మౌలిక వసతుల అభివృద్ధికి భారీ ఊతం.. మోదీ చేతుల మీదుగా కీలక ప్రాజెక్టుల ప్రారంభం..
సూరత్లో రూ.18,800 కోట్ల ప్రాజెక్టులకు ప్రారంభం, శంకుస్థాపనలు..
దేశవ్యాప్తంగా మౌలిక వసతుల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తున్న నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం గుజరాత్, దమన్ ప్రాంతాల్లో పలు కీలక అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించనున్నారు. మొత్తం రూ.21,700 కోట్లకు పైగా విలువైన పనులకు ఆయన శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు నిర్వహించనున్నారు.
గుజరాత్లోని సూరత్లో ప్రధాని మోదీ రూ.18,800 కోట్లకు పైగా విలువైన వివిధ అభివృద్ధి ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టనున్నారు. రహదారులు, విద్యుత్, పారిశ్రామిక రంగాలకు సంబంధించిన పలు కీలక ప్రాజెక్టులను ప్రజలకు అంకితం చేయడంతో పాటు కొత్త పనులకు శంకుస్థాపనలు చేయనున్నారు.
అదేవిధంగా, సూరత్లో 200 పడకల సామర్థ్యంతో నిర్మించిన ఆధునిక ఈఎస్ఐసీ (ESIC) ఆసుపత్రిని ప్రధాని ప్రారంభించనున్నారు. ఈ ఆసుపత్రి ద్వారా పలు ప్రత్యేక వైద్య విభాగాల్లో ఆధునిక వైద్య సేవలు అందుబాటులోకి రానున్నాయి. కార్మికులు, వారి కుటుంబాలకు మెరుగైన వైద్య సదుపాయాలు అందుతాయని అధికారులు చెబుతున్నారు.
ఇక గుజరాత్ ప్రభుత్వం చేపట్టిన పలు ముఖ్య కార్యక్రమాలను కూడా ప్రధాని ప్రారంభించనున్నారు. విద్యుత్ పంపిణీ వ్యవస్థ ఆధునీకరణ, దహేజ్ పెట్రోలియం ప్రాంతంలో ఆధునిక మురుగునీటి శుద్ధి, వ్యర్థాల నిర్వహణ మౌలిక సదుపాయాల అభివృద్ధి వంటి కార్యక్రమాలు ఇందులో ఉన్నాయి.
సాయంత్రం దమన్కు వెళ్లనున్న ప్రధాని మోదీ అక్కడ సుమారు రూ.2,970 కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయనున్నారు. ఆరోగ్యం, పౌర విమానయానం, పర్యాటకం, మౌలిక సదుపాయాలు, రవాణా అనుసంధానం, ప్రజా సంక్షేమం వంటి అనేక రంగాలకు చెందిన ప్రాజెక్టులు ఇందులో ఉన్నాయి.
అలాగే రూ.1,340 కోట్ల విలువైన పూర్తయిన పలు ప్రాజెక్టులను ప్రధాని జాతికి అంకితం చేయనున్నారు. వీటిలో నూతన నమో (NAMO) విమానాశ్రయ టెర్మినల్ భవనం, నమో ఆసుపత్రి ప్రధాన ఆకర్షణలుగా నిలవనున్నాయి.
కొత్త విమానాశ్రయ టెర్మినల్ ప్రారంభంతో ప్రాంతీయ విమాన రవాణా మరింత మెరుగుపడటంతో పాటు, వాణిజ్య కార్యకలాపాలు, పర్యాటక రంగం, ఉపాధి అవకాశాలు పెరిగి స్థానిక ఆర్థికాభివృద్ధికి ఊతమిస్తాయని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
ఈ పర్యటన ద్వారా గుజరాత్, దమన్ ప్రాంతాల్లో మౌలిక వసతుల విస్తరణ, ఆరోగ్య సేవల మెరుగుదల, పారిశ్రామిక అభివృద్ధి, ప్రజా సంక్షేమ కార్యక్రమాలకు మరింత వేగం చేకూరనుందని భావిస్తున్నారు.