అమెరికా–వెనెజువెలా మధ్య కొనసాగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు భారత్పై తక్షణ ప్రభావం చూపబోవని బ్యాంక్ ఆఫ్ బరోడా తాజా నివేదిక స్పష్టం చేసింది. ప్రస్తుత పరిస్థితుల్లో భారత్ చమురు దిగుమతి వ్యయం పెరిగే అవకాశాలు లేవని ఈ నివేదిక భరోసా ఇచ్చింది. ప్రపంచ మార్కెట్లో ముడి చమురు సరఫరా డిమాండ్ను మించి ఉండటం (సప్లై గ్లట్), అలాగే అంతర్జాతీయ చమురు ఉత్పత్తిలో వెనెజువెలా వాటా కేవలం 1 శాతం మాత్రమే ఉండటం ఇందుకు ప్రధాన కారణాలుగా పేర్కొంది. అందువల్ల వెనెజువెలాలో రాజకీయ లేదా ఆర్థిక పరిణామాలు చోటుచేసుకున్నా భారత్ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని నివేదిక తేల్చిచెప్పింది.
బ్యాంక్ ఆఫ్ బరోడా విశ్లేషణ ప్రకారం, వెనెజువెలా వద్ద ప్రపంచంలోనే అతిపెద్ద నిరూపిత చమురు నిల్వలు ఉన్నాయి. మొత్తం ప్రపంచ నిల్వల్లో దాదాపు 19.4 శాతం వాటా వెనెజువెలాకే చెందుతుందని నివేదిక పేర్కొంది. ఈ భారీ నిల్వలను వెలికితీయడానికి అమెరికా కంపెనీలు రంగంలోకి దిగవచ్చన్న అంచనాలు మార్కెట్లో బలపడుతున్నాయి. దాంతో అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు ఇప్పటికే కొంతమేర తగ్గుముఖం పట్టాయి. ఈ పరిస్థితి భారత్ వంటి దిగుమతులపై ఆధారపడే దేశాలకు స్పష్టమైన లాభం చేకూర్చే అంశమని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
“ప్రస్తుత ప్రపంచ చమురు సరఫరా పరిస్థితులు, నిల్వల స్థాయిని పరిగణనలోకి తీసుకుంటే సమీప భవిష్యత్తులో భారత్ ఆయిల్ దిగుమతి బిల్లు పెరిగే ప్రమాదం కనిపించడం లేదు” అని నివేదిక స్పష్టం చేసింది. ఒకవేళ అమెరికా కంపెనీలు వెనెజువెలాలో ఉత్పత్తిని పెంచితే, అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు మరింత తగ్గే అవకాశముందని విశ్లేషకులు చెబుతున్నారు. ఇది భారత్తో పాటు ఇతర దిగుమతి దేశాలకు కూడా ఊరటనిచ్చే అంశంగా మారుతుందని వారు అభిప్రాయపడ్డారు.
భారత్–వెనెజువెలా ద్వైపాక్షిక వాణిజ్యాన్ని పరిశీలిస్తే ప్రస్తుతం ఇది సుమారు 1.9 బిలియన్ డాలర్లుగా ఉంది. ఇందులో భారత్ నుంచి వెనెజువెలాకు ఎగుమతులు 217 మిలియన్ డాలర్లు కాగా, దిగుమతులు 1.6 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. ఈ దిగుమతుల్లో పెట్రోలియం, ఆయిల్, లూబ్రికెంట్స్ (POL) వాటానే అధికం. “భారత్ దిగుమతి చేసుకుంటున్న ఇతర దేశాలతో పోలిస్తే వెనెజువెలా నుంచి వచ్చే ముడి చమురు యూనిట్ విలువ తక్కువగా ఉండటం మన దిగుమతి ఖర్చులను నియంత్రించడంలో సహాయపడుతోంది” అని బ్యాంక్ ఆఫ్ బరోడా ఆర్థికవేత్త దీపాన్వితా మజుందార్ వివరించారు. అయితే, గత ఐదేళ్లుగా వెనెజువెలాకు భారత్ చేస్తున్న ఎగుమతులు సగటున ఏటా 8.8 శాతం తగ్గుతుండటం ఆందోళనకర అంశమని నివేదిక పేర్కొంది. భౌగోళిక రాజకీయ అనిశ్చితి కారణంగా వెనెజువెలాలో భారీ పెట్టుబడులు తగ్గే అవకాశం ఉందని, ఇది భవిష్యత్ ఉత్పత్తిపై ప్రభావం చూపవచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు.