India New Zealand FTA: భారత్ న్యూజిలాండ్ దేశాల మధ్య చారిత్రాత్మక స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (FTA) ఖరారైంది అయిందన్న విషయం అందరికి తెలిసినవే. ఈ నెల 24వ తేదీన ఢిల్లీలోని భారత్ మండపంలో ఇరు దేశాల ప్రతినిధులు ఈ కీలక ఒప్పందంపై సంతకాలు చేయనున్నారు. గత ఏడాది డిసెంబర్ నెలలోనే చర్చలు ముగియగా, ఇప్పుడు అధికారికంగా దీనికి రూపకల్పన చేస్తున్నారు. వచ్చే ఐదేళ్లలో రెండు దేశాల మధ్య వ్యాపారాన్ని రెట్టింపు చేసి, సుమారు 5 బిలియన్ డాలర్లకు చేర్చడమే ఈ ఒప్పందం యొక్క ప్రధాన లక్ష్యం.
ఈ ఒప్పందం వల్ల మన దేశంలోని ఎగుమతిదారులకు భారీ ఊరట కలగనుంది. భారత్ నుంచి న్యూజిలాండ్కు వెళ్లే అన్ని వస్తువులపై ఎటువంటి పన్నులు ఉండవు. దీనివల్ల మన దేశ వస్తువులకు అక్కడ మంచి డిమాండ్ ఏర్పడే అవకాశం ఉంది. అదే సమయంలో, రాబోయే 15 ఏళ్లలో న్యూజిలాండ్ నుంచి దాదాపు 20 బిలియన్ డాలర్ల పెట్టుబడులు ఇండియాకు వస్తాయని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇది మన ఆర్థిక వ్యవస్థకు పెద్ద ఊతాన్ని ఇస్తుంది.
న్యూజిలాండ్ నుంచి వచ్చే ఉన్ని, కలప, బొగ్గు వంటి వస్తువులపై భారత్ పన్నులు తగ్గించనుంది. అయితే, మన దేశ రైతు ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకుంది. ముఖ్యంగా పాల ఉత్పత్తులు (పాలు, పెరుగు, చీజ్), ఉల్లిపాయలు, చక్కెర, నూనెలు రబ్బరు వంటి వాటిపై ఎటువంటి రాయితీలు ఇవ్వలేదు. దీనివల్ల స్థానిక రైతులు నష్టపోకుండా జాగ్రత్తలు తీసుకున్నట్లు స్పష్టమవుతోంది.
సేవా రంగంలో కూడా ఈ ఒప్పందం కీలక మార్పులు తీసుకురానుంది. భారతీయ నిపుణుల కోసం న్యూజిలాండ్ ప్రతి ఏటా 5,000 వీసాలను ప్రత్యేకంగా కేటాయించనుంది. ఐటీ, ఇంజనీరింగ్, హెల్త్కేర్ రంగాలతో పాటు యోగా ఇన్స్ట్రక్టర్లు, ఆయుష్ నిపుణులు, భారతీయ వంట మాస్టర్లు సంగీత ఉపాధ్యాయులకు అక్కడ మంచి అవకాశాలు లభిస్తాయి. మూడు ఏళ్ల పాటు అక్కడ ఉండి పని చేసుకునే వెసులుబాటు ఈ ఒప్పందం కల్పిస్తోంది.
ప్రస్తుతం రెండు దేశాల మధ్య వ్యాపారం కేవలం 1.3 బిలియన్ డాలర్లుగా మాత్రమే ఉంది. ఐటీ పర్యాటక రంగం కలిపితే ఇది 2.4 బిలియన్ డాలర్ల వరకు ఉంటుంది. ఈ కొత్త ఒప్పందంతో వాణిజ్య సంబంధాలు మరింత బలపడతాయని ఇరు దేశాలు ఆశిస్తున్నాయి. ఏప్రిల్ 24న జరిగే ఈ కార్యక్రమం ద్వారా భారత్ అంతర్జాతీయ వాణిజ్యంలో మరో ముందడుగు వేయబోతోంది.