AP Railway Projects 2026: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రవాణా వ్యవస్థను సమూలంగా ప్రక్షాళన చేస్తూ పారిశ్రామికాభివృద్ధికి బాటలు వేసే దిశగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన ఢిల్లీ పర్యటనలో మరో కీలక అడుగు వేశారు. కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్తో భేటీ అయిన సీఎం, రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న రైల్వే ప్రాజెక్టులు కొత్త రైలు మార్గాలు అత్యున్నత స్థాయి రైలు సర్వీసుల గురించి సుదీర్ఘంగా చర్చించారు. ఏపీ గుండా ప్రయాణించే మూడు హైస్పీడ్ రైల్ కారిడార్ల ప్రకటనపై కేంద్రానికి ధన్యవాదాలు తెలపడంతో పాటు, రాష్ట్రానికి మరిన్ని కీలక వసతులు కల్పించాలని విన్నవించారు.
హైదరాబాద్-బెంగళూరు, హైదరాబాద్-చెన్నై, చెన్నై-బెంగళూరు హైస్పీడ్ రైల్ కారిడార్ల అంశం ఈ భేటీలో ప్రధానంగా చర్చకు వచ్చింది. ఈ మూడు కారిడార్లు ఏపీ మీదుగా వెళ్లడం పట్ల సీఎం హర్షం వ్యక్తం చేస్తూనే, ఒక కీలక ప్రతిపాదనను కేంద్రం ముందుంచారు. బెంగళూరు-చెన్నై హైస్పీడ్ కారిడార్ను ఆధ్యాత్మిక రాజధాని తిరుపతికి అనుసంధానించాలని కోరారు. దీనివల్ల దేశం నలుమూలల నుంచి వచ్చే భక్తులకు రవాణా సౌకర్యం మరింత మెరుగుపడుతుందని చంద్రబాబు వివరించారు.
ఏపీ ప్రజల దశాబ్దాల కల అయిన ‘దక్షిణ కోస్తా రైల్వే జోన్’ పనుల వేగంపై ముఖ్యమంత్రి ప్రత్యేకంగా చర్చించారు. ఈ జోన్ పనులు వచ్చే ఏప్రిల్ 1వ తేదీ నుంచి లాంఛనంగా ప్రారంభమయ్యేలా తక్షణమే గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేయాలని కేంద్రమంత్రిని కోరారు. విశాఖపట్నం కేంద్రంగా ఏర్పడబోయే ఈ జోన్ రాష్ట్ర రైల్వే అభివృద్ధికి అత్యంత కీలకమని ఆయన గుర్తుచేశారు. అలాగే, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి రాజధాని అమరావతిలో ‘గ్రీన్ ఫీల్డ్ మెగా కోచింగ్ టెర్మినళ్లు’ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు.
అరటి రైతులకు ఊరట.. సరకు రవాణాకు కొత్త ఊపిరి
రైతు సంక్షేమం దృష్ట్యా చంద్రబాబు మరో వినూత్న విజ్ఞప్తి చేశారు. తాడిపత్రి ప్రాంతం నుంచి ముంబైలోని జేఎన్ పీటీ పోర్టుకు అరటి పండ్ల ఎగుమతుల కోసం 50 శాతం రాయితీతో ‘ఖాళీ రీఫర్ కంటైనర్లు కేటాయించాలని కోరారు. దీనివల్ల రాయలసీమ రైతులకు అంతర్జాతీయ మార్కెట్లో మంచి ధర లభిస్తుందని వివరించారు. వీటితో పాటు పారిశ్రామిక సరకు రవాణా కోసం ఇటార్సీ-విజయవాడ మధ్య ప్రత్యేక కారిడార్, అలాగే విజయవాడ మీదుగా ఖరగ్పూర్-చెన్నై మధ్య ఈస్ట్కోస్ట్ ఫ్రైట్ కారిడార్ ఏర్పాటు చేయాలని పట్టుబట్టారు.
ముఖ్యమంత్రి ప్రతిపాదనలపై రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ సానుకూలంగా స్పందించారని సమాచారం. ఏపీ అభివృద్ధికి రైల్వే శాఖ నుంచి పూర్తి సహకారం ఉంటుందని, త్వరలోనే గెజిట్ నోటిఫికేషన్ ఇతర ప్రాజెక్టులపై నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు. చంద్రబాబు చేసిన ఈ పర్యటనతో రాష్ట్ర రైల్వే ముఖచిత్రం మారబోతోందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.