- పాత ఫొటోలు, ఏఐ చిత్రాలతో నెట్టుకొస్తున్న ప్రభుత్వ ఛానళ్లు..
- అధికారం చేపట్టిన నాటి నుంచి కనిపించని ఇరాన్ కొత్త అధినేత మొజ్తబా..
Iran News: ఇరాన్ కొత్త సుప్రీం లీడర్గా బాధ్యతలు చేపట్టిన మొజ్తబా ఖమేనీ ఆచూకీపై ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ఉత్కంఠ, గందరగోళం నెలకొంది. ఆయన అధికార పీఠాన్ని అధిష్టించిన నాటి నుంచి ఒక్కసారి కూడా బహిరంగంగా ప్రజల ముందుకు రాకపోవడం, కనీసం ఒక అధికారిక ప్రకటన కూడా విడుదల చేయకపోవడం అనేక అనుమానాలకు తావిస్తోంది. ప్రస్తుతం ఇరాన్ చుట్టుముట్టి ఉన్న యుద్ధ వాతావరణంలో ఆయన తీవ్రంగా గాయపడ్డారని అంతర్జాతీయ మీడియా కోడై కూస్తున్నప్పటికీ, ఇరాన్ ప్రభుత్వం నుంచి మాత్రం ఎలాంటి అధికారిక స్పష్టత రావడం లేదు. దీంతో ఆయన అసలు క్షేమంగా ఉన్నారా లేదా అన్న అంశంపై రకరకాల ఊహాగానాలు వెలువడుతున్నాయి.
ఈ క్రమంలోనే సోమవారం ఇరాన్ ప్రభుత్వ అధికారిక టెలివిజన్ ఒక అడుగు ముందుకు వేసి, మొజ్తబా గాయపడినట్లు పరోక్షంగా అంగీకరించింది. ఆయన్ను "జాన్బాజ్ ఆఫ్ రంజాన్" (గాయపడిన యుద్ధ వీరుడు) అని అభివర్ణించినప్పటికీ, ఆ గాయం ఎప్పుడు, ఎక్కడ, ఏ పరిస్థితుల్లో తగిలిందనే కీలక వివరాలను మాత్రం గోప్యంగా ఉంచింది. ఈ గాయం కారణంగా ఆయన తన సుప్రీం లీడర్ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించగలుగుతున్నారా లేక అశక్తులుగా మారారా అనే విషయంపై కూడా స్పష్టత ఇవ్వకపోవడంతో ఈ మిస్టరీ మరింత ముదిరింది.
మరోవైపు జెరూసలేం పోస్ట్ తన కథనంలో అంతర్గత వర్గాల సమాచారాన్ని ఉటంకిస్తూ, మొజ్తబా యుద్ధంలో గాయపడింది నిజమే అయినప్పటికీ, ఆయన దేశ వ్యవహారాలను పర్యవేక్షించే స్థితిలోనే ఉన్నారని పేర్కొంది. అయితే, నాయకత్వ మార్పు సజావుగా సాగిందని అధికారులు చెబుతున్న మాటలకు, క్షేత్రస్థాయి పరిస్థితులకు పొంతన కుదరడం లేదు. ఇప్పటివరకు మొజ్తబాకు సంబంధించిన ఒక్క కొత్త ఫొటో గానీ, వీడియో గానీ విడుదల కాలేదు సగదా, ప్రభుత్వ ఛానళ్లు ఆయన పాత ఫుటేజ్ను లేదా ఏఐ (AI) ద్వారా సృష్టించిన చిత్రాలను ప్రసారం చేస్తూ అంతా సవ్యంగా ఉందని నమ్మించే ప్రయత్నం చేయడం అనేక సందేహాలకు బలం చేకూరుస్తోంది.
ఈ అసాధారణ పరిణామాలపై ఇరాన్ ప్రభుత్వ వ్యతిరేకులు మరియు అంతర్జాతీయ పరిశీలకులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మొజ్తబా ఇన్ని రోజులుగా ప్రజల కంట పడకపోవడం వెనుక ఏదో బలమైన రహస్యం దాగి ఉందని వారు అనుమానిస్తున్నారు. సోషల్ మీడియాలో కొందరు ఏకంగా ఆయన మరణించి ఉండవచ్చని కూడా ప్రచారం చేస్తుండటంతో, అసలు ప్రస్తుతం ఇరాన్ దేశాన్ని నడిపిస్తున్నది ఎవరు? తెర వెనుక అసలైన అధికారం ఎవరి చేతిలో ఉంది? అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.
ప్రస్తుతానికి మొజ్తబాను కేవలం ఒక ఉత్సవ విగ్రహంగా మాత్రమే ఉంచి, పాలనా వ్యవస్థలోని మరో సీనియర్ అధికారి లేదా సైనిక యంత్రాంగం అధికారాన్ని చెలాయిస్తున్నారని ప్రతిపక్ష వర్గాలు బలంగా ఆరోపిస్తున్నాయి. దశాబ్దాల పాటు ఇరాన్ రాజకీయాలను శాసించిన మాజీ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ కుమారుడైన మొజ్తబా, గతంలో ఎలాంటి అధికారిక పదవులు లేనప్పటికీ తెరవెనుక భద్రతా వ్యవహారాల్లో కీలక పాత్ర పోషించారు. ఇప్పుడు ఆయన ఆచూకీ మాయం కావడం ఇరాన్ భవిష్యత్తును అగమ్యగోచరంగా మార్చింది.