అమరావతి అభివృద్ధి పనులు వేగంగా.. రైతులను రెచ్చగొట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయి: మంత్రి నారాయణ..
రాజధానిలో 75 వంతెనల నిర్మాణం.. మౌలిక వసతుల పనులు వేగవంతం..
అమరావతి: రాష్ట్ర రాజధాని అమరావతిలో మౌలిక వసతుల అభివృద్ధి పనులు వేగంగా కొనసాగుతున్నాయని పురపాలక శాఖ మంత్రి నారాయణ తెలిపారు. రాజధాని ప్రాంతంలో ట్రంక్ రోడ్లు, వంతెనలు, వాగుల అభివృద్ధి పనులను పరిశీలించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.
రాజధానిలో ట్రంక్ రోడ్లపై 43 వంతెనలు, ల్యాండ్ పూలింగ్ స్కీమ్ (ఎల్పీఎస్) జోన్లలో మరో 32 వంతెనల నిర్మాణం జరుగుతోందని మంత్రి వివరించారు. వర్షాకాలం సమీపిస్తున్న నేపథ్యంలో కొండవీటి వాగు ప్రవాహానికి ఎలాంటి ఆటంకం కలగకుండా ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని చెప్పారు. వాగులో పేరుకుపోయిన మట్టిని తొలగిస్తూ నీటి ప్రవాహం సాఫీగా కొనసాగేలా అధికారులు పనిచేస్తున్నారని తెలిపారు.
అలాగే శాఖమూరు, పెనుమాక, నీరుకొండ ప్రాంతాల్లో నిర్మిస్తున్న రిజర్వాయర్ల పనులు ఇప్పటికే సగానికి పైగా పూర్తయ్యాయని వెల్లడించారు. భారీ వర్షాలు కురిస్తే కొన్ని పనులకు తాత్కాలికంగా ఆటంకాలు ఏర్పడే అవకాశం ఉన్నప్పటికీ, నిర్ణయించిన గడువులోగా పనులు పూర్తి చేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా రాజకీయ అంశాలపై స్పందించిన మంత్రి నారాయణ, అమరావతి రైతులను వైసీపీ నాయకులు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. రైతుల మధ్య విభేదాలు సృష్టించి రాజధాని అభివృద్ధిని అడ్డుకోవాలనే ఉద్దేశంతో వ్యవహరిస్తున్నారని విమర్శించారు.
అమరావతి అంశంపై వైసీపీ ప్రత్యేక కమిటీలు ఏర్పాటు చేయడం హాస్యాస్పదంగా ఉందని మంత్రి వ్యాఖ్యానించారు. రాజధానిలో జరుగుతున్న అభివృద్ధి పనులను ప్రత్యక్షంగా వచ్చి పరిశీలిస్తే వాస్తవ పరిస్థితులు అర్థమవుతాయని అన్నారు.
రాజధాని నిర్మాణంలో భాగంగా ఇప్పటికే రోడ్లు, భవనాలు, పైప్లైన్లు వంటి కీలక మౌలిక వసతుల పనులు కొనసాగుతున్నాయని, ఈ పరిస్థితుల్లో రైతులకు భూములను తిరిగి ఎలా ఇవ్వగలమని ప్రశ్నించారు. భారీ స్థాయిలో అభివృద్ధి పనులు జరుగుతున్న సమయంలో భూములను వెనక్కి ఇవ్వాలనే డిమాండ్లు ఆచరణ సాధ్యం కాదని స్పష్టం చేశారు.
మాజీ ముఖ్యమంత్రి హోదాలో పనిచేసిన వ్యక్తులు కూడా వాస్తవ పరిస్థితులను పరిగణనలోకి తీసుకోకుండా వ్యాఖ్యలు చేయడం ఆశ్చర్యంగా ఉందని మంత్రి నారాయణ అన్నారు. అమరావతి అభివృద్ధిపై ప్రభుత్వం పూర్తి స్థాయిలో దృష్టి సారించిందని, రాజధానిని ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దే దిశగా పనులు కొనసాగుతున్నాయని ఆయన పేర్కొన్నారు.