ఉద్యోగ కల్పనపై వేగం పెంచిన ప్రభుత్వం..
రాష్ట్రంలో ఉద్యోగ సృష్టికి బలమైన చర్యలు..
అమరావతి: రాష్ట్రంలో 20 లక్షలకు పైగా ఉద్యోగాలు కల్పించాలనే లక్ష్యంతో ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నట్లు మంత్రుల బృందం స్పష్టం చేసింది. ఈ లక్ష్య సాధనలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని వారు పిలుపునిచ్చారు.
గురువారం ఏపీ సచివాలయం 5వ బ్లాక్లో ఇన్వెస్ట్మెంట్ అండ్ ఎంప్లాయిమెంట్ జనరేషన్పై మంత్రుల బృందం సమీక్ష సమావేశం నిర్వహించింది. ఈ సమావేశంలో మంత్రులు కందుల దుర్గేష్, టి.జి. భరత్, గొట్టిపాటి రవికుమార్, కొండపల్లి శ్రీనివాస్తో పాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి. సాయి ప్రసాద్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం 20 లక్షలకు పైగా ఉద్యోగాల కల్పన కోసం చేస్తున్న కృషిని వివరించారు. ఇప్పటికే కల్పించిన ఉద్యోగాలను కూడా సమగ్రంగా నమోదు చేయాలని నిర్ణయించారు. నూతనంగా ఉద్యోగాలు పొందిన ప్రతి ఒక్కరి వివరాలను ఒక ప్రత్యేక పోర్టల్లో నమోదు చేయాలని సూచించారు. ఈ వివరాలు పారదర్శకంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు.
అదేవిధంగా, ఆయా శాఖల అధికారులు ఈ ప్రక్రియను నిరంతరం పర్యవేక్షించాలని మంత్రులు స్పష్టం చేశారు. రాష్ట్రంలో భారీ, మధ్యస్థ, చిన్న పరిశ్రమలు (MSMEs) స్థాపన ద్వారా ఉద్యోగాల సృష్టి ఎలా జరుగుతోందో స్పష్టమైన డేటా ఉండాలని చెప్పారు. పరిశ్రమల ఏర్పాటు, పెట్టుబడులు, ఉద్యోగ అవకాశాలపై పూర్తి వివరాలు నమోదు చేసి, ప్రజలకు అందుబాటులో ఉంచేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
సమీక్షలో పలు కీలక అంశాలపై మంత్రులు ఉన్నతాధికారులతో చర్చించి, ఉద్యోగ కల్పన వేగవంతం చేసే దిశగా మార్గదర్శకాలు ఇచ్చారు. రాష్ట్ర అభివృద్ధిలో ఉద్యోగాల సృష్టి ప్రధాన పాత్ర పోషిస్తుందని, అందుకు ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తుందని మంత్రులు పేర్కొన్నారు.