జూన్ 4, 2024 ప్రజా తీర్పు ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణానికి మార్గదర్శకం..
ప్రజల విశ్వాసమే మా బలం.. అభివృద్ధి పథంలో ఏపీ: ప్రభుత్వం..
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రలో జూన్ 4, 2024 ఒక చారిత్రాత్మక రోజుగా నిలిచిపోయిందని రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. విధ్వంసం నుంచి వికాసం వైపు రాష్ట్రాన్ని తీసుకెళ్లాలనే సంకల్పంతో ప్రజలు ఇచ్చిన అపూర్వమైన తీర్పుకు నేటితో రెండేళ్లు పూర్తయ్యాయని వెల్లడించింది.
ఈ సందర్భంగా విడుదల చేసిన సందేశంలో, ఆ విజయం కేవలం అధికారాన్ని అందించిన ఫలితం కాదని, రాష్ట్ర పునర్నిర్మాణ బాధ్యతను ప్రజలు తమపై ఉంచిన విశ్వాసానికి నిదర్శనమని పేర్కొంది. ప్రజలు అప్పగించిన ఆ బాధ్యతను గౌరవిస్తూ ప్రతి క్షణం వారి ఆశలు, ఆకాంక్షలు నెరవేర్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపింది.
రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యాలని పేర్కొంటూ, రైతులు, మహిళలు, యువత, ఉద్యోగులు, కార్మికులు సహా సమాజంలోని ప్రతి వర్గం అభ్యున్నతికి అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్నామని వివరించింది. సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలన అనే మూడు ప్రధాన సూత్రాల ఆధారంగా పాలన కొనసాగుతోందని వెల్లడించింది.
అసమానతలు లేని సమాజ నిర్మాణం, రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల సమతుల్య అభివృద్ధి తమ ప్రభుత్వ ధ్యేయమని పేర్కొంది. ప్రజలు ఉంచిన విశ్వాసాన్ని నిలబెట్టుకోవడం తమ బాధ్యతగా భావిస్తూ, ఆంధ్రప్రదేశ్ను ఆరోగ్యవంతమైన, సంపన్నమైన, సంతోషకరమైన రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు కట్టుబడి ఉన్నామని స్పష్టం చేసింది.
ప్రజలు ఇచ్చిన చారిత్రాత్మక తీర్పును గౌరవించేలా, వారు గర్వపడే విధంగా పాలన అందించేందుకు ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని తెలిపింది. ఈ రెండేళ్ల ప్రయాణంలో అండగా నిలిచిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ, రాష్ట్ర అభివృద్ధి కోసం ఇదే స్పూర్తితో ముందుకు సాగుతామని ప్రభుత్వం పేర్కొంది. "జై ఆంధ్రప్రదేశ్" అంటూ తన సందేశాన్ని ముగించింది.