చారిత్రక థానే బ్రిడ్జ్తో 173 ఏళ్ల రైల్వే ప్రయాణం..
తొలి రైలు నుంచి అమృత భారత్ వరకు.. అభివృద్ధి పథంలో భారత రైల్వే..
భారత రైల్వే చరిత్రలో ఒక కీలక ఘట్టంగా నిలిచిన తొలి ప్రయాణికుల రైలు ప్రారంభానికి 173 సంవత్సరాలు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ఆ చారిత్రక సందర్భాన్ని గుర్తుచేసుకుంటూ ప్రత్యేకంగా స్పందించారు.
1853 ఏప్రిల్ 16న దేశంలో తొలి ప్రయాణికుల రైలు ముంబైలోని బోరి బందర్ నుండి థానే వరకు ప్రయాణించింది. ఈ ప్రయాణం భారత రైల్వేలకు శ్రీకారం చుట్టిన తొలి అడుగుగా నిలిచింది. అదే చారిత్రక ప్రయాణాన్ని స్మరించుకుంటూ మంత్రి సోషల్ మీడియా ద్వారా థానే రైల్వే బ్రిడ్జ్ మరియు ఆ కాలం నాటి రైలు చిత్రాలను పంచుకున్నారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ “ఈ ప్రయాణం ఇంకా కొనసాగుతూనే ఉంది” అని పేర్కొన్నారు. భారత రైల్వేల సుదీర్ఘ వారసత్వాన్ని, అభివృద్ధిని ప్రతిబింబించేలా ఒక ప్రత్యేక కొలాజ్ను కూడా విడుదల చేశారు. ఇందులో ఒకవైపు చారిత్రక థానే బ్రిడ్జ్ అసలు చిత్రాన్ని, మరోవైపు ఆధునిక ‘అమృత భారత్ ఎక్స్ప్రెస్’ రైలును చూపించారు.
కేంద్ర రైల్వే విడుదల చేసిన ప్రకటన ప్రకారం, ఈసారి ఉపయోగించిన థానే బ్రిడ్జ్ ఫోటో పూర్తిగా చారిత్రకంగా ధృవీకరించబడినదే అని తెలిపారు. గతంలో ప్రచారంలో ఉన్న కొన్ని తప్పుదారి పట్టించే చిత్రాలపై వచ్చిన అనుమానాలకు ఇది సమాధానమని అధికారులు పేర్కొన్నారు.
ఈ వార్షికోత్సవం భారత రైల్వేల గొప్ప చరిత్రను మాత్రమే కాదు, నిరంతర అభివృద్ధిని కూడా గుర్తు చేస్తోంది. చిన్న ప్రయాణంతో ప్రారంభమైన రైల్వే వ్యవస్థ, నేడు ప్రపంచంలోనే అతిపెద్ద రైల్వే నెట్వర్క్లలో ఒకటిగా ఎదగడం భారతదేశానికి గర్వకారణంగా నిలిచింది.