- ప్రజా సమస్యల కంటే వ్యక్తిగత దూషణలకే..
- వైసీపీ సభ్యులు దూసుకురావడంతో సభలో తీవ్ర ఉద్రిక్తత..
YCP members Attack Somu Veerraju: ఆంధ్రప్రదేశ్ శాసనమండలి వేదికగా గురువారం ఉత్కంఠత చోటుచేసుకుంది. అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య మాటల యుద్ధం కాస్తా ముదిరి, ఒకానొక దశలో తోపులాట వరకు వెళ్లింది. బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు లక్ష్యంగా వైసీపీ సభ్యులు దూసుకురావడంతో సభలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. దీంతో గందరగోళం మధ్య ఛైర్మన్ సభను కొద్దిసేపు వాయిదా వేయాల్సి వచ్చింది.
సభలో రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పథకంపై చర్చ జరుగుతున్న సమయంలో ఈ గొడవ మొదలైంది. ఈ అంశంపై మంత్రి నిమ్మల రామానాయుడు ఇచ్చిన సమాధానం పట్ల వైసీపీ సభ్యులు అసంతృప్తి వ్యక్తం చేశారు. సమాధానం పూర్తయినప్పటికీ, తాము ఇంకా చర్చించాల్సిందేనంటూ వారు పట్టుబట్టారు. అయితే, సమయం అయిపోయిందని, సమాధానం కూడా పూర్తయిందని స్పష్టం చేసిన మండలి ఛైర్మన్, తర్వాతి ప్రశ్నకు వెళ్దామని సూచించారు.
ఛైర్మన్ అనుమతితో తర్వాతి ప్రశ్న అడగడానికి బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు మైక్ తీసుకున్నారు. ఆయన మాట్లాడటం మొదలుపెట్టగానే వైసీపీ సభ్యులు ఒక్కసారిగా భగ్గుమన్నారు. తాము నిరసన తెలుపుతుంటే మధ్యలో మైక్ ఎలా తీసుకుంటారంటూ వైసీపీ ఎమ్మెల్సీ ఇజ్రాయిల్ ఆగ్రహంతో సోము వీర్రాజు కూర్చున్న వైపు దూసుకెళ్లారు. ఇజ్రాయిల్ వెంట మరికొందరు వైసీపీ సభ్యులు కూడా వీర్రాజుపైకి వెళ్లడంతో సభలో ఒక్కసారిగా ఉద్రిక్తత పెరిగింది.
వైసీపీ సభ్యులు వీర్రాజుపై దాడికి యత్నిస్తున్నట్లు కనిపించడంతో, అక్కడే ఉన్న మంత్రులు వంగలపూడి అనిత, గొట్టిపాటి రవికుమార్ వెంటనే అప్రమత్తమయ్యారు. వారు సోము వీర్రాజుకు మద్దతుగా నిలిచి, వైసీపీ సభ్యులను అడ్డుకున్నారు. ఇరువర్గాల మధ్య వాగ్వివాదం చెలరేగడం, సభ్యులు పోడియం వద్దకు చేరడంతో సభలో ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి నెలకొంది. పరిస్థితి చేయి దాటిపోతోందని గమనించిన మండలి ఛైర్మన్, సభను తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు ప్రకటించి బయటకు వెళ్ళిపోయారు. సభ వాయిదా పడ్డాక కూడా బయట కూడా ఇదే అంశంపై ఇరు పార్టీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ప్రజా సమస్యల కంటే వ్యక్తిగత దూషణలకే ప్రాధాన్యత ఇస్తున్నారంటూ సామాన్య జనం ఈ పరిణామాలపై విస్మయం వ్యక్తం చేస్తున్నారు.