వైద్య పరికరాల కొనుగోళ్లపై వస్తున్న అక్రమాలపై ప్రభుత్వం సీరియస్..
వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి సౌరభ్ గౌర్ కు లిఖితపూర్వక ఆదేశాలు జారీ..
అమరావతి: రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖలో వైద్య పరికరాల కొనుగోళ్లపై వస్తున్న అక్రమాల ఆరోపణలను ప్రభుత్వం సీరియస్గా తీసుకుంది. ఈ వ్యవహారంపై పూర్తి స్థాయి నివేదిక ఇవ్వాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ అధికారులను ఆదేశించారు. పారదర్శకతకు ఎలాంటి భంగం కలగకుండా సంస్కరణలు తీసుకురావాలని కూడా స్పష్టం చేశారు.
శనివారం మంత్రి సత్యకుమార్ యాదవ్ వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి సౌరభ్ గౌర్ కు లిఖితపూర్వక ఆదేశాలు జారీ చేశారు. వైద్య పరికరాల కొనుగోళ్లతో పాటు శాఖకు సంబంధించిన మరికొన్ని కీలక అంశాలపై కూడా సమగ్ర నివేదిక ఇవ్వాలని సూచించారు.
ఇటీవల మీడియాలో వచ్చిన కథనాల్లో వైద్య పరికరాలను అధిక ధరలకు కొనుగోలు చేస్తున్నారని, అవసరం లేని పరికరాలను కూడా కొనుగోలు చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొంతమంది సరఫరాదారులకు అనుకూలంగా సాంకేతిక ప్రమాణాలు రూపొందిస్తున్నారని, గతంలో అనర్హులుగా ప్రకటించిన కంపెనీలకు మళ్లీ అవకాశాలు ఇస్తున్నారనే విమర్శలపై కూడా మంత్రి వివరాలు కోరారు.
ఈ ఆరోపణలపై పూర్తిస్థాయి విచారణ జరిపి, వాస్తవ పరిస్థితులపై తక్షణమే నివేదిక సమర్పించాలని మంత్రి ఆదేశించారు. భవిష్యత్తులో ఇలాంటి అనుమానాలకు అవకాశం లేకుండా నియమ నిబంధనలకు అనుగుణంగా పూర్తిగా పారదర్శక విధానంలో కొనుగోళ్లు జరిగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
సరఫరాదారుల్లో నమ్మకం పెరిగేలా సమగ్ర సంస్కరణల దిశగా ప్రతిపాదనలు ఇవ్వాలని కూడా మంత్రి పేర్కొన్నారు. వైద్య పరికరాల కొనుగోలుకు సంబంధించిన ప్రతిపాదనలు సిద్ధం చేయడం నుంచి టెండర్లు పిలవడం, తుది నిర్ణయాలు తీసుకోవడం వరకు మొత్తం ప్రక్రియ అధికారుల చేతుల్లోనే ఉంటుందని ఆయన గుర్తుచేశారు. వ్యవస్థలో లోపాలు ఉంటే వాటిని సరిదిద్దేందుకు చర్యలు సూచించాలని కార్యదర్శిని ఆదేశించారు.
ఇదే సమయంలో APMSIDC ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కృష్ణ మోహన్ మంత్రి సత్యకుమార్ యాదవ్ను కలిసి వివరణ ఇచ్చారు. వైద్య పరికరాల సాంకేతిక ప్రమాణాల నిర్ణయంలో తన పాత్ర లేదని స్పష్టం చేశారు.
దంత వైద్య పేషెంట్ కుర్చీల విషయంలో ఒక కంపెనీ పేరుతోనే ప్రమాణాలు సూచించారని, అది నిబంధనలకు విరుద్ధంగా ఉండటంతో పునఃపరిశీలించాలని మాత్రమే సూచించానని తెలిపారు. అలాగే 16 స్లైస్ సీటీ స్కాన్ యంత్రాల కొనుగోలు విషయంలో మార్కెట్ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని మళ్లీ పరిశీలించాలని చెప్పినట్లు వివరించారు. తాను ఎలాంటి అక్రమాలకు పాల్పడలేదని ఈడీ స్పష్టం చేశారు.
ఇక శాఖలో సాధారణ బదిలీల ప్రక్రియపై కూడా మంత్రి దృష్టి సారించారు. 2026 సాధారణ బదిలీలు ఈసారి మరింత పారదర్శకంగా, వేగంగా జరిగేలా ముందస్తు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. గత ఏడాది ఎదురైన సమస్యలు పునరావృతం కాకుండా పటిష్టమైన ఆన్లైన్ వ్యవస్థ ద్వారా తక్కువ సమయంలో లోపరహిత బదిలీలు పూర్తి చేయాలని సూచించారు.
ఉద్యోగ సంఘాల ప్రతినిధులకు బదిలీల నుంచి మినహాయింపుల అంశాన్ని కూడా లోతుగా పరిశీలించి తగిన సూచనలు ఇవ్వాలని మంత్రి పేర్కొన్నారు. అదేవిధంగా, వైద్యులు మరియు సిబ్బంది సంఘాలు తమ సర్వీస్ సమస్యలపై ఇచ్చిన వినతులు చాలాకాలంగా పెండింగ్లో ఉన్నాయని మంత్రి గుర్తించారు. వాటన్నింటినీ సమగ్రంగా పరిశీలించి సాధ్యాసాధ్యాలపై చర్చించేందుకు వెంటనే నివేదిక సమర్పించాలని కార్యదర్శి సౌరభ్ గౌర్కు ఆదేశాలు జారీ చేశారు.