- Municipal Elections: బారికేడ్లతో అడ్డుకున్న పోలీసులు…
- తోపులాట జరగడంతో పలువురికి గాయాలు..
తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల (Municipal Elections) వేడి ఒక్కసారిగా విషాదంగా, వివాదాస్పదంగా మారింది. మక్తల్ మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ (BJP) అభ్యర్థిగా పోటీ చేస్తున్న మహదేవప్ప ఆత్మహత్యకు పాల్పడడం రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనం సృష్టించింది. ఈ ఘటన కేవలం ఒక వ్యక్తి మరణంగా మిగిలిపోకుండా, అధికార, ప్రతిపక్షాల మధ్య భారీ రాజకీయ పోరాటానికి దారితీసింది. మహదేవప్ప మృతి వెనుక రాజకీయ ఒత్తిళ్లు ఉన్నాయని ఆరోపిస్తూ బీజేపీ కార్యకర్తలు నేడు హైదరాబాద్లోని డీజీపీ కార్యాలయం వద్ద భారీ ఆందోళన చేపట్టారు.
మహదేవప్ప ఆత్మహత్య చేసుకున్న వార్త తెలియగానే బీజేపీ శ్రేణులు ఆగ్రహంతో ఊగిపోయాయి. తమ అభ్యర్థిని కాంగ్రెస్ నాయకులు వేధించారని, ఆ ఒత్తిడి తట్టుకోలేకే ఆయన బలవన్మరణానికి పాల్పడ్డారని ఆరోపిస్తూ వందలాది మంది కార్యకర్తలు లక్డీకాపూల్లోని డీజీపీ కార్యాలయానికి చేరుకున్నారు. "మహదేవప్ప మృతికి కారణమైన వారిని వెంటనే అరెస్ట్ చేయాలి", "కాంగ్రెస్ (Congress Party) అరాచక పాలన నశించాలి" అంటూ కార్యకర్తలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. పోలీసులు ముందు జాగ్రత్తగా డీజీపీ ఆఫీసు దారిలో భారీ బారికేడ్లను ఏర్పాటు చేశారు.
అయితే ఆవేశంతో ఉన్న కార్యకర్తలు ఆ బారికేడ్లను తోసుకుంటూ లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించారు. పోలీసులు బారికేడ్లతో వారిని అడ్డుకునేందుకు యత్నించారు. మహదేవప్ప ఆత్మహత్యకు కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని బీజేపీ కార్యకర్తలు నినాదాలు చేశారు. బారికేడ్లను తోసుకుంటూ డీజీపీ ఆఫీసులోకి వెళ్లేందుకు ప్రయత్నించడంతో తోపులాట చోటుచేసుకుంది. ఖైరతాబాద్ డీసీపీ శిల్పవల్లి కిందపడిపోయారు. పలువురు కార్యకర్తలకు గాయాలయ్యాయి.
మక్తల్ బీజేపీ అభ్యర్థి ఎరుకలి మహాదేవప్ప బలవన్మరణంపై తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి స్పందించారు. హైదరాబాద్లో శివధర్ రెడ్డి మాట్లాడుతూ.. సూసైడ్పై కేసు నమోదయిందని వివరించారు. ఎలాంటి సూసైడ్ నోట్ లభించలేదని అన్నారు. సూసైడ్ అంశంపై నిష్పక్షపాతంగా విచారణ సాగుతుందని చెప్పారు. “తెలంగాణలో 7 మున్సిపల్ కార్పొరేషన్లు, 116 మున్సిపాలిటీలకు ఫిబ్రవరి 11న ఎన్నికలు జరుగుతున్నాయి.
హైదరాబాద్ మినహా రాష్ట్రవ్యాప్తంగా జనవరి 27 నుంచి మోడల్ కోడ్ అమల్లోకి వచ్చింది. ఎన్నికల నేపథ్యంలో 1,183 లైసెన్స్ ఆయుధాలు డిపాజిట్ అయ్యాయి. 4,318 మందిపై గుడ్ బిహేవియర్ బౌండ్ ఓవర్ చర్యలు తీసుకుంటున్నాం. 398 నాన్ బెయిలబుల్ వారెంట్లు అమలు చేశాం” అని తెలిపారు. మహారాష్ట్ర, కర్ణాటక, ఏపీ, ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో కట్టుదిట్టంగా తనిఖీలు చేస్తున్నట్లు శివధర్ రెడ్డి చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా 181 FST, 167 SST బృందాలు విధుల్లో ఉన్నాయన్నారు. మోడల్ కోడ్ ఉల్లంఘన కేసులు మొత్తం 142 నమోదైనట్లు తెలిపారు.
ఫిబ్రవరి 9 సాయంత్రం 5 గంటల నుంచి సైలెంట్ పీరియడ్ అమలు అవుతోందని వివరించారు. అన్ని పోలింగ్ స్టేషన్లలో 100 శాతం వెబ్ కాస్టింగ్ ఉంటుందని అన్నారు. భయం లేకుండా ఓటు హక్కు వినియోగించుకోవాలని తెలంగాణ పోలీసులు విజ్ఞప్తి చేశారు.