మత్స్యకారుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం అండ..
రూ.262 కోట్ల సాయం జమ చేసిన సీఎం చంద్రబాబు..
శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలో నిర్వహించిన “మత్స్యకారుల సేవలో” కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొని మత్స్యకారుల సంక్షేమంపై కీలక ప్రకటనలు చేశారు. సముద్రంలో చేపల వేట అనేది ఎంతో సాహసంతో కూడుకున్న జీవన విధానమని, కుటుంబాల కోసం మత్స్యకారులు రోజుల తరబడి సముద్రంలో కష్టపడతారని సీఎం పేర్కొన్నారు. అలాంటి కుటుంబాలకు ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.
ప్రతి సంవత్సరం ఏప్రిల్ 15 నుంచి జూన్ 14 వరకు చేపల వేట నిషేధ కాలం అమల్లో ఉంటుందని, ఈ సమయంలో ఉపాధి కోల్పోయే మత్స్యకార కుటుంబాలను ఆదుకోవడానికే “మత్స్యకారుల సేవలో” పథకం అమలు చేస్తున్నామని తెలిపారు. ఈ పథకం కింద ఒక్కో కుటుంబానికి రూ.20 వేల చొప్పున ఆర్థిక సహాయం అందిస్తున్నామని చెప్పారు. ఈ ఏడాది మొత్తం 1,30,796 మత్స్యకార కుటుంబాల బ్యాంకు ఖాతాల్లో రూ.262 కోట్లు జమ చేసినట్లు వెల్లడించారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాలంలో ప్రతి మత్స్యకార కుటుంబానికి 50 కిలోల బియ్యం ఇచ్చి సాయం చేసిన విషయాన్ని గుర్తుచేసిన చంద్రబాబు, ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్థిక సహాయాన్ని రూ.20 వేలకు పెంచినట్లు తెలిపారు. రాష్ట్రంలో సుదీర్ఘ తీరప్రాంతం ఉండటంతో లక్షలాది మంది మత్స్యకారులు చేపల వేటపై ఆధారపడి జీవిస్తున్నారని అన్నారు. వ్యవసాయం, నిర్మాణ రంగం తర్వాత అత్యధికంగా ఉపాధి కల్పిస్తున్న రంగం మత్స్యసంపదేనని పేర్కొన్నారు.
దేశంలో చేపల ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో ఉందని సీఎం చెప్పారు. అయితే 2019 నుంచి 2024 మధ్య చేపల ఉత్పత్తి గణనీయంగా తగ్గిందని ఆందోళన వ్యక్తం చేశారు. మత్స్యకారులను అన్ని విధాలా ఆదుకునేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని తెలిపారు.
మెకనైజ్డ్, మోటరైజ్డ్ పడవలకు లీటరుకు రూ.9 డీజిల్ సబ్సిడీ అందిస్తున్నామని, 2026-27 సంవత్సరానికి రూ.50 కోట్ల విలువైన డీజిల్ సబ్సిడీ మత్స్యకార బోట్లకు అందించామని చెప్పారు. అలాగే రూ.3256 కోట్ల వ్యయంతో 9 ఫిషింగ్ హార్బర్లు, 8 ఫిష్ ల్యాండింగ్ సెంటర్ల నిర్మాణ పనులు కొనసాగుతున్నాయని వెల్లడించారు.
మత్స్యకారుల భద్రతకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని పేర్కొంటూ, సముద్రంలో 4,550 ట్రాన్స్పాండర్లు ఏర్పాటు చేసి ప్రత్యేక కమ్యూనికేషన్ వ్యవస్థను తీసుకొచ్చామని తెలిపారు. పడవలు, వలలు, ప్రమాద పరిహారం వంటి సహాయాలను కూడా సకాలంలో అందిస్తున్నామని చెప్పారు.
“ఈ తీరం మనది... బోటు మనది... వేట మనదే” అని స్పష్టం చేసిన సీఎం, పొరుగు రాష్ట్రాల బోట్లు మన తీరప్రాంతంలోకి వచ్చి వేటాడడాన్ని సహించబోమన్నారు. మత్స్యకారుల హక్కులను కాపాడేందుకు తీరప్రాంతంలో నిఘా పెంచి కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
మత్స్యకారుల అభివృద్ధి కోసం మరో కీలక నిర్ణయం ప్రకటిస్తూ, 200 మెకనైజ్డ్ బోట్లను మంజూరు చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. వాటికి 60 శాతం సబ్సిడీ ఇవ్వడంతో పాటు మిగిలిన మొత్తాన్ని రుణంగా అందిస్తామని తెలిపారు.
జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ నిర్మాణానికి రూ.288 కోట్లు ఖర్చు చేస్తున్నామని, దీని ద్వారా మత్స్యకారులు ఆర్థికంగా మరింత బలోపేతం అవుతారని సీఎం పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టుపై కొందరు చేస్తున్న తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని ప్రజలకు సూచించారు.