- కుటుంబసభ్యులతో కలిసి ఇఫ్తార్ విందు స్వీకరణ…
- ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్న మంత్రి నారా లోకేష్..
Tadepalli nara Lokesh: పవిత్ర రంజాన్ మాసం వేళ జోరువానలోనూ పేద ముస్లీం మైనార్టీ సోదరుడి నివాసానికి విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ రాకతో ఆ ఇంట ఆనందాలు వెల్లివిరిశాయి. రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని మంగళగిరి నియోజకవర్గం తాడేపల్లి పట్టణంలోని పోలకంపాడులో పేద ముస్లీం మైనార్టీ సోదరుడు షేక్ అమీర్ ఇంటిని మంత్రి నారా లోకేష్ ఆకస్మికంగా సందర్శించారు. అమీర్ కుటుంబసభ్యులతో కలిసి ఇఫ్తార్ విందు స్వీకరించారు. షేక్ అమీర్ విజయవాడలోని ఓ ప్రైవేటు కంపెనీలో లోన్ రికవరీ ఏజెంట్ గా పనిచేస్తున్నాడు. ముందుగా అమీర్ నివాసానికి చేరుకున్న మంత్రి నారా లోకేష్ ను కుటుంబ సభ్యులు సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ముస్లీం సంప్రదాయం ప్రకారం టోపీ ధరించి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ముస్లీం సోదరులకు మంత్రి రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం కుటుంబ సభ్యులతో కలిసి మంత్రి ఇఫ్తార్ విందు స్వీకరించారు.
మంగళగిరిలో త్వరలో మరో 2వేల ఇళ్ల పట్టాల పంపిణీ
ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ.. దేవుడు ఒక్కక్కరికి ఒక్కో అవకాశం ఇస్తాడు. ప్రజలకు మేలు చేసేందుకు నారా చంద్రబాబునాయుడు గారికి నాలుగో సారి సీఎం అయ్యే అవకాశం ఇచ్చాడు. రంజాన్ సందర్భంగా బాధ్యతగా ప్రతి ఏడాది ముస్లీం సోదరుడి నివాసాన్ని సందర్శిస్తున్నాను. మంగళగిరి నియోజకవర్గంలో గత ఎన్నికల్లో 53వేల మెజార్టీ అడిగితే ప్రజలు 91వేల మెజార్టీ ఇచ్చారు. మంగళగిరి నియోజకవర్గాన్ని ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతాం. మొదటి విడతలో 3వేల ఇళ్ల పట్టాలు అందించాం. త్వరలో మరో 2వేల ఇళ్ల పట్టాలు అందిస్తాం. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మిస్తాం.
కుటుంబానికి అన్నివిధాల అండగా ఉంటానని హామీ
ఇఫ్తార్ విందు సందర్భంగా అమీర్ కుటుంబ సభ్యుల యోగక్షేమాలను మంత్రి నారా లోకేష్ అడిగి తెలుసుకున్నారు. అమీర్ తల్లిదండ్రులు షేక్ అన్వర్, షెర్మ, ఇతర కుటుంబ సభ్యులను ఆప్యాయంగా పలకరించారు. లారీ డ్రైవర్ గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నానని, తనకు ఇద్దరు కుమారులు హమీఫ్, అమీర్, ఒక కుమార్తె షమీమ్ సంతానం అని అన్వర్ తెలిపారు. కుమార్తెకు వివాహం జరిపించానని, కుమారులిద్దరూ చిన్న ఉద్యోగాలు చేస్తున్నారని చెప్పారు. ప్రస్తుతం నివాసముంటున్న ఇరుకు ఇంటితో ఇబ్బందులు పడుతున్నామని, వర్షం వస్తే కారుతోందని, పాత రేకుల ఇంటి స్థానంలో నూతన ఇల్లు నిర్మించి ఇవ్వాలని మంత్రి లోకేష్ ను కోరారు. కుటుంబానికి అన్ని విధాల అండగా ఉంటానని, ఇల్లు నిర్మించి ఇస్తామని మంత్రి హామీ ఇచ్చారు. పవిత్ర రంజాన్ వేళ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ తమ ఇంటిని సందర్శించడం పట్ల అమీర్, కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేశారు. అనంతరం మంత్రి లోకేష్ అమీర్ కుటుంబానికి రంజాన్ బహుమతిని అందజేశారు.