India Internet Crisis: పశ్చిమాసియాలో ముదురుతున్న యుద్ధ మేఘాలు ఇప్పుడు డిజిటల్ ప్రపంచాన్ని కలవరపెడుతున్నాయి. ఇరాన్, ఇజ్రాయెల్ అమెరికా మధ్య కొనసాగుతున్న పోరు కేవలం భూమి, ఆకాశానికే పరిమితం కాకుండా సముద్ర గర్భంలోని ఇంటర్నెట్ కేబుళ్లకు ముప్పుగా పరిణమించింది. ముఖ్యంగా ఎర్ర సముద్రం, హర్మూజ్ జలసంధి గుండా వెళ్లే సబ్మెరైన్ కేబుల్స్ దెబ్బతింటే భారత్ వంటి దేశాల్లో ఇంటర్నెట్ సేవలు కుప్పకూలే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
సముద్ర గర్భంలో పొంచి ఉన్న ముప్పు
ప్రస్తుతం జరుగుతున్న యుద్ధం వల్ల ప్రపంచవ్యాప్తంగా చమురు, గ్యాస్ ధరలు ఇప్పటికే ఆకాశాన్ని తాకాయి. అయితే అంతకంటే ప్రమాదకరమైన విషయం ఏమిటంటే, ప్రపంచ ఇంటర్నెట్ ట్రాఫిక్లో దాదాపు 99 శాతం సముద్రం అడుగున ఉండే ఆప్టిక్ ఫైబర్ కేబుళ్ల ద్వారానే జరుగుతుంది. యుద్ధం కారణంగా ఈ కేబుళ్లకు ఏవైనా నష్టం వాటిల్లితే, ప్రపంచం ఒక్కసారిగా చీకట్లోకి వెళ్లే అవకాశం ఉంది. హౌతీ రెబల్స్ వంటి గ్రూపులు గతంలోనే ఈ కేబుళ్లను లక్ష్యంగా చేసుకుంటామని హెచ్చరించడం ఇప్పుడు మరింత ఆందోళన కలిగిస్తోంది.
భారత్పై ప్రభావం ఎలా ఉంటుంది?
భారతదేశానికి సంబంధించిన ఇంటర్నెట్ వ్యవస్థలో పశ్చిమ దేశాల మార్గం చాలా కీలకం. మన దేశానికి అవసరమైన డేటాలో 60 శాతం ముంబయి నుంచి గల్ఫ్ దేశాల మీదుగా ఐరోపాకు వెళ్లే కేబుళ్లపైనే ఆధారపడి ఉంటుంది. మిగిలిన 40 శాతం మాత్రమే చెన్నై నుంచి సింగపూర్ వైపు వెళ్తుంది. అంటే, ఇప్పుడు యుద్ధం జరుగుతున్న ప్రాంతంలో కేబుల్స్ దెబ్బతింటే, మన దేశంలో మెజారిటీ ఇంటర్నెట్ సేవలకు అంతరాయం కలగడం ఖాయంగా కనిపిస్తోంది.
డేటా వేగం ఆర్థిక లావాదేవీలు
ఒకవేళ యుద్ధం వల్ల కొన్ని కేబుల్స్ కట్ అయితే, ఇంటర్నెట్ పూర్తిగా ఆగిపోదు కానీ దాని వేగం దారుణంగా పడిపోతుంది. టెలికం కంపెనీలు ట్రాఫిక్ను వేరే మార్గాల ద్వారా మళ్లిస్తాయి. దీనివల్ల నెట్వర్క్పై ఒత్తిడి పెరిగి ఆన్లైన్ పేమెంట్లు ఫెయిల్ అవ్వడం, బ్యాంకింగ్ లావాదేవీల్లో జాప్యం, వీడియో స్ట్రీమింగ్లో బఫరింగ్ వంటి సమస్యలు వస్తాయి. ముఖ్యంగా గ్లోబల్ ఐటీ కంపెనీల పనితీరు నెమ్మదించి కోట్లలో నష్టం వచ్చే అవకాశం ఉంది.
అంతర్జాతీయ నిపుణుల అభిప్రాయం ప్రకారం, సముద్రపు అడుగున ఉండే మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకోవడం అనేది ఒక కొత్త రకమైన యుద్ధ వ్యూహం. ఒక్కో కేబుల్ ద్వారా భారీ మొత్తంలో డేటా ప్రసారం అవుతుంది. ఇవి దెబ్బతింటే వాటిని తిరిగి బాగు చేయడానికి నెలల సమయం పడుతుంది. ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం 30 రోజులు దాటినా ఇంకా ఉధృతమవుతుండటంతో, డిజిటల్ కనెక్టివిటీపై పడే ప్రభావం దీర్ఘకాలం కొనసాగవచ్చని టెలికం రంగ ప్రతినిధులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఇలాంటి సంక్షోభ పరిస్థితులను ఎదుర్కోవడానికి ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించాల్సిన అవసరం ఉందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. కేవలం సముద్ర మార్గాలపైనే కాకుండా, శాటిలైట్ ఇంటర్నెట్ వంటి అధునాతన సాంకేతికతలను అందుబాటులోకి తెచ్చుకోవాలని సూచిస్తున్నారు. ఏది ఏమైనా, పశ్చిమాసియాలో శాంతి నెలకొంటే తప్ప అటు ఆర్థిక వ్యవస్థకు, ఇటు డిజిటల్ ప్రపంచానికి భద్రత ఉండదు. యుద్ధం ముదిరితే మాత్రం భారత్ సహా అనేక దేశాల ప్రజలు నెట్ కష్టాలను ఎదుర్కోవక తప్పదు.