పేదలకు ఇచ్చిన హామీ మేరకు పెన్షన్లు అందిస్తున్నాం..
రూ.30తో ప్రారంభమైన పెన్షన్ రూ.4000 చేసిన ఘనత చంద్రబాబు గారిదే..
మచిలీపట్నం: పేదల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని, ఇచ్చిన హామీలను అమలు చేస్తూ ముందుకు సాగుతున్నామని రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. మచిలీపట్నంలో నిర్వహించిన పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొని లబ్ధిదారులకు స్వయంగా పెన్షన్లు అందజేశారు.
ఈ కార్యక్రమంలో ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణ రావు కూడా పాల్గొన్నారు. పేదల పట్ల కూటమి ప్రభుత్వానికి ఉన్న కట్టుబాటు ఈ కార్యక్రమంతో మరోసారి స్పష్టమైందని వారు పేర్కొన్నారు.
మంత్రి మాట్లాడుతూ, ఒకప్పుడు రూ.30తో ప్రారంభమైన పెన్షన్ను నేడు రూ.4000కు పెంచిన ఘనత నారా చంద్రబాబు నాయుడు గారిదేనని చెప్పారు. గతంలో రూ.3000 పెన్షన్ ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన తరువాత మాట మార్చారని ప్రతిపక్షంపై విమర్శలు చేశారు. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఏప్రిల్ నుంచే పెన్షన్ పెంపును అమలు చేసినట్లు తెలిపారు.
మంచానికే పరిమితమైన వృద్ధులు, అనారోగ్యంతో బాధపడుతున్న వారికి ప్రత్యేకంగా రూ.15,000 పెన్షన్ అందిస్తున్నామని మంత్రి వెల్లడించారు. దేశంలోనే ఎక్కడా లేని విధంగా ఆంధ్రప్రదేశ్లో పెన్షన్ పథకాలు అమలు చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు.
రాష్ట్రానికి ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ, పేదల సంక్షేమానికి తొలి ప్రాధాన్యం ఇస్తున్నామని మంత్రి స్పష్టం చేశారు. సంక్షేమంతో పాటు అభివృద్ధి కార్యక్రమాలను కూడా సమాంతరంగా కొనసాగిస్తున్నామని తెలిపారు. ప్రజల జీవితాల్లో మార్పు తీసుకురావడమే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు.
ఈ కార్యక్రమంలో మోటమర్రి బాబప్రసాద్, మంచాల రాంబాబు, బచ్చుల బోస్, గొర్రెపాటి గోపీచంద్, ఇలియాస్ పాషా, బచ్చుల అనిల్ కుమార్, లోగిశెట్టి స్వామి, కుంచె దుర్గా ప్రసాద్, మారకాని సమతా కీర్తి, కరెడ్ల సుశీల, దేవరపల్లి అనిత తదితర నాయకులు, కార్యకర్తలు మరియు లబ్ధిదారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.