- రాజకీయ స్థిరత్వం ఉంటేనే పెట్టుబడులు: ఏపీ అభివృద్ధికి అమరావతి ప్రాధాన్యతను వివరించిన పవన్..
- Politics: రైతులను హింసించి ముళ్ల కంచెలు వేశారు: గత ప్రభుత్వంపై పవన్ కల్యాణ్ నిప్పులు..
Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ శాసనసభలో రాజధాని అమరావతిపై జరుగుతున్న చర్చలో ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అత్యంత శక్తిమంతమైన ప్రసంగం చేశారు. భాషాప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు నాంది పలికిన పొట్టి శ్రీరాముల త్యాగ ఫలితంగా ఏర్పడిన ఆంధ్రరాష్ట్రం, ఇన్నేళ్లయినా సరైన రాజధాని, హైకోర్టు లేక ఇబ్బంది పడటం దురదృష్టకరమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రాన్ని విభజించే సమయంలో కాంగ్రెస్ పార్టీ బాధ్యతారహితంగా వ్యవహరించిందని, విభజనానంతరం సరైన కార్యాలయాలు కూడా లేని దుస్థితిలో రాష్ట్రం ఏర్పడిందని గుర్తు చేశారు. అటువంటి క్లిష్ట పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు ఒక బలమైన ఆశావాదిగా, టెంట్లు వేసుకొని అయినా సరే పాలన సాగిద్దామని ముందుకు రావడం ఆయనలోని దార్శనికతకు నిదర్శనమని కొనియాడారు. రాష్ట్ర భవిష్యత్తు చంద్రబాబు వంటి అనుభవజ్ఞుడి చేతుల్లో ఉంటేనే బాగుంటుందనే ఉద్దేశంతోనే తాను 2014లో మద్దతు ఇచ్చానని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు.
రాజధాని అమరావతి కోసం రైతులు చేసిన త్యాగాలను ప్రస్తావిస్తూ, ఎటువంటి గొడవలు లేకుండా 33 వేల ఎకరాలను ఇష్టపూర్వకంగా ఇచ్చారని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. అయితే 2019లో ప్రభుత్వం మారిన తర్వాత వైసీపీ నేతలు అమరావతిపై కక్ష గట్టారని, రైతులకు మద్దతుగా వెళ్తే ముళ్ల కంచెలు వేసి అడ్డుకున్నారని మండిపడ్డారు. వైసీపీ హయాంలో శాసనసభ్యులకే రక్షణ లేని పరిస్థితి ఉంటే, సామాన్య రైతులకు రక్షణ ఎక్కడిదని ప్రశ్నించారు. మూడు రాజధానుల పేరుతో ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొట్టి సమస్యను మరింత జటిలం చేశారని, భూములిచ్చిన రైతులను దారుణంగా హింసించారని దుయ్యబట్టారు. వైసీపీ మళ్లీ వస్తే పరిస్థితి ఏంటని కొందరు అడుగుతున్నారని, కానీ ఆ పార్టీ మళ్లీ రాదని, ఒకవేళ వచ్చినా రాజధానిని ఏమీ చేయలేదని ఆయన ధీమా వ్యక్తం చేశారు. అమరావతి విషయంలో జనసేన పార్టీ ఎప్పుడూ మాట మార్చదని, తాము రైతులకు ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటామని పునరుద్ఘాటించారు.
హైదరాబాద్ అభివృద్ధిని ఉదాహరణగా చూపుతూ, అప్పట్లో సైబరాబాద్ నిర్మిస్తున్నప్పుడు చంద్రబాబును అందరూ విమర్శించారని, ప్రపంచ బ్యాంకుతో కుమ్మక్కయ్యారని ఆరోపణలు చేశారని పవన్ గుర్తు చేశారు. కానీ ఒక సాధారణ రాజకీయ నాయకుడు కేవలం వచ్చే ఎన్నికల గురించి ఆలోచిస్తే, ఒక దార్శనికుడు మాత్రం రాబోయే తరం భవిష్యత్తు గురించి ఆలోచిస్తారని చంద్రబాబును ఉద్దేశించి వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో రాజకీయ స్థిరత్వం ఉంటేనే పెట్టుబడులు వస్తాయని, చట్టసభల్లో కూర్చొని దాడులు చేస్తామంటే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. మనమంతా ఆంధ్రులమనే భావనతో ఉండాలని, ప్రాంతీయ విద్వేషాలకు తావులేకుండా అమరావతిని ఆంధ్రులందరి గర్వకారణమైన రాజధానిగా నిర్మించుకోవాలని పిలుపునిచ్చారు. రాజధాని నిర్మాణం కోసం ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని, రాష్ట్ర ప్రయోజనాలే తమకు పరమావధి అని పవన్ కల్యాణ్ తన ప్రసంగంలో స్పష్టం చేశారు.