- శరవేగంగా సాగుతున్న పోలవరం ఎడమ కాలువ పనులు…
- Politics: నిర్వాసితులకు జగన్ హయాంలో తీవ్ర అన్యాయం చేయగా..
Minister Nimmala: కూటమి ప్రభుత్వం చెప్పింది చేస్తుంది, చేసేదే చెబుతుంది. ప్రజలకు జవాబుదారీతనంగా ఉంటుందని రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు అన్నారు. పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్టు ఎడమ ప్రధాన కాలువ పనులను ఆయన శనివారం నాడు అన్నవరం సమీపంలోని పంపా ఆక్విడెక్టు, తుని మండలం లోని కుమ్మరిలోవ గ్రామం మరియు తదితర ప్రాంతాలలో క్షేత్ర స్థాయి లో పర్యవేక్షించారు. తునిలో ఈ కాల్వ పనులకు సంబంధించిన ఇంజనీరింగ్ నిపుణులు, అధికారులు, కాంట్రాక్ట్ ఏజెన్సీల ప్రతినిధులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఆయన పర్యటన తాలూకు విశేషాలను, సమీక్షలో చర్చించిన అంశాలను మీడియా దృష్టికి తీసుకొచ్చారు. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు గోదావరి జలాలను మొదటి దశ లో, జూన్ లోగా అనకాపల్లి వరకు తీసుకెళ్తామని రామానాయుడు చెప్పారు.
నాడు జగన్ ఐదేళ్ల వికృత పాలన, విధ్వంసపాలన, తిరోగమన పాలనలో పోలవరం ఎడమ కాలువ పనులను గాలికి వదిలేసారని ఆయన విమర్శించారు. అర బస్తా సిమెంట్ గాని, తట్టమట్టి గాని వేసిన దాఖలాలు లేవన్నారు. ఐదేళ్ల ఆ పాలనకు అలవాటు పడ్డ అధికార యంత్రాంగం తమ తీరు మార్చుకోవాలని, గడువు లోపల పనులు పూర్తిచేయాలని హెచ్చరించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన తొలి ప్రాధాన్యంగా పోలవరం ప్రాజెక్టుని సందర్శించారన్నారు. ఆ వెనువెంటనే అనకాపల్లి కొచ్చి ఎడమ కాలువ పనులు సందర్శించి జూన్ లోగా పనులు పూర్తి చేయాలని గడువు నిర్దేశించిన విషయాన్ని రామానాయుడు గుర్తు చేశారు.
పోలవరం ఎడమ ప్రధాన కాలువ పనులు ఇప్పటివరకు 76 శాతం పూర్తయినట్లు రామానాయుడు చెప్పారు. జగన్ హయాంలో ఎక్కడి పనులు అక్కడే ఆపేయడం వల్ల ప్రగతిని 20 ఏళ్లు వెనక్కి నెట్టేసాడని మంత్రి ధ్వజమెత్తరు. పోలవరం ప్రాజెక్టు కి, కుడి, ఎడమ కాలువలకు భూములు, ఆస్తులు ఇచ్చిన నిర్వాసితులకు కూటమి ప్రభుత్వం ఎంతో ప్రాధాన్యమిస్తోందని నిమ్మల వివరించారు. నిర్వాసితులకు జగన్ హయాంలో తీవ్ర అన్యాయం చేయగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు హయాంలో 2016, 2025 లలో మొత్తం మూడు దఫాలుగా 2200 కోట్లు ఇచ్చి నిర్వాసితులను నిండు మనసుతో ఆదుకున్నారన్నారు. కుమ్మరిలోవ గ్రామంలోని 472 కుటుంబాలకు 30.3 కోట్లు నష్టపరిహారం అందించామన్నారు.
అత్యంత ప్రతిష్టాకరమైన, అలాగే ఉత్తరాంధ్ర ఉజ్వల భవిష్యత్తుకు మూలమైన పోలవరం ఎడమ కాలువ పనులు చేపట్టు నిమిత్తం రూ.1460 కోట్లు కేటాయించిన ఘనత తెలుగుదేశం, జనసేన, భాజపా కూటమి ప్రభుత్వానిదేనన్నారు. అన్నవరం సమీపంలోని ఆరెంపూడి, గవరయ్య కోనేరు గ్రామాల దగ్గర హైవే క్రాసింగ్ వంతెనల నిర్మాణ పనులను పర్యవేక్షించారు. నేషనల్ హైవేల క్రాసింగ్ దగ్గర వంతెనల నిర్మాణ పనులు వేగవంతం చేయాలని అధికారులకు సూచించారు. పనులు ఆలస్యం చేస్తే, ఉపేక్షించేది లేదని అధికారులు, ఏజెన్సీ లను మరో మారు హెచ్చరించారు.
ఉత్తరాంధ్రలో సాగు, తాగు, పారిశ్రామిక అవసరాలు తీర్చడంలో గోదావరి జలాలు ఎంతో కీలక మైనవిగా స్పష్టం చేశారు. ఉత్తరాంధ్ర కు గోదావరి జలాలు తరలించడానికి, పోలవరం ఎడమ ప్రధాన కాలువే ఆధారం కనుక ఫస్ట్ పేజ్ పూర్తి చేయడం ఎంతో కీలకమని అధికార యంత్రాంగానికి తెలియచెప్పారు. అనకాపల్లి కేంద్రంగా వస్తున్న భారీ పరిశ్రమలకు సైతం నీటి సమస్య లేకుండా గోదావరి జలాలు అందిస్తా మన్నారు. పోలవరం లెఫ్ట్ కెనాల్ పనులను ప్రీ క్లోజర్ చేసి ఉత్తరాంధ్ర ప్రజలపై జగన్ కక్ష కట్టిన వైనాన్ని ఎండగట్టారు.
పోలవరం లెప్ట్ కెనాల్ సామర్ద్యాన్ని 17,500 క్యూసెక్కుల నుండి 8,122 క్యూసెక్కులకు తగ్గిస్తూ ఉత్తరాంధ్ర ప్రయోజనాలకు జగన్ నాడు గండికొట్టాడన్నారు. పోలవరం ఎడమ కాలువ పూర్తి చేయడం ద్వారా కాలువ మొదటి నుంచి తుని వరకు ఉన్న 110 మైనర్ ఇరిగేషన్ ట్యాంకులు నిండి, 28,557 ఎకరాల ఆయకట్టు స్ధిరీకరణ జరుగుతుందన్నారు. పిఠాపురం అప్ టేక్ స్లూయిజ్ నిర్మాణం పూర్తయి 67674 ఎకరాల, ఏలేరు ఆయకట్టు స్ధిరీకరణ జరుగుతుందని మంత్రి చెప్పారు. అలాగే ఎడమ ప్రధాన కాలువ ప్రవహించే మార్గమధ్యంలో ఉన్న 143 గ్రామాలకు చెందిన 5.23 లక్షల మంది జనాభాకు తాగు నీరు సౌకర్యం కలుగుతుందన్నారు. పాయకారావుపేటకి ఎగువన ఉన్న 98 మైనర్ ఇరిగేషన్ ట్యాంకులు నిండటం ద్వారా 48,368 ఎకరాల ఆయకట్టు స్ధిరీకరణ జరుగుతుందని రామానాయుడు వివరించారు.