AC Prices India 2026: సాధారణంగా ఎండలు ముదురుతున్నాయంటే చాలు.. మధ్యతరగతి ఇళ్లలో ఏసీల సందడి మొదలవుతుంది. కానీ ఈ ఏడాది ఏసీల విక్రయాలు, వాటి ధరల వెనుక ఉన్న లెక్కలు కొంచెం గందరగోళంగా మారాయి. వాతావరణ మార్పుల నుంచి అంతర్జాతీయ రాజకీయాల వరకు అనేక కారణాలు ఏసీ పరిశ్రమను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఈ వేసవిలో ఏసీ మార్కెట్లో చోటు చేసుకుంటున్న ముఖ్యమైన మార్పులేంటో ఒకసారి లుక్ వెయ్యండి మరి.
మార్చి నెలలో అకాల వర్షాలు ఏసీ కంపెనీల ప్లాన్లను తలకిందులు చేశాయి. సాధారణంగా వేసవి డిమాండ్ను దృష్టిలో ఉంచుకుని కంపెనీలు ఫిబ్రవరి, మార్చి నెలల్లోనే డీలర్లకు స్టాక్ను పంపుతాయి. అయితే దేశవ్యాప్తంగా కురిసిన అకాల వర్షాల వల్ల ఏసీల అమ్మకాలు దాదాపు రెండు వారాల పాటు ఆలస్యమయ్యాయి. దీనివల్ల కంపెనీల ఆదాయంపై కొంత ప్రభావం పడే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు.
మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. రాత్రిపూట పెరుగుతున్న ఉష్ణోగ్రతలు. గత పదేళ్లలో పగటి కంటే రాత్రి వేళల్లో వేడి ఎక్కువగా ఉంటున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. దీనివల్ల ఏసీల వినియోగం గంటల పరంగా పెరుగుతోంది. గతంలో కేవలం పగలు మాత్రమే ఏసీ వాడిన వారు కూడా ఇప్పుడు రాత్రిపూట తప్పనిసరిగా వాడాల్సి వస్తోంది. ఇది విద్యుత్ వినియోగాన్ని పెంచడమే కాకుండా, కొత్తగా ఏసీలు కొనేవారి సంఖ్యను కూడా పెంచుతోంది.
ఇక ధరల విషయానికి వస్తే, వినియోగదారులకు ఈసారి చేదు వార్తే వినిపించనుంది. ఏసీల తయారీలో వాడే రాగి (Copper) ధరలు గత ఏడాది కాలంలో 30 శాతం వరకు పెరిగాయి. అలాగే ప్లాస్టిక్ ధరలు కూడా ఆకాశాన్ని తాకుతున్నాయి. దీనికి తోడు పశ్చిమ ఆసియాలో నెలకొన్న ఉద్రిక్తతల వల్ల గ్యాస్ సరఫరాకు ఆటంకం కలుగుతోంది. ఈ ముడి సరుకుల భారం వల్ల ఏసీల ధరలు 5 నుంచి 15 శాతం వరకు పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.
ప్రభుత్వ నిబంధనలు కూడా మరో కారణం. బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియెన్సీ కొత్త ప్రమాణాల ప్రకారం స్టార్ రేటింగ్స్లో మార్పులు వచ్చాయి. గతంలో 5 స్టార్గా ఉన్న ఏసీలు ఇప్పుడు 3 స్టార్ రేటింగ్కు పడిపోయాయి. అంటే కంపెనీలు తమ టెక్నాలజీని మార్చుకోవాల్సి వస్తోంది. ఈ వేసవిలో ఏసీ కొనాలనుకునే వారు అటు వాతావరణాన్ని, ఇటు తమ జేబును రెండింటినీ బేరీజు వేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.