రాష్ట్రవ్యాప్తంగా ‘ఆపరేషన్ క్లీన్ స్వీప్’కు శ్రీకారం..
స్వచ్ఛ ఆంధ్ర దిశగా నాలుగు వారాల భారీ పారిశుధ్య యజ్ఞం..
విజయవాడలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన “ఆపరేషన్ క్లీన్ స్వీప్” కార్యక్రమానికి ఘనంగా శ్రీకారం చుట్టారు. రాష్ట్రంలోని అన్ని మునిసిపాలిటీలను పూర్తిస్థాయిలో పరిశుభ్రంగా మార్చడమే లక్ష్యంగా ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని నాలుగు వారాల పాటు నిర్వహించనున్నారు. కార్యక్రమాన్ని మంత్రి నారాయణ బెలూన్లు ఎగురవేసి ప్రారంభించారు. అనంతరం పారిశుధ్య కార్మికులతో కలిసి స్వయంగా రోడ్లు ఊడ్చి, రోడ్డు డివైడర్లకు పెయింటింగ్ వేయడంతో పాటు మొక్కలు నాటి ప్రజలకు సందేశం ఇచ్చారు. తర్వాత అన్న క్యాంటీన్లో సాధారణ ప్రజలతో కలిసి అల్పాహారం తీసుకుని అందరినీ ఆకట్టుకున్నారు.
ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ… పరిశుభ్రమైన పట్టణాల నిర్మాణంలో ప్రజల భాగస్వామ్యం చాలా కీలకమని అన్నారు. ప్రభుత్వంతో పాటు స్వచ్ఛంద సంస్థలు, స్థానిక ప్రజలు కలిసివస్తేనే పారిశుధ్య కార్యక్రమాలు విజయవంతమవుతాయని తెలిపారు. సీఎం చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన “స్వర్ణ ఆంధ్ర – స్వచ్ఛ ఆంధ్ర” కార్యక్రమం ద్వారా ప్రజల్లో పరిశుభ్రతపై చైతన్యం పెంచుతున్నామని చెప్పారు.
ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమాన్ని నాలుగు దశల్లో అమలు చేస్తున్నట్లు మంత్రి వివరించారు. మొదటి వారంలో రోడ్లు, ప్రజా ప్రదేశాలను శుభ్రపరచడం, రెండో వారంలో కాలువలను క్లీన్ చేయడం చేపడతామని తెలిపారు. మూడో వారంలో ఇళ్లు, దుకాణాల వద్ద తడి-పొడి చెత్తను వేరు చేసేలా ప్రజలకు అవగాహన కల్పిస్తామని చెప్పారు. నాలుగో వారంలో పబ్లిక్ టాయిలెట్ల పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టి పెట్టనున్నట్లు వెల్లడించారు.
గత ప్రభుత్వంపై కూడా మంత్రి విమర్శలు గుప్పించారు. చెత్త పన్ను వేసినా పట్టణాల్లో చెత్త కుప్పలు పేరుకుపోయే పరిస్థితి తీసుకొచ్చారని ఆరోపించారు. ప్రస్తుతం మునిసిపాలిటీలను డంపింగ్ యార్డ్ రహితంగా మార్చే దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టిందని తెలిపారు. ఇందులో భాగంగా వ్యర్థాలను విద్యుత్తుగా మార్చే వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు.
ఈ కార్యక్రమంలో ప్రతి వర్గానికి చెందిన ప్రజలు పాల్గొని తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని మంత్రి నారాయణ పిలుపునిచ్చారు. “పరిశుభ్రమైన నగరం… ఆరోగ్యకరమైన సమాజానికి బాట” అని ఆయన పేర్కొన్నారు.