డిజిటల్ ప్రపంచంలో మోదీ రికార్డు..
ప్రపంచ రాజకీయాల్లో 'సోషల్ మీడియా కింగ్'..
అగ్రనేతలకు అందని ఎత్తులో మోదీ క్రేజ్..
PM Modi World Record: ప్రపంచ రాజకీయాల్లో భారత ప్రధాని నరేంద్ర మోదీ హవా మరోసారి స్పష్టమవుతుంది. క్షేత్రస్థాయిలో మాత్రమే కాదు, డిజిటల్ ప్రపంచంలోనూ ఆయన తన ఆధిపత్యాన్ని చాటుకుంటున్నారు. తాజాగా ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఇన్స్టాగ్రామ్లో ప్రధాని మోదీ ఫాలోవర్ల సంఖ్య 10 కోట్ల మైలురాయిని దాటింది. ఈ ఘనత సాధించిన ప్రపంచపు ఏకైక రాజకీయ నేతగా మోదీ సరికొత్త రికార్డు సృష్టించారు. గ్లోబల్ లీడర్లందరిలోనూ ఆయన అగ్రస్థానంలో కొనసాగుతూ, సోషల్ మీడియా 'అన్డిస్ప్యూటెడ్ కింగ్' అనిపించుకుంటున్నారు.
సాధారణంగా సినీ తారలు, క్రీడాకారులకు ఉండే క్రేజ్ రాజకీయ నాయకులకు ఉండటం అరుదు. కానీ ప్రధాని మోదీ విషయంలో అది తప్పని నిరూపితమైంది. కేవలం ఇన్ స్టా గ్రామ్లోనే కాదు, మైక్రో బ్లాగింగ్ సైట్ 'ఎక్స్' లోనూ ఆయన దూకుడు మామూలుగా లేదు. అక్కడ కూడా మోదీ ఫాలోవర్ల సంఖ్య ఇప్పటికే 100 మిలియన్లు దాటేసింది. అంటే ప్రధానమైన రెండు డిజిటల్ వేదికలపై పది కోట్ల కంటే ఎక్కువ మంది అనుచరులను కలిగి ఉన్న అరుదైన నేతగా ఆయన నిలిచారు. విదేశీ పర్యటనలు, తన వ్యక్తిగత ఆసక్తికర విషయాలు, ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో మోదీ అనుసరిస్తున్న వ్యూహమే ఆయనను ఇంతమందికి చేరవేసింది అని చెప్పడంలో నిస్సందేహమే లేదు.
ఇక ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇతర రాజకీయ నేతలతో పోల్చి చూస్తే మోదీ దరిదాపుల్లో ఎవరూ లేకపోవడం విశేషం. మోదీ తర్వాత రెండో స్థానంలో ఉన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఫాలోవర్ల సంఖ్య కేవలం 4.3 కోట్లు మాత్రమే. అంటే ట్రంప్ కంటే మోదీకి రెట్టింపు కంటే ఎక్కువ మంది ఫాలోవర్లు ఉన్నారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ వంటి వారు కూడా ఈ రేసులో మోదీ కంటే చాలా వెనుకబడి ఉన్నారు. దీన్నిబట్టి చూస్తుంటే మోదీకి ఉన్న అంతర్జాతీయ ఆదరణ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.
యువత ఎక్కువగా ఉండే ఇన్ స్టా గ్రామ్ వంటి వేదికలపై మోదీకి ఈ స్థాయిలో ఫాలోయింగ్ పెరగడం వెనుక ఆయన ఎప్పటికప్పుడు అప్ డేట్ అవ్వడమే ప్రధాన కారణంగా కూడా చెప్పుకోవచ్చు. యువతతో కనెక్ట్ అవ్వడానికి ఆయన చేసే ఫోటో షూట్లు, రీల్స్ నిమిషాల్లోనే వైరల్ అవుతున్నాయి. కేవలం భారతీయులే కాకుండా, విదేశాల్లో ఉండే వారు సైతం మోదీని పెద్ద ఎత్తున ఫాలో అవుతూ ఉంటారు. డిజిటల్ ఇండియా నినాదంతో ముందుకు సాగుతున్న మోదీ, తన సోషల్ మీడియా బలం ద్వారా ప్రపంచవ్యాప్తంగా భారత పరపతిని పెంచుతున్నారని విశ్లేషకులు భావిస్తున్నారు.