- ప్రతి రైతుకు తన భూమి గురించి అవగాహన కల్పించేలా కలెక్టర్లు పర్యవేక్షించాలి…
- రెవెన్యూ శాఖలో రిజిస్ట్రేషన్ సేవల్లో ప్రజల సంతృప్తి..
Satya Prasad Meeting With District Collectors: అమరావతి వేదికగా జరిగిన కలెక్టర్ల కాన్ఫరెన్స్లో రెవెన్యూ, రిజిస్ట్రేషన్ మరియు స్టాంప్స్ శాఖా మంత్రి అనగాని సత్యప్రసాద్ గారు రాష్ట్ర భూ పరిపాలనపై కీలక ప్రసంగం చేశారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 22ఏ నిషేధిత జాబితాలో సుమారు కోటి 95 లక్షల ఎకరాల భూమి ఉందని, దీనిపై స్పష్టతనిచ్చేందుకు ప్రతి గ్రామంలోనూ గ్రామసభలు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. ఈ సభల ద్వారా నిషేధిత జాబితాలో ఉన్న భూముల వివరాలను బహిరంగంగా ప్రకటించి, ప్రతి రైతుకు తన భూమి స్థితిగతులపై పూర్తిస్థాయి అవగాహన కల్పించే బాధ్యతను కలెక్టర్లు పర్యవేక్షించాలని సూచించారు. ప్రపంచంలోని పలు దేశాలు యుద్ధాలతో విధ్వంసానికి గురవుతుంటే, ఆంధ్రప్రదేశ్ మాత్రం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అభివృద్ధి వైపు శరవేగంగా పరుగులు పెడుతోందని కొనియాడారు.
రాష్ట్రాన్ని మరింత ఉన్నత స్థానానికి చేర్చడంలో భాగంగా 'స్పీడ్ ఆఫ్ డెలివరీ గవర్నెన్స్' (Speed of Delivery Governance) ను గణనీయంగా పెంచాలని మంత్రి పిలుపునిచ్చారు. ప్రభుత్వ పాలనలో వేగాన్ని పెంచడమే కాకుండా, సేవల పట్ల ప్రజల సంతృప్తిని కూడా సమాంతరంగా పెంచాల్సిన అవసరం ఉందని ఆయన స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి లక్ష్యంగా నిర్దేశించినట్లుగా అన్ని శాఖల్లోనూ కనీసం 90 శాతం ప్రజల సంతృప్తిని సాధించేలా అధికారులు కృషి చేయాలన్నారు. ఇప్పటికే రెవెన్యూ మరియు రిజిస్ట్రేషన్ సేవల్లో ప్రజల నుండి సానుకూల స్పందన వస్తోందని, సంతృప్తి స్థాయి పెరిగిందని ఆయన గుర్తు చేశారు. చివరగా, రాష్ట్రంలో ఎంతో కాలంగా పెండింగ్లో ఉన్న భూ వివాదాలను శాశ్వతంగా, సమర్థవంతంగా పరిష్కరించేందుకు కలెక్టర్లు తమ వద్ద ఉన్న క్షేత్రస్థాయి అనుభవాలను, నిర్మాణాత్మకమైన అభిప్రాయాలను ప్రభుత్వానికి తెలియజేయాలని మంత్రి అనగాని సత్యప్రసాద్ కోరారు.