- మంగంపేటలో లభించే బెరైట్ స్లో లభించే 10% మాత్రమే దేశీయంగా..
- రక్షణ, అణుశక్తి వైద్య రంగాలకు ఏపీసీఎండీసీలో లభించే తక్కువ గ్రేడ్ తో..
Chandrababu Letter To Union Minister Piyush Goyal: ఆంధ్రప్రదేశ్ ఖనిజాభివృద్ధి సంస్థ (APMDC) పరిధిలోని మంగంపేట ముగ్గురాయి (బెరైట్స్) గనుల ఎగుమతులపై కేంద్ర ప్రభుత్వం ఆంక్షలు విధించాలని భావిస్తున్న తరుణంలో, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పందిస్తూ కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ కి కీలకమైన లేఖ రాశారు. మంగంపేటలో లభించే ముగ్గురాయి నిల్వలపై ఆంక్షలు విధిస్తే ఏపీసీఎండీసీ ఆర్థిక పరిస్థితిపై తీవ్ర ప్రభావం పడుతుందని, కావున ఆ ప్రతిపాదనను వెంటనే పక్కన పెట్టాలని ఆయన కోరారు. మంగంపేటలో లభించే బెరైట్స్ నిల్వల్లో కేవలం 10 శాతం మాత్రమే దేశీయంగా ఆయిల్, గ్యాస్ మరియు రసాయన పరిశ్రమల్లో వినియోగిస్తున్నారని, మిగిలిన అధిక భాగం ఎగుమతులపైనే ఆధారపడి ఉందని సీఎం వివరించారు. ముఖ్యంగా రక్షణ, అణుశక్తి మరియు వైద్య రంగాలకు అవసరమైన అత్యున్నత ప్రమాణాలు మంగంపేటలో లభించే తక్కువ గ్రేడ్ ముగ్గురాయికి ఉండవని, అటువంటి కీలక రంగాలకు ఎంత మేర నిల్వలు అవసరమో అంతవరకు ప్రభుత్వం కేటాయించగలదని ఆయన స్పష్టం చేశారు.
ప్రస్తుతం మంగంపేట ప్రాజెక్టులో తక్కువ గ్రేడ్ కలిగిన ముగ్గురాయి నిల్వలు పెద్ద ఎత్తున పేరుకుపోయాయని, వీటిని నాణ్యమైన ముగ్గురాయితో కలిపి (Blending) విక్రయించడం ద్వారా సంస్థకు ఆదాయం వస్తుందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ఈ నిల్వలను విక్రయించడానికి ఇప్పటికే ఐదేళ్ల కాల పరిమితితో వివిధ అంతర్జాతీయ సంస్థలతో ఒప్పందాలు చేసుకున్నామని, ఇప్పుడు ఎగుమతులపై ఆంక్షలు విధిస్తే ఆ ఒప్పందాలకు విఘాతం కలగడమే కాకుండా బయ్యర్ల నమ్మకాన్ని కోల్పోతామని ఆవేదన వ్యక్తం చేశారు. ఒకవేళ ఎగుమతులు ఆగిపోతే మంగంపేట ప్రాజెక్టులో కార్యకలాపాలను పూర్తిగా నిలిపివేయాల్సి వస్తుందని, దీనివల్ల ఆ ప్రాంతంలోని సుమారు 150 పల్వరైజింగ్ యూనిట్లు మూతపడి వేలాది కుటుంబాలు తమ జీవనోపాధిని కోల్పోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు. రాష్ట్ర ఆర్థిక ప్రయోజనాలను, కార్మికుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ముగ్గురాయి ఎగుమతులపై ఆంక్షల ప్రతిపాదనను విరమించుకోవాలని సీఎం చంద్రబాబు కేంద్రానికి విజ్ఞప్తి చేశారు.