- ఉత్తరాంధ్ర ఇలవేల్పుకు నీరాజనం: నూకాలమ్మ జాతరలో భక్తుల రద్దీ.. ఏర్పాట్లను పర్యవేక్షించిన మంత్రి అనిత..
- భక్తులతో ముఖాముఖి: క్యూ లైన్లలో సౌకర్యాలపై ఆరా తీసిన హోం మంత్రి.. అధికారులకు కీలక ఆదేశాలు..
Anakapalle Amavasya utsavalu: ఉత్తరాంధ్ర ప్రజల ఇలవేల్పుగా, కోర్కెలు తీర్చే కొంగు బంగారంగా పేరుగాంచిన అనకాపల్లి శ్రీ నూకాంబిక అమ్మవారి ఆలయంలో కొత్త అమావాస్య వార్షిక జాతర మహోత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా రాష్ట్ర హోం మంత్రి అనిత, అనకాపల్లి జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. హోం మంత్రి అనితకు ఆలయ అధికారులు మరియు అనకాపల్లి ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ ఘన స్వాగతం పలికారు. అనంతరం అమ్మవారి సన్నిధిలో ప్రత్యేక పూజలు చేశారు.
దర్శనం అనంతరం అర్చకులు వేద ఆశీర్వచనం అందజేశారు. ఆలయ అధికారులు మంత్రి అనితకు అమ్మవారి చిత్రపటాన్ని బహూకరించి, తీర్థప్రసాదాలు సమర్పించారు. నెల రోజుల పాటు అత్యంత వైభవంగా జరుగుతున్న నూకాలమ్మ అమ్మవారి జాతరకు ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేసింది. భారీ సంఖ్యలో భక్తులు తరలివస్తుండగా, వారి సౌకర్యాల కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంది. ఈ సందర్భంగా మంత్రి అనిత క్యూ లైన్లో ఉన్న భక్తులతో మాట్లాడి, ఏర్పాట్లపై అభిప్రాయాలు తెలుసుకున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు సమర్థవంతంగా నిర్వహించాలని అధికారులకు సూచించారు.