భోగాపురం ఎయిర్పోర్ట్పై వైసీపీ అబద్ధపు ప్రచారం..
ఐదేళ్లు తాగునీటి సమస్య పట్టించుకోని వైసీపీపై మంత్రి విమర్శలు..
విజయనగరం జిల్లాలో అభివృద్ధి పనులపై వైసీపీ నేతలు చేస్తున్న విమర్శలకు రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఘాటుగా స్పందించారు. భోగాపురం ఎయిర్పోర్టు, మూలపేట పోర్టు వంటి కీలక ప్రాజెక్టులపై క్రెడిట్ దోచుకునేందుకు వైసీపీ నేతలు ప్రయత్నిస్తున్నారని ఆయన విమర్శించారు. గజపతినగరంలో ఆదివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో మంత్రి మాట్లాడారు.
భోగాపురం ఎయిర్పోర్టు, మూలపేట పోర్టు వంటి ప్రాజెక్టులు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ప్రారంభమైనవేనని గుర్తుచేసిన మంత్రి, ఇప్పుడు వాటిని తామే నిర్మించామని చెప్పుకోవడం వైసీపీ నేతల దిగజారుడు రాజకీయాలకు నిదర్శనమన్నారు. అభివృద్ధి గురించి చెప్పుకునే పరిస్థితి లేకపోవడంతోనే బట్ట కాల్చి మొఖంపై వేసినట్టుగా విమర్శలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు.
మానాపురం బ్రిడ్జి పనులు గత టీడీపీ ప్రభుత్వంలోనే మంజూరయ్యాయని, అయితే వైసీపీ ఐదేళ్ల పాలనలో 20 శాతం పనులు కూడా పూర్తికాలేదన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాతే ఆ బ్రిడ్జి పూర్తి చేయడాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుని ముందుకు సాగుతున్నామని తెలిపారు.
స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత కూడా రహదారి సౌకర్యం లేక ఇబ్బందులు పడుతున్న భోజరాజపురం, పి.లింగాలవలస, పాపయ్యవలస గ్రామాలకు రోడ్లు ఏర్పాటు చేసిన ఘనత కూటమి ప్రభుత్వానిదేనని మంత్రి పేర్కొన్నారు. దశాబ్దాలుగా ప్రజలు ఎదురుచూసిన ఈ సమస్యలను పరిష్కరించడంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందన్నారు.
దత్తిరాజేరు మండలంలో తాగునీటి సమస్య తీవ్రంగా ఉన్నప్పటికీ గత వైసీపీ ప్రభుత్వం పట్టించుకోలేదని మంత్రి ఆరోపించారు. కూటమి ప్రభుత్వం వచ్చాక రూ.8 కోట్లతో కొన్ని పనులు పూర్తి చేసి, మరిన్ని తాగునీటి సమస్యల పరిష్కారం కోసం మరో రూ.20 కోట్ల నిధులు మంజూరు చేయించామని వెల్లడించారు. ప్రజల ప్రాథమిక అవసరాలపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపుతోందన్నారు.
గజపతినగరంలో అన్నా క్యాంటీన్కు ప్రజల నుంచి మంచి ఆదరణ లభిస్తోందని మంత్రి తెలిపారు. ప్రతిరోజూ సుమారు 800 మందికి కేవలం రూ.5కే కడుపునిండా భోజనం అందిస్తున్నామని చెప్పారు. పేదల ఆకలి తీర్చడంలో అన్నా క్యాంటీన్లు కీలక పాత్ర పోషిస్తున్నాయని ఆయన అభిప్రాయపడ్డారు.
గత రెండేళ్లలో నియోజకవర్గంలో రహదారులు, డ్రైనేజీలు, తాగునీటి సమస్యలను పెద్దఎత్తున పరిష్కరించామని, గజపతినగరం ప్రభుత్వ ఆసుపత్రిని కూడా పూర్తిస్థాయిలో ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చామని మంత్రి వివరించారు.
స్వర్ణాంధ్ర – స్వచ్ఛాంధ్ర కార్యక్రమాలపై కూడా మంత్రి ప్రత్యేకంగా మాట్లాడారు. సీఎం నారా చంద్రబాబు నాయుడు పరిశుభ్రతపై ప్రజల్లో చైతన్యం తీసుకువస్తున్నారని, ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతతో వ్యవహరించాలని సూచించారు. చెత్త నిర్వహణలో ప్రజలు కూడా భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపాలిటీల్లో రెండేళ్లలో రూ.1300 కోట్లతో లక్ష టన్నుల చెత్తను ప్రాసెస్ చేశామని మంత్రి తెలిపారు. ప్రస్తుతం గ్రామీణ ప్రాంతాల పరిశుభ్రతపై కూడా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందన్నారు. ఇటీవల సింగపూర్ పర్యటనలో అక్కడి ప్రజలు స్వచ్ఛందంగా పరిశుభ్రత, క్రమశిక్షణ పాటిస్తున్న తీరు చూసి ప్రేరణ పొందామని, మన రాష్ట్రంలో కూడా ప్రజలు బాధ్యతగా వ్యవహరిస్తే మరింత మంచి ఫలితాలు సాధించవచ్చని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు.