- Politics: వైసీపీ నేత భూదౌర్జన్యం.. తప్పుడు పాస్ బుక్కులతో వారసత్వ భూమి ఆక్రమణ..
- మాజీ ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ ప్రోద్బలంతో భూకబ్జా యత్నంపై గ్రీవెన్స్ లో ఫిర్యాదు..
Prajavedhika: కర్నూలుకు చెందిన టి. కుమారి నేడు టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన ప్రజావినతుల స్వీకరణ కార్యక్రమంలో నేతలకు అర్జీ ఇచ్చి అభ్యర్థిస్తూ.. సర్వే నంబర్ 781/A2, అయ్యప్ప స్వామి దేవాలయం వెనుక, కేసీ కెనాల్ గట్టు సమీపంలో సుమారు 22 మంది పేద కుటుంబాలము నివాస స్థలాలను కలిగి ఉన్నాము. తమ వద్ద సదరు స్థలాలకు సంబంధించిన అన్ని రకాల పట్టాలు, ఆధారాలు ఉన్నాయి. అంతేకాకుండా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వారు కూడా ఎటువంటి అభ్యంతరం లేదని ధృవీకరించారు. అక్కడ తన సొంత ఖర్చులతో కాళికామాత దేవాలయాన్ని నిర్మించి, పూజలు నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్నాను. గత ప్రభుత్వ హయాంలో అప్పటి ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ ప్రోద్బలంతో స్థానిక వైసీపీ నాయకులు, కొంతమంది రౌడీ షీటర్లు, సంఘ విద్రోహ శక్తులు తమ స్థలాలపై కన్నేసి మమ్మల్ని ఖాళీ చేయించడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో నిత్యం అర్ధరాత్రి వేళల్లో తప్పతాగి వచ్చి, అసభ్య పదజాలంతో తమను దూషిస్తున్నారు. తనను, తన భర్తను, కోడలిని మారణాయుధాలతో బెదిరించి, విచక్షణారహితంగా కొట్టి తీవ్రంగా గాయపరిచారు. తమ ప్రాణాలు తీస్తామని నిరంతరం హెచ్చరిస్తున్నారు. ఈ విషయంపై ఇప్పటికే తాము కర్నూలు త్రీ టౌన్ పోలీస్ స్టేషన్లో ఇతర అధికారులకు మొరపెట్టుకున్నప్పటికీ ఇంతవరకు ఎటువంటి జరగలేదు. కావున వారిపై చర్యలు తీసుకోని తమ సమస్యను పరిష్కరించాలని నేతలు ఎన్టీఆర్ జిల్లా టీడీపీ అధ్యక్షురాలు గద్దె అనూరాధ, ఏపీటీఎస్ ఛైర్మన్ మన్నవ మోహనకృష్ణలకు అర్జీ ఇచ్చి అభ్యర్ధించారు.
పల్నాడు జిల్లా రొంపిచర్ల మండలం ఆలవాల గ్రామానికి చెందిన రమేష్ గ్రీవెన్స్ లో అర్జీ ఇచ్చి విజ్ఞప్తి చేస్తూ.. తమ గ్రామంలో సర్వే నంబర్ 54/1A మరియు 54/1E లో తమకు పూర్వీకుల నుండి వచ్చిన భూమి ఉంది. తమ భూమిలో సుమారు 4 ఎకరాలను వైసీపీ నాయకుడు గ్రంథం వెంకటరావు అక్రమంగా పురిమేట్ల బేబీ అనే ఆవిడ పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించారు. అంతేకాకుండా సదరు నాయకుడు తన పాస్ బుక్లో 5.15 ఎకరాల భూమిని అదనంగా ఎక్కించుకుని మొత్తం ఖాతా నంబరు 471 తో తప్పుడు రికార్డులు సృష్టించారు. తమ భూమిని ఆక్రమించడమే కాకుండా, తమపైనే కోర్టులో తప్పుడు కేసులు వేసి మమ్మల్ని మానసిక క్షోభకు గురిచేస్తున్నారు. ప్రస్తుతం ఈ భూమి రిజిస్ట్రేషన్, రికార్డులను వివాదంలో పెట్టి మమ్మల్ని ఇబ్బందులకు గురిచేస్తున్నారు. దీనిపై పలుమార్లు అధికారులకు ఫిర్యాదు చేసిన ఎలాంటి న్యాయం జరగలేదు. కావున వారిపై చర్యలు తీసుకోని తమ సమస్యను పరిష్కరించాలని కోరాడు.
కృష్ణా జిల్లా ఉంగుటూరు మండలం కొయ్యగూరపాడు గ్రామానికి చెందిన పార్ధసారధి గ్రీవెన్స్ లో అర్జీ ఇచ్చి విజ్ఞప్తి చేస్తూ.. మండల సర్వేయర్ బండ్లపల్లి జ్యోతి, రాజకీయ కారణాలతో ప్రతిపక్ష వైసీపీ పార్టీ సానుభూతిపరులకు కొమ్ముకాస్తున్నారు. సర్వే సమయంలో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించడం, చీకటి పడిన తర్వాత కొలతలు వేయడం వంటి చర్యలకు పాల్పడ్డారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న మాజీ వాలంటీర్లు, సర్వే ప్రక్రియను తప్పుదోవ పట్టిస్తూ రాజకీయ కక్ష సాధింపులకు పాల్పడుతున్నారు. గుడివాడ ఆర్డీఓ గారు సదరు సర్వేయర్ను వివాదాస్పద స్థలానికి వెళ్లవద్దని ఆదేశించినప్పటికీ, ఆమె సర్వే రోజున అక్కడ ఉండి అధికారులను ప్రభావితం చేయడం గమనార్హం. సర్వే నిర్వహించడానికి వెళ్లిన గన్నవరం సర్వేయర్ను స్థానిక ఆక్రమణదారులు అడ్డుకోవడమే కాకుండా భూమిని కొలవనివ్వకుండా దౌర్జన్యానికి దిగుతున్నారు. కావున వారిపై చర్యలు తీసుకోని తమ సమస్యను పరిష్కరించాలని కోరాడు.
పల్నాడు జిల్లా ఈపూరు మండలం కొచ్చెర్ల గ్రామానికి చెందిన బీసపోగు రాంబాబు గ్రీవెన్స్ లో అర్జీ ఇచ్చి విజ్ఞప్తి చేస్తూ..గత ప్రభుత్వ హయాంలో వైసీపీకి చెందిన సాధుపాటి నాగశ్రీను, నాగరాజు అనే వ్యక్తులు తమ పొలాన్ని కబ్జా చేయడానికి ప్రయత్నించారు. వీరు తమపై తప్పుడు కేసులు, పిటిషన్లు వేసి వేధించారు. సదరు వ్యక్తులు ఒక నకిలీ డి.కె. పట్టా సృష్టించి, రెవెన్యూ అధికారులను తప్పుదోవ పట్టించారు. అప్పట్లో సర్వేయర్ చండీరాణి గారు, ఇతర రెవెన్యూ, పోలీస్ అధికారులు మమ్మల్ని బెదిరించి మానసిక క్షోభకు గురిచేశారు. అధికారుల వేధింపులు తట్టుకోలేక తమ నాన్నగారు తీవ్ర ఒత్తిడితో మరణించారు. గత ఏడాది జరిగిన రీ-సర్వేలో ఆ వ్యక్తులు చూపించిన డాక్యుమెంట్లన్నీ నకిలీవని తేలింది. ఈ విషయాన్ని ఉన్నతాధికారులు కూడా నిర్ధారించారు. తమ భూమికి సంబంధించి నిజం నిరూపించబడినప్పటికీ, ఇంతవరకు ఆన్లైన్ ప్రక్రియ పూర్తి కాలేదు. పాస్ పుస్తకాల కోసం దరఖాస్తు చేసుకున్నా అధికారులు జాప్యం చేస్తున్నారు. కావున వారిపై చర్యలు తీసుకోని తమ సమస్యను పరిష్కరించాలని కోరాడు.
తూర్పుగోదావరి జిల్లా గోపాలాపురం మండలం చిట్యాల గ్రామానికి చెందిన గద్దె వెంకట కృష్ణారావు గ్రీవెన్స్ లో అర్జీ ఇచ్చి విజ్ఞప్తి చేస్తూ.. వెంకటాయపాలెం గ్రామంలో సర్వే నెం. 15/4 లో తనకు 3.63 ఎకరాల పూర్వార్జిత భూమి ఉంది. సుమారు 26 ఏళ్ల క్రితమే తన భార్యతో విడాకులు తీసుకుని, ఆమెకు మనోవర్తి ఇచ్చి విడిగా ఉంటున్నాను. ఈ క్రమంలో తన అనుమతి లేకుండా, ఎటువంటి చట్టబద్ధమైన పత్రాలు లేకుండా తన భార్య గద్దె విజయ, గద్దె గాయత్రి సుమన్ పేర్ల మీద రెవెన్యూ రికార్డుల్లో అక్రమంగా నమోదు చేయించుకున్నారు. గత ఏడాది కాలంగా గోపాలాపురం తహశీల్దార్ ఆఫీసు చుట్టూ తిరుగుతూ అనేక అర్జీలు ఇచ్చాను. కానీ రెవెన్యూ అధికారులు ఏమాత్రం పట్టించుకోవడం లేదు. కావున వారిపై చర్యలు తీసుకోని తమ సమస్యను పరిష్కరించాలని కోరాడు.
అనంతపురం జిల్లా శింగనమల మండలం చిన్నమట్లగొంది గ్రామానికి చెందిన రవీంద్ర గ్రీవెన్స్ లో అర్జీ ఇచ్చి విజ్ఞప్తి చేస్తూ.. సలకంచెరువు పొలం సర్వే నంబర్ 334లో తమకు 9.19 ఎకరాల భూమి ఉంది. ఇందులో 50 సెంట్ల భూమి ఆక్రమణకు గురైంది. దీనిపై రీ-సర్వే చేసి హద్దులు నిర్ణయించమని కోరగా శింగనమల మండల తహశీల్దార్, గ్రామ సర్వేయర్ కలిసి 'నకిలీ మ్యాపులు' సృష్టించి తమకు రావలసిన భూమి దక్కకుండా అక్రమ సర్వే చేశారు. న్యాయం చేయమని కోరినందుకు తహశీల్దార్ గారు తమను మానసికంగా వేధించడమే కాకుండా, పోలీసులను అడ్డుపెట్టుకుని అక్రమ కేసులు పెట్టించి భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. కావున వారిపై చర్యలు తీసుకోని తమ సమస్యను పరిష్కరించాలని కోరాడు.
వైఎస్ఆర్ కడప జిల్లా పోరుమామిళ్లకు చెందిన ముక్కంటి లక్షుమ్మ గ్రీవెన్స్ లో అర్జీ ఇచ్చి విజ్ఞప్తి చేస్తూ.. తమ గ్రామంలో సర్వే నెం. 34 లో తనకు 0.95 సెంట్ల రిజిస్టర్ భూమి ఉంది. ప్రకాశం జిల్లా వేములపాడుకు చెందిన కర్నాటి బలరామిరెడ్డి అనే వ్యక్తి, తాను నిర్మించాలనుకుంటున్న దేవుని గర్భగుడికి లోన్ ఇప్పిస్తానని నమ్మించి, తన సంతకాలను అక్రమంగా వాడుకుని నకిలీ పత్రాలు సృష్టించాడు. తనకు తెలియకుండానే ఆ భూమిని వేరే వ్యక్తికి రూ. 24 లక్షలకు అడ్వాన్స్ కు అమ్ముకున్నాడు. ఈ విషయం అడిగితే చంపుతానని బెదిరిస్తున్నాడు. తన ఇంటికి వెళ్లే దారిలో కంపలు, ఇటుకలు వేసి అడ్డుకుంటున్నాడు. అసభ్య పదజాలంతో తిడుతూ, తనపై దాడికి ప్రయత్నిస్తున్నాడు. స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదు. కావున వారిపై చర్యలు తీసుకోని తమ సమస్యను పరిష్కరించాలని కోరారు.
అనంతపురం జిల్లా తాడిపత్రి మండలం రెడ్డిపాళెం గ్రామానికి చెందిన ఎన్. నారాయణ రెడ్డి గ్రీవెన్స్ లో అర్జీ ఇచ్చి విజ్ఞప్తి చేస్తూ.. 1995వ సంవత్సరంలో సైనిక కోటా కింద భూమి కోసం దరఖాస్తు చేసుకున్నాను. అప్పటి అనంతపురం జిల్లా కలెక్టర్ డాక్టర్ మన్మోహన్ సింగ్, ఐ.ఏ.ఎస్. గారు స్పందిస్తూ.. తాడిపత్రి మండలం, ఆలూరు గ్రామంలోని సర్వే నంబర్ 1261-C1 లో 5.88 ఎకరాల భూమిని కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. కలెక్టర్ గారి ఉత్తర్వులు ఉన్నప్పటికీ గత 30 ఏళ్లుగా ఆ భూమి తన పేరు మీద రిజిస్ట్రేషన్ కాలేదు. తాజా ఫిర్యాదు (ATP202601192759) పై తాడిపత్రి తహశీల్దార్ కార్యాలయం స్పందిస్తూ.. సదరు సర్వే నంబర్లో ప్రస్తుతం ఖాళీ భూమి లేదని, కావున భూమి కేటాయించడం సాధ్యం కాదని సమాధానం ఇచ్చారు. కలెక్టర్ గారు స్వయంగా భూమిని కేటాయించి ఉత్తర్వులు ఇచ్చినా, క్షేత్రస్థాయిలో అమలు చేయడంలో రెవెన్యూ అధికారులు విఫలమయ్యారు. ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం తనకు కేటాయించిన పాత భూమినైనా అప్పగించాలని, లేదా ప్రత్యామ్నాయంగా తాడిపత్రి సమీపంలో ఎక్కడైనా అంతే విస్తీర్ణంలో భూమిని కేటాయించి తనకు న్యాయం చేయాలని కోరాడు.
పల్నాడు జిల్లా నరసరావుపేట మండలం కాకాని గ్రామానికి చెందిన గోనుగుంట్ల పూర్ణ చంద్రరావు గ్రీవెన్స్ లో అర్జీ ఇచ్చి విజ్ఞప్తి చేస్తూ.. తమ ముత్తాత ఆరికట్ల అప్పయ్య గారు 1951లో (దస్తావేజు నం. 3507) తమ తండ్రిగారైన వెంకటేశ్వర్లు, బాబాయ్ పేరయ్య గారి పేరు మీద భూమిని రిజిస్ట్రేషన్ చేశారు. అందులో సర్వే నం. 245/A లో 0.76 సెంట్లు, 245/D లో 1.16 సెంట్లు ఉన్నాయి. గతంలో తమ తండ్రిగారికి ఇచ్చిన పాస్ పుస్తకాలలో సర్వే నం. 245/B లో 0.38 సెంట్లు ఉన్నట్లు రికార్డు అయి ఉంది. తమకున్న వాటా ప్రకారం తన పాస్ పుస్తకంలో కూడా సర్వే నం. 245/1B లో 0.38 సెంట్లు నమోదై ఉంది. ప్రస్తుతం ఈ భూమికి సంబంధించి సరిహద్దులు స్పష్టంగా లేవు. తమ తమ్ముడికి రావాల్సిన భాగం కూడా విడదీయడం జరిగింది. కానీ క్షేత్రస్థాయిలో హద్దులు ఖచ్చితంగా తెలియకపోవడం వల్ల ఇబ్బంది ఎదురవుతోంది. కావున తమయందు దయవుంచి తమ సమస్యను పరిష్కరించాలని కోరాడు.
వీటితో పాటు పలువురు పింఛన్, రేషన్, ఇళ్ల నిర్మాణాల సమస్యలపై అర్జీలు ఇచ్చి పరిష్కరించాలని కోరగా.. మరికొందరు ఉద్యోగాల కోసం రెస్యూమ్ లు ఇచ్చారు. అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నాం ఆర్ధికతోడ్పాటు కల్పించాలని మరికొందరు అభ్యర్థనలు అందించారు.