దొంగలే దొంగలంటుంటే విడ్డూరంగా ఉంది…
బొత్స కామెంట్స్కు లోకేష్ స్ట్రాంగ్ కౌంటర్…
అద్దంలో చూసుకో అంటూ మాస్ కౌంటర్…
Nara Lokesh: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తనపై తన కుటుంబ సంస్థలపై చేస్తున్న ఆరోపణలను రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తీవ్రంగా ఖండించారు. బుధవారం అమరావతిలో మీడియా ప్రతినిధులతో ముచ్చటించిన ఆయన, వీఎస్ఆర్ ఏవియేషన్ వ్యవహారంపై వస్తున్న వార్తలపై స్పష్టతనిచ్చారు. సొంత బాబాయ్ను చంపి కత్తిని తమ చేతిలో పెట్టిన వైసీపీ నేతలు కూడా అర్థం లేని ఆరోపణలు చేస్తున్నారని ఆయన ఎద్దేవా చేశారు.
హెరిటేజ్ సంస్థకు, వీఎస్ఆర్ ఏవియేషన్కు మధ్య ఉన్న సంబంధంపై లోకేష్ మాట్లాడుతూ.. హెరిటేజ్ ఫిన్ లీస్ అనేది 1996లోనే స్థాపించిన పాత సంస్థ అని గుర్తుచేశారు. దేశంలోని అనేక ఇతర సంస్థల మాదిరిగానే వీఎస్ఆర్ ఏవియేషన్ కూడా 2022లో హెరిటేజ్ ఫిన్ లీస్ దగ్గర ఫైనాన్స్ తీసుకుందని వివరించారు. కేవలం వ్యాపార లావాదేవీల కోసమే ఫైనాన్స్ తీసుకుంటే, దానికి రాజకీయ రంగు పూయడం వైసీపీ చిల్లర రాజకీయాలకు నిదర్శనమని మండిపడ్డారు.
భవిష్యత్తును ఊహించి తాము వ్యాపారాలు చేయలేమని లోకేష్ వ్యాఖ్యానించారు. మేము అధికారంలోకి వస్తామని, మా ఎంపీ ఏవియేషన్ మంత్రి అవుతారని అప్పట్లో ఎవరైనా కలగన్నారా? లేదా అజిత్ పవార్ ఆ విమానం ఎక్కుతారని, అది ప్రమాదానికి గురవుతుందని మాకు ముందే తెలుస్తుందా? అని ఆయన ప్రశ్నించారు. జగన్ మోహన్ రెడ్డి చేసే ప్రతి నిరాధార ఆరోపణకు తాను సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని, అయితే క్లారిటీ ఇవ్వాల్సిన చోట మాత్రం దీటైన జవాబు చెబుతానని స్పష్టం చేశారు.
ఇక మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ చేసిన 'చిల్లర దొంగలను పట్టుకుని గజదొంగలను వదిలేస్తున్నారు' అన్న వ్యాఖ్యలపై లోకేష్ సెటైర్లు వేశారు. బొత్స ఉద్దేశంలో ఆ గజదొంగ జగన్ మోహన్ రెడ్డి యేనా అని ఆయన ప్రశ్నించారు. జగన్ను పట్టుకోమని బొత్స పరోక్షంగా చెబుతున్నారా అని చమత్కరించారు. గతంలో జరిగిన సిట్ విచారణలో తేలింది కూడా అదేనని, గజదొంగలెవరో ప్రజలందరికీ తెలుసని లోకేష్ పేర్కొన్నారు.
తమ ప్రభుత్వంపై గతంలో వైసీపీ నాయకులు కావాలనే తప్పుడు కేసులు పెట్టారని లోకేష్ ఆరోపించారు. ఏదైనా కేసులో ఛార్జ్షీట్ దాఖలు చేసే సమయంలో ఖచ్చితంగా కాంపిటెంట్ అథారిటీ నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉంటుందని ఆయన గుర్తుచేశారు. వీఎస్ఆర్ ఏవియేషన్ వ్యవహారంపై పూర్తి వివరాలను త్వరలోనే మీడియా ముందుకు తీసుకువస్తానని, అసత్య ప్రచారాలను నమ్మవద్దని ఆయన కోరారు.