ఆంధ్రప్రదేశ్ను సాంకేతిక రంగంలో అగ్రగామిగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు అంతర్జాతీయ సంస్థలు ఆసక్తి చూపుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రముఖ రైడ్షేరింగ్ సంస్థ ఉబర్, విశాఖపట్నంలో తన సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కార్యకలాపాలను విస్తరించేందుకు సిద్ధమవుతున్నట్టు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెల్లడించారు.
గురువారం ఉబర్ గ్లోబల్ సీఈఓ దారా ఖోస్రోషాహీ నేతృత్వంలోని సంస్థ ప్రతినిధులతో ముఖ్యమంత్రి సమావేశమయ్యారు. అనంతరం సోషల్ మీడియా వేదిక ఎక్స్లో ఈ విషయాన్ని వెల్లడించారు.
ఆంధ్రప్రదేశ్లో ప్రతిభావంతులైన యువత అధికంగా ఉన్నారని, దేశవ్యాప్తంగా ఉబర్ కార్యకలాపాలకు రాష్ట్రం బలమైన టాలెంట్ హబ్గా మారే అవకాశాలు ఉన్నాయని సంస్థ ప్రతినిధులు పేర్కొన్నట్టు చంద్రబాబు తెలిపారు.
అంతేకాకుండా, అమరావతిలో రూపుదిద్దుకుంటున్న క్వాంటమ్ టెక్నాలజీ ఎకోసిస్టమ్పై కూడా ఉబర్ ప్రత్యేక ఆసక్తి చూపిందన్నారు. ఆధునిక లాజిస్టిక్స్ మేనేజ్మెంట్ అల్గోరిథమ్స్, భవిష్యత్ మొబిలిటీ ఆప్టిమైజేషన్ సిస్టమ్స్ రూపకల్పనలో అమరావతి క్వాంటమ్ టెక్నాలజీ సామర్థ్యాలను వినియోగించే అవకాశాలను పరిశీలిస్తున్నట్టు వెల్లడించారు.
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమరావతిని డీప్ టెక్ మరియు క్వాంటమ్ కంప్యూటింగ్ హబ్గా అభివృద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకోసం ఐబీఎం, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్), లార్సెన్ అండ్ టూబ్రో (ఎల్ అండ్ టీ) వంటి ప్రముఖ సంస్థల భాగస్వామ్యంతో “క్వాంటమ్ వ్యాలీ” ప్రాజెక్ట్ను ముందుకు తీసుకెళ్తోంది.
ఇక ఐటీ, హెచ్ఆర్డీ మంత్రి నారా లోకేష్ కూడా ఉబర్ ప్రతినిధులతో జరిగిన సమావేశంపై స్పందించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో కలిసి ఉబర్ సీనియర్ ఎగ్జిక్యూటివ్లతో విస్తృతంగా చర్చలు జరిపినట్టు తెలిపారు.
టెక్నాలజీ, భవిష్యత్ మొబిలిటీ, పట్టణాభివృద్ధి, యువతకు అవసరమైన భవిష్యత్ నైపుణ్యాలపై ఈ సమావేశంలో లోతైన చర్చలు జరిగినట్టు పేర్కొన్నారు.
ఉబర్ వంటి అంతర్జాతీయ సంస్థలు ఆంధ్రప్రదేశ్పై ఆసక్తి చూపడం రాష్ట్రానికి పెట్టుబడులు, ఉద్యోగ అవకాశాలు, సాంకేతిక అభివృద్ధికి కొత్త దారులు తెరుస్తుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.