Andhra Pradesh Poultry News: ఆంధ్రప్రదేశ్లో కోడిగుడ్ల ధరలు ఒక్కసారిగా తగ్గిపోయాయి. గత కొద్ది రోజులుగా స్థిరంగా ఉన్న రేట్లు, ఇప్పుడు సగానికి పైగా పడిపోవడంతో పౌల్ట్రీ రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రాష్ట్రంలో ఉత్పత్తి భారీగా జరుగుతున్నప్పటికీ, ఎగుమతులు ఆగిపోవడంతో మార్కెట్లోనే నిల్వలు ఉండిపోతున్నాయి. డిమాండ్ లేక స్టాక్ అంతా ఫౌల్ట్రీలలోనే ఆగిపోవడంతో ధరలపై తీవ్ర ప్రభావం పడింది. ఒకవైపు నిర్వహణ ఖర్చులు పెరగడం, మరోవైపు గిట్టుబాటు ధర లేకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.
ప్రస్తుతం పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతలు మన రాష్ట్రంలోని కోడిగుడ్డు మార్కెట్ను కోలుకోలేని దెబ్బ తీశాయి. ఇజ్రాయెల్ - ఇరాన్ దేశాల మధ్య జరుగుతున్న యుద్ధం కారణంగా సముద్ర, గగనతల మార్గాలపై ఆంక్షలు విధించారు. దీనివల్ల చెన్నై పోర్టు ద్వారా గల్ఫ్ దేశాలకు వెళ్లాల్సిన ఎగుమతులు పూర్తిగా నిలిచిపోయాయి. మన దేశం నుండి వెళ్లే గుడ్లకు గల్ఫ్ దేశాల్లో మంచి డిమాండ్ ఉంటుంది, కానీ రవాణా మార్గాలు మూసుకుపోవడంతో ఆ ప్రభావం నేరుగా ఏపీ మార్కెట్పై పడింది.
ఆంధ్రప్రదేశ్లో రోజుకు సుమారు 5 కోట్ల గుడ్లు ఉత్పత్తి అవుతున్నాయి. ఇందులో రాష్ట్ర అవసరాలకు సగం మాత్రమే సరిపోతాయి. మిగిలిన సగం ఇతర రాష్ట్రాలకు లేదా విదేశాలకు వెళ్లాలి. ఇప్పుడు ఎగుమతులు తగ్గడంతో గుడ్లన్నీ ఇక్కడే ఆగిపోయాయి. డిమాండ్ లేకపోవడంతో ధరలు అమాంతం పడిపోయాయి. ఒకప్పుడు వంద గుడ్ల ధర రికార్డు స్థాయిలో రూ. 678 పలికగా, ఇప్పుడు అది రూ. 420కి చేరింది. అంటే ఒక్కో గుడ్డు హోల్సేల్ ధర కేవలం రూ. 4.20 మాత్రమే.
హోల్సేల్ మార్కెట్లో ధరలు ఇంతలా పడిపోయినా, రిటైల్ మార్కెట్లో మాత్రం అంత భారీగా తగ్గలేదు. ప్రస్తుతం బయట కిరాణా షాపుల్లో ఒక్కో గుడ్డును రూ. 5.50 నుండి రూ. 6 వరకు విక్రయిస్తున్నారు. చికెన్ షాపుల్లో రూ. 5 కే లభిస్తోంది. దేశంలోని కొన్ని ప్రాంతాల్లోనైతే గుడ్డు ధర రూ. 3.30కి పడిపోయిందనే వార్తలు వినిపిస్తున్నాయి. దీనివల్ల కోళ్లకు పెట్టే మేత ఖర్చు కూడా రావడం లేదని రైతులు వాపోతున్నారు.
కేవలం కోడిగుడ్లే కాకుండా ఈ యుద్ధ ప్రభావం పెట్రోల్, డీజిల్, గ్యాస్ వంటి నిత్యావసరాల మీద కూడా పడే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే పంటల ఎగుమతులు కూడా ఆగిపోవడంతో రైతులు నష్టపోయే ప్రమాదం ఉంది. యుద్ధం గనుక ఇలాగే కొనసాగితే మున్ముందు ఆర్థిక ఇబ్బందులు తప్పవని పౌల్ట్రీ రంగాన్ని ఆదుకోవడానికి ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.