• గిఫ్ట్ సెటిల్మెంట్ భూమిపై కబ్జాదారుల కన్ను.. పొలంలోకి రానివ్వకుండా అడ్డుకుంటూ దూషణలు..
• అర్జీలు స్వీకరించి సమస్యల పరిష్కారానికి కృషి చేసిన నేతలు..
• రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, ఏపీఎస్ఆర్టీసీ ఛైర్మన్ కొనకళ్ళ నారాయణరావు…
Praja Vedika: గుంటూరు జిల్లా వెంగళాయపాలెంకు చెందిన సాంబశివరావు నేడు టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన ప్రజావినతుల స్వీకరణ కార్యక్రమంలో నేతలకు అర్జీ ఇచ్చి అభ్యర్థిస్తూ.. సర్వే నంబర్ 2 లోని తన స్థలంలో ఇల్లు కట్టుకుంటుండగా, వైసీపీ నేత కిరణ్ కుమార్, మరికొందరు ఇది ప్రభుత్వ స్థలమని సాకు చూపుతూ అక్రమంగా అడ్డుకున్నారు. స్థానిక పంచాయతీ సెక్రటరీపై ఒత్తిడి తెచ్చి, ఎమ్మెల్యే ఆదేశాలంటూ ఇంటి నిర్మాణాన్ని నిలిపివేయించారు. తన చుట్టుపక్కల సుమారు 30 కుటుంబాలు ఇళ్లు కట్టుకుని నివసిస్తున్నా, కేవలం తనను మాత్రమే లక్ష్యంగా చేసుకుని వేధించారు. దీనిపై ఎమ్మెల్యే గారిని కలిసి ఫిర్యాదు చేస్తే తమనే కట్టుకోమని ఆదేశించారు. అయిన కూడా వారు తమను ఇళ్లు కట్టుకోనివ్వకుండా అడ్డుపడుతున్నారు. కావున వారిపై చర్యలు తీసుకోని తమ సమస్యను పరిష్కరించాలని నేతలు రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, ఏపీఎస్ఆర్టీసీ ఛైర్మన్ కొనకళ్ళ నారాయణరావులకు అర్జీ ఇచ్చి అభ్యర్ధించాడు.
వైఎస్ఆర్ కడప జిల్లా లింగాల మండలం పొర్నపల్లి గ్రామానికి చెందిన రాము గ్రీవెన్స్ లో అర్జీ ఇచ్చి విజ్ఞప్తి చేస్తూ.. తమ అమ్మగారి పేరు మీద ఉన్న భూమిని (సర్వే నెంబర్ 126లో కొంత భాగం సర్వే చేయించి రికార్డుల్లో నమోదు చేయాలని గతంలోనే (18-08-2025న) విన్నవించుకున్నాను. దీనిపై స్పందించిన ఆర్డీవో గారు, సర్వే చేయాల్సిందిగా మండల, విలేజ్ సర్వేయర్లను ఆదేశించారు. అయితే నేను సర్వే కోసం ఫీజు చెల్లించి అన్ని సిద్ధం చేసుకున్నప్పటికీ, పక్కనే భూములు ఉన్న J. రాజా, J. రంగనాయుడు, ఇతరులు సర్వేకు రాకుండా అడ్డుపడుతున్నారు. అంతేకాకుండా తమ అమ్మగారి భూమిలోకి వెళ్లే దారిని కూడా మూసివేసి మమ్మల్ని మానసికంగా, ఆర్థికంగా చాలా ఇబ్బందులకు గురిచేస్తున్నారు. ముఖ్యంగా వీరు 1994లో సర్వే నెంబర్ 126లో కేవలం 80 సెంట్ల భూమిని మాత్రమే కొనుగోలు చేశారు. కానీ ఇప్పుడు అక్రమంగా 1 ఎకరం 30 సెంట్లు ఇస్తేనే సర్వే చేయనిస్తాం, లేదంటే లేదు అని బెదిరిస్తున్నారు. నిబంధనల ప్రకారం తమ భూమిని తమకు దక్కకుండా చేసి, అదనపు భూమిని ఆక్రమించుకోవాలని చూస్తున్నారు. కావున వారిపై చర్యలు తీసుకోని తమ సమస్యను పరిష్కరించాలని కోరాడు.
బాపట్ల జిల్లా కర్లపాలెం మండలం బత్తులవారిపాలెం గ్రామానికి చెందిన నాగేంద్రమ్మ గ్రీవెన్స్ లో అర్జీ ఇచ్చి విజ్ఞప్తి చేస్తూ.. తమ మామగారు చిమటా రామయ్య గారికి గణపవరం రెవెన్యూలో సర్వే నెం. 351/9లో 1.26 ఎకరాలు, 314/6లో 0.14 ఎకరాలు (మొత్తం 1.40 ఎకరాలు) భూమి ఉంది. దీనికి సంబంధించి 28-07-1950 నాటి రిజిస్టర్ డాక్యుమెంట్ (నెం. 1522/1950) తమ దగ్గర ఉంది. నేను వారి యోగక్షేమాలను చూసినందుకు గాను, ఆయన 17-02-1992న ఈ భూమిని తనకు గిఫ్ట్ సెటిల్మెంట్ ద్వారా ఇచ్చారు. 2013 వరకు రికార్డులన్నీ తన పేరు మీదనే ఉన్నాయి. తన పేరు మీద ఉన్న ఈ భూమిని యలవల అర్జున్ రావు, మిరియాల శోభారాణి అనే వ్యక్తులు అక్రమ మార్గాల్లో 2022, 2024 సంవత్సరాల్లో వారి పేర్ల మీద ఆన్లైన్ (1B అడంగల్) చేయించుకున్నారు. టవర్తి సత్యవతి అనే ఆమెకు గతంలో కేవలం 1.00 ఎకరం భూమిని మాత్రమే రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. కానీ ఆమె కుమారుడు తటవర్తి సాయి, తన అనుచరులతో కలిసి తన పేరు మీద ఉన్న మిగిలిన 1.36 ఎకరాల భూమిని కూడా ఆక్రమించుకోవాలని చూస్తున్నారు. గత 5 ఏళ్లుగా పొలంలోకి రానివ్వకుండా అడ్డుకుంటున్నారు. తన భర్త వికలాంగుడు అని కూడా చూడకుండా మమ్మల్ని అసభ్య పదజాలంతో దూషిస్తూ దౌర్జన్యం చేస్తున్నారు. కావున వారిపై చర్యలు తీసుకోని తమ సమస్యను పరిష్కరించాలని కోరారు.
ఎన్టీఆర్ జిల్లా మైలవరంకు చెందిన దార్ల కృష్ణ గ్రీవెన్స్ లో అర్జీ ఇచ్చి విజ్ఞప్తి చేస్తూ.. తన రెండో కుమార్తె రాధికను తమిళనాడులోని కుంభకోణానికి చెందిన అమృత లింగంకు ఇచ్చి వివాహం చేశారు. పెళ్లయిన కొంతకాలానికే అదనపు కట్నం కోసం వేధింపులు మొదలయ్యాయి. అత్తమామలు, భర్త వేధింపులు తట్టుకోలేక మైలవరం పోలీస్ స్టేషన్లో 498A కేసు పెట్టింది. ప్రస్తుతం ఈ కేసు మైలవరం కోర్టులో పెండింగ్లో ఉంది. కోర్టు వారు నిందితులకు ఎన్నిసార్లు సమన్లు జారీ చేసినా, మైలవరం పోలీసులు మాత్రం ముద్దాయిలకు నోటీసులు అందజేయడంలో జాప్యం చేస్తున్నారు. దీనివల్ల కేసు కాలయాపన జరుగుతూ తన కుమార్తెకు తీవ్ర నష్టం వాటిల్లుతోంది. కావున వారిపై చర్యలు తీసుకోని తమ సమస్యను పరిష్కరించాలని కోరాడు.
పల్నాడు జిల్లా రొంపిచర్ల మండలం సంతగుడిపాడు గ్రామానికి చెందిన కొత్తపల్లి శ్రీనివాసురావు గ్రీవెన్స్ లో అర్జీ ఇచ్చి విజ్ఞప్తి చేస్తూ..తమ గ్రామంలో తమకు 3 ఎకరాల భూమి ఉంది. గతంలో ప్రభుత్వ కాలువ సౌకర్యం లేని కారణంగా, రైతుల మధ్య ఒప్పందం ప్రకారం ఒక బోద కాలువ ద్వారా తమ పొలానికి నీరు వచ్చేది. కానీ గత 10 ఏళ్లుగా పక్కనే ఉన్న రైతులు ఆ బోద కాలువను పూడ్చివేయడం వల్ల తమ పొలానికి నీరు అందక తీవ్రంగా నష్టపోతున్నాము. దీనిపై ఇప్పటికే రెవెన్యూ అధికారులకు కలెక్టర్ గారికి 5-6 సార్లు విన్నవించుకున్నాను. అయితే, "ఇది మాకు సంబంధం లేని విషయం" అని వారు సమాధానం ఇస్తున్నారు. ప్రస్తుతం ప్రభుత్వ నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ కాలువ తమ పొలం సమీపం వరకు వచ్చి ఉంది. ఆ NSP కాలువను తమ పొలానికి వచ్చేలా అనుసంధానం చేస్తే తమ నీటి సమస్య శాశ్వతంగా తీరుతుంది. ఈ పనులకు అయ్యే ఖర్చును కూడా మేము భరించడానికి సిద్ధంగా ఉన్నాము. కావున తమయందు దయవుంచి తమ సమస్యను పరిష్కరించాలని అధికారులకు ఆదేశాలు ఇవ్వాలని కోరాడు.
మార్కాపురం జిల్లా తిప్పాయపాలెం గ్రామానికి చెందిన దుగ్గిరెడ్డి మునిరెడ్డి గ్రీవెన్స్ లో అర్జీ ఇచ్చి విజ్ఞప్తి చేస్తూ..తమ కుటుంబానికి చెందిన సర్వే నెంబర్లు 547, 548/1, 669లోని సుమారు 17.42 ఎకరాల భూమిపై కోర్టు ఉత్తర్వులు, సబ్ కలెక్టర్ ఆదేశాలు ఉన్నప్పటికీ, ప్రత్యర్థులు ఆ భూమిని అక్రమంగా ఆక్రమించుకున్నారు. దీనిపై గతంలో ఫిర్యాదు చేయగా ఎఫ్.ఐ.ఆర్ (190/22, 191/22)లు నమోదైనప్పటికీ, స్థానిక పోలీసు, రెవెన్యూ అధికారులు కుమ్మక్కై ఆ కేసులను నీరుగార్చారు. తహశీల్దార్ ఇచ్చిన సెక్షన్ 145 ఉత్తర్వులను కూడా బేఖాతరు చేస్తూ ఆక్రమణదారులు సాగు చేస్తున్నా, పోలీసులు వారిపై చర్యలు తీసుకోకుండా తననే బెదిరిస్తున్నారు. కలెక్టర్ గారికి పంపిన అర్జీలను కూడా అధికారులకు తప్పుడు రిపోర్టులు పంపి దారి మళ్లించారు. కావున వారిపై చర్యలు తీసుకోని తమ సమస్యను పరిష్కరించాలని కోరాడు.
గుంటూరుకు చెందిన ఘన శ్యామాచార్యులు గ్రీవెన్స్ లో అర్జీ ఇచ్చి విజ్ఞప్తి చేస్తూ..శ్రీకాకుళం జిల్లా, నర్సన్నపేట మండలం (ప్రస్తుతం పోలాకి మండలం) పరిధిలోని తలసముద్రం, జొన్నాం గ్రామాల్లో తమకి మొత్తం 32.80 ఎకరాల వారసత్వ భూమి ఉంది. తలసముద్రం గ్రామంలోని 22.80 ఎకరాల భూమిని ఎటువంటి దస్తావేజులు లేకపోయినా.. డోలా తిరుమల రావు, డోలా మోహినీ కుమారి, పోతుల వెంకటేష్ తదితరులు అప్పటి రెవెన్యూ అధికారుల సహకారంతో అడంగల్, 1-బి రికార్డుల్లో తమ పేర్లు నమోదు చేయించుకున్నారు. జొన్నాం గ్రామంలోని 10 ఎకరాల భూమిని అప్పటి వీఆర్వో చంద్రమతి భీమారావు తన పేరుపై రికార్డుల్లో నమోదు చేసుకున్నారు. ప్రస్తుతం ప్రభుత్వం చేపడుతున్న రీ-సర్వేను అడ్డు పెట్టుకుని, ఈ తప్పుడు రికార్డుల ఆధారంగా శాశ్వత హక్కులు పొందాలని కబ్జాదారులు ప్రయత్నిస్తున్నారు. దీనిపై పలుమార్లు అధికారులకు ఫిర్యాదు చేసిన న్యాయం జరగలేదు. కావున వారిపై చర్యలు తీసుకోని తమ సమస్యను పరిష్కరించాలని కోరాడు.
వీటితో పాటు పలువురు పింఛన్, రేషన్, ఇళ్ల నిర్మాణాల సమస్యలపై అర్జీలు ఇచ్చి పరిష్కరించాలని కోరగా.. మరికొందరు ఉద్యోగాల కోసం రెస్యూమ్ లు ఇచ్చారు. అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నాం ఆర్ధికతోడ్పాటు కల్పించాలని మరికొందరు అభ్యర్థనలు అందించారు.