Nuzvid News: రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలతో సామాన్యుల జీవితాల్లో పండుగ వాతావరణం నెలకొందని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్. సవిత హర్షం వ్యక్తం చేశారు. ఆదివారం ఏలూరు జిల్లా నూజివీడులో స్వాతంత్ర్య సమరయోధుడు వడ్డే ఓబన్న విగ్రహావిష్కరణ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కొలుసు పార్థసారథితో కలిసి విగ్రహాన్ని ఆవిష్కరించిన అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆమె ప్రసంగించారు. బీసీల అభ్యున్నతి కోసం ప్రభుత్వం కట్టుబడి ఉందని, వారి ఆర్థిక, రాజకీయ ఎదుగుదలకు తెలుగుదేశం పార్టీయే అసలైన వేదిక అని మంత్రి స్పష్టం చేశారు.
బ్రిటీష్ పాలకులకు ఎదురు నిలిచి పోరాడిన వడ్డే ఓబన్న ధైర్యసాహసాలు రాబోయే తరాలకు స్ఫూర్తిదాయకమని మంత్రి కొనియాడారు. ఓబన్న త్యాగాన్ని గుర్తించిన ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన జయంతిని అధికారికంగా రాష్ట్ర పండుగగా ప్రకటించారని గుర్తుచేశారు. ఈ క్రమంలోనే ఓబన్న జయంతి వేడుకలను గత ఏడాది గుంటూరులో, ఈ ఏడాది అనంతపురంలో వైభవంగా నిర్వహించామని చెప్పారు. వడ్డెర సామాజిక వర్గానికి ప్రభుత్వం ఎప్పుడూ వెన్నుదన్నుగా ఉంటుందని, వారిని ఎస్టీ జాబితాలో చేర్చే అంశాన్ని స్వయంగా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి సానుకూల నిర్ణయం వచ్చేలా కృషి చేస్తానని ఈ సందర్భంగా ఆమె హామీ ఇచ్చారు.
రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు కూటమి ప్రభుత్వం అండగా నిలుస్తోందని, మంత్రి నారా లోకేష్ ఆధ్వర్యంలో ఇప్పటికే మెగా డీఎస్సీ నిర్వహించి రికార్డు సృష్టించామని సవిత పేర్కొన్నారు. ఉగాది కానుకగా జాబ్ క్యాలెండర్ను విడుదల చేయడం ద్వారా నిరుద్యోగుల్లో కొత్త ఆశలు చిగురించాయని చెప్పారు. ప్రభుత్వం ప్రతి నియోజకవర్గంలోనూ ఎంఎస్ఎంఈ పార్కులను ఏర్పాటు చేస్తోందని, వీటిలో బీసీ పారిశ్రామికవేత్తలకు ప్రత్యేక ప్రాధాన్యత కల్పిస్తామని వెల్లడించారు. అలాగే దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణం వంటి వినూత్న పథకాలతో కూటమి ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజల మన్ననలు పొందుతోందని ఆమె వివరించారు.
గత వైకాపా ప్రభుత్వంపై మంత్రి సవిత తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. జగన్ హయాంలో బీసీల హక్కులను పూర్తిగా కాలరాశారని, వడ్డెరలకు మైనింగ్ లీజుల్లో ఉన్న రిజర్వేషన్లను రద్దు చేసి వారి పొట్ట కొట్టారని మండిపడ్డారు. జగన్ అధికార దాహంతో తన సొంత తల్లిని, చెల్లిని కూడా కోర్టులకు ఈడ్చారని, అలాంటి వ్యక్తికి ప్రజల సంక్షేమం పట్టదని విమర్శించారు. దానికి భిన్నంగా చంద్రబాబు ప్రభుత్వం మహిళల కోసం దీపం-2, స్త్రీ శక్తి, తల్లికి వందనం వంటి పథకాలను ప్రవేశపెట్టి వారిని ఆర్థికంగా బలోపేతం చేస్తోందని, బీసీల రక్షణ కోసం ప్రత్యేక చట్టం తీసుకురావడానికి ముసాయిదా కూడా సిద్ధమైందని ఆమె తెలిపారు.
అంతకుముందు నూజివీడు చేరుకున్న మంత్రి సవితకు కూటమి నాయకులు, కార్యకర్తలు ఆమెను ఘనంగా సత్కరించి, పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వడ్డెర డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఎం. ఈశ్వరరావుతో పాటు పలువురు డైరెక్టర్లు, ఉమ్మడి కృష్ణా జిల్లా వడ్డెర సంఘం ప్రతినిధులు, పెద్ద సంఖ్యలో పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. ప్రభుత్వం అందిస్తున్న ఈ సంక్షేమ ఫలాలు ప్రతి ఇంటికీ చేరుతాయని, రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించడమే కూటమి లక్ష్యమని మంత్రి తన ప్రసంగాన్ని ముగించారు.