బలహీన వర్గాల అభ్యున్నతికి కూటమి ప్రభుత్వం పెద్దపీట..
బీసీలకిచ్చిన హామీలన్నీ నెరవేరుస్తున్నాం..
అమరావతి: బీసీల అభివృద్ధి కోసం కూటమి ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖ మంత్రి ఎస్. సవిత పేర్కొన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు గుండె చప్పుడు బీసీలేనని, వారి సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్నారని తెలిపారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో టీడీపీ బీసీ సాధికార సమితి కన్వీనర్లు, జోనల్ కోఆర్డినేటర్లతో ఆమె ఆత్మీయ సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, బీసీలకు రాజకీయ, ఆర్థిక, సామాజిక రంగాల్లో మరింత ప్రాధాన్యం కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. బీసీ రక్షణ చట్టానికి తుది రూపు ఇస్తున్నామని, స్థానిక సంస్థల్లో 34 శాతం రిజర్వేషన్ల అమలుకు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. మాజీ ఐఎఎస్ అధికారి రాజీవ్ రంజన్ మిశ్రా నేతృత్వంలో ఈ కమిటీ పనిచేస్తోందన్నారు. అలాగే చట్టసభల్లోనూ బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపినట్లు తెలిపారు.
ఆదరణ 3.0 పథకం అమలుపై కన్వీనర్ల అభిప్రాయాలు తెలుసుకోవడానికే ఈ సమావేశం నిర్వహించినట్లు మంత్రి చెప్పారు. అన్న ఎన్టీఆర్ స్థాపించిన టీడీపీ బీసీల సాధికారతకు బాటలు వేసిందని, అదే స్ఫూర్తితో సీఎం చంద్రబాబు పాలన సాగిస్తున్నారని పేర్కొన్నారు.
గత ప్రభుత్వ కాలంలో బీసీలకు తీవ్ర అన్యాయం జరిగిందని మంత్రి సవిత ఆరోపించారు. బీసీలపై 26 వేలకుపైగా అక్రమ కేసులు పెట్టారని, దాడులు, హత్యలు జరిగాయని ఆవేదన వ్యక్తం చేశారు. బీసీ సబ్ ప్లాన్ నిధులు రూ.75,760 కోట్లకు పైగా దారి మళ్లించారని విమర్శించారు. స్థానిక సంస్థల్లో 34 శాతం రిజర్వేషన్లను 24 శాతానికి తగ్గించి వేలాది మంది బీసీలను పదవులకు దూరం చేశారని అన్నారు. ఆదరణ పథకాన్ని నిలిపివేయడంతో కుల వృత్తులు దెబ్బతిన్నాయని తెలిపారు.
అయితే కూటమి ప్రభుత్వం వచ్చాక బీసీలకు మళ్లీ మంచి రోజులు వచ్చాయని చెప్పారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తున్నామని, త్వరలోనే బీసీ రక్షణ చట్టానికి తుది రూపు తీసుకొస్తామని స్పష్టం చేశారు.
టీడీపీలో కార్యకర్తలకు గౌరవం ఉందని, సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ కార్యకర్తలను కుటుంబ సభ్యుల్లా చూసుకుంటున్నారని మంత్రి సవిత పేర్కొన్నారు. సంక్షేమంతో పాటు అభివృద్ధిని సమన్వయం చేస్తూ ముందుకు సాగుతున్నామని తెలిపారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ జెండా ఎగరవేయాలని నాయకులకు పిలుపునిచ్చారు. అనంతరం కన్వీనర్లు, కోఆర్డినేటర్లను ఆమె సత్కరించారు.
ఇదే సందర్భంలో సీఎం చంద్రబాబుకు ‘బిజినెస్ రిఫార్మర్ అవార్డు’ లభించడంపై మంత్రి సవిత హర్షం వ్యక్తం చేశారు. ‘స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’, ‘స్పీడ్ ఆఫ్ డెలివరింగ్ గవర్నెన్స్’ వంటి విధానాలతో రాష్ట్రానికి పెట్టుబడులు ఆకర్షిస్తున్నారని కొనియాడారు. ఐటీ, ఎలక్ట్రానిక్స్, గ్రీన్ ఎనర్జీ, హార్టీకల్చర్ రంగాల్లో ఏపీని గ్లోబల్ హబ్గా తీర్చిదిద్దే దిశగా సీఎం కృషి చేస్తున్నారని తెలిపారు.
విజన్ 2047 లక్ష్యంతో రాష్ట్రాన్ని దేశంలో అగ్రగామిగా నిలబెట్టేందుకు ఆయన శ్రమిస్తున్నారని అభినందించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేషన్ చైర్మన్లు, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.