం మెట్రిక్యులేషన్ (10వ తరగతి) విద్యార్హత కలిగి ఉండాలి. అలాగే, 2023 నవంబర్ 4 నుంచి 2025 నవంబర్ 4 మధ్య జాతీయ లేదా అంతర్జాతీయ స్థాయిలో పతకం సాధించిన వారు లేదా పాల్గొన్న వారు దరఖాస్తు చేసుకోవచ్చు.
అభ్యర్థుల వయసు 2025 ఆగస్టు 1 నాటికి 18 నుంచి 23 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ వర్గాలకు 5 సంవత్సరాలు, ఓబీసీ వర్గాలకు 3 సంవత్సరాల వయోసడలింపు వర్తిస్తుంది. దరఖాస్తు ప్రక్రియ 2025 అక్టోబర్ 16 నుండి ప్రారంభమవుతుంది. యూఆర్, ఓబీసీ అభ్యర్థులు ₹159 రుసుము చెల్లించాలి. అయితే, ఎస్సీ, ఎస్టీ మరియు మహిళా అభ్యర్థులకు ఫీజు మినహాయింపు ఉంటుంది.
ఈ పోస్టులకు రాత పరీక్ష అవసరం లేదు. ఎంపిక ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ (PST), స్పోర్ట్స్ మెరిట్ లిస్ట్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా జరుగుతుంది. ఎంపికైన అభ్యర్థులకు నెలకు ₹21,700 నుంచి ₹69,100 వరకు వేతనం చెల్లిస్తారు. క్రీడా రంగంలో ప్రతిభ కనబరచిన యువతకు ఇది కేంద్ర ప్రభుత్వంలో ఉద్యోగ అవకాశాన్ని అందించే మంచి అవకాశం. ఆసక్తి గల వారు బీఎస్ఎఫ్ అధికారిక వెబ్సైట్లో నోటిఫికేషన్ను పరిశీలించి దరఖాస్తు చేయవచ్చు.