Business- మళ్లీ పెరిగిన వంట గ్యాస్ ధర.. నేటి నుంచే కొత్త రేట్లు అమలు
90 రోజుల్లోనే రెండోసారి.. ఒక్కో సిలిండర్పై రూ. 29 భారం!
వంటింట్లో మంట: గృహ వినియోగ ఎల్పీజీ ధరను పెంచిన ఆయిల్ కంపెనీలు
LPG: గృహ వినియోగదారులకు ఆయిల్ కంపెనీలు మరోసారి గ్యాస్ ధరల షాక్ ఇచ్చాయి. కొద్ది రోజులుగా కేవలం వాణిజ్య (కమర్షియల్) సిలిండర్ల ధరలను మాత్రమే పెంచుతూ వచ్చిన ప్రభుత్వ రంగ చమురు సంస్థలు, ఇప్పుడు సామాన్యుడి వంట గ్యాస్ సిలిండర్ ధరను కూడా భారీగా పెంచేశాయి. గృహ అవసరాలకు ఉపయోగించే 14.2 కేజీల ఎల్పీజీ సిలిండర్ ధరను ఏకంగా రూ. 29 మేర పెంచుతూ ఆయిల్ కంపెనీలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. పెరిగిన ఈ కొత్త ధరలు ఈ రోజు నుంచే దేశవ్యాప్తంగా అమల్లోకి వస్తాయని ప్రకటించాయి.
గత మూడు నెలల స్వల్ప వ్యవధిలోనే గృహ వినియోగ గ్యాస్ ధరలు పెరగడం ఇది రెండో సారి కావడం గమనార్హం. అంతకుముందు మార్చి 7వ తేదీన చమురు కంపెనీలు సిలిండర్ ధరను రూ. 60 మేర పెంచాయి. ఇప్పుడు దానికి అదనంగా మరో రూ. 29 పెంచడంతో, కేవలం 90 రోజుల వ్యవధిలోనే సామాన్య మధ్యతరగతి కుటుంబాలపై ఒక్కో సిలిండర్ పైన దాదాపు రూ. 89 ల అదనపు భారం పడినట్లయింది. ఈ తాజా పెంపుతో దేశ రాజధాని ఢిల్లీలో ప్రస్తుతం రూ. 913 గా ఉన్న సిలిండర్ ధర రూ. 942 కి చేరింది.
ఐదు రాష్ట్రాల ఎన్నికల ప్రక్రియ ముగిసిన వెంటనే ప్రభుత్వం వరుసగా మూడు విడతలుగా పెట్రోల్, డీజిల్ ధరలను పెంచిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అదే దారిలో వంట గ్యాస్ ధరను కూడా పెంచడంతో ప్రజా బాహుళ్యం నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. దేశవ్యాప్తంగా ఇప్పటికే నిత్యావసర వస్తువుల ధరలు పెరిగి ద్రవ్యోల్బణ భారం మోస్తున్న తరుణంలో, ఈ గ్యాస్ ధరల పెంపుతో సామాన్యుడి వంటింటి బడ్జెట్ పూర్తిగా తలకిందులవుతుందని వినియోగదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
అంతర్జాతీయ మార్కెట్ పరిస్థితుల వల్లే ఈ ధరల పెంపు అనివార్యమైందని ఆయిల్ కంపెనీలు సమర్థించుకుంటున్నాయి. పశ్చిమాсиయా (మిడిల్ ఈస్ట్) ప్రాంతంలో నెలకొన్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, గ్లోబల్ మార్కెట్లో ఇంధన ధరల అస్థిరత దీనికి ప్రధాన కారణాలని పేర్కొన్నాయి. విదేశాల నుంచి దిగుమతి చేసుకునే ఎల్పీజీ ధరలు గణనీయంగా పెరగడంతో చమురు సంస్థలపై తీవ్ర ఆర్థిక ఒత్తిడి పెరుగుతోందని, గతంలో పెంచిన రూ. 60 కూడా ఈ నష్టాలను భర్తీ చేయలేకపోయిందని పరిశ్రమ వర్గాలు వెల్లడిస్తున్నాయి.
ప్రస్తుతం గృహ వినియోగ ఎల్పీజీ సిలిండర్ల విక్రయంపై కంపెనీలకు సుమారు రూ. 703 వరకు నష్టం వస్తోందని అంచనా. ఈ నష్ట తీవ్రతను తగ్గించుకోవడానికి మరియు అంతర్జాతీయ ఇంధన ధరల సవరణకు అనుగుణంగానే ఈ నిర్ణయం తీసుకోక తప్పలేదని కంపెనీలు స్పష్టం చేస్తున్నాయి. ఏది ఏమైనప్పటికీ, ఇప్పటికే పెరిగిన ధరలతో సతమతమవుతున్న సామాన్య, మధ్యతరగతి కుటుంబాలకు ఈ వంట గ్యాస్ ధరల పెంపు కోలుకోలేని దెబ్బగానే మారనుంది.