హైకోర్టు పరిసరాల్లో రూ.547 కోట్ల మౌలిక సదుపాయాలకు ఆమోదం..
అమరావతిని బ్లూ-గ్రీన్ సిటీగా తీర్చిదిద్దే దిశగా కీలక నిర్ణయాలు..
అమరావతి రాజధానిని భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దే దిశగా రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన 61వ సీఆర్డీఏ అథారిటీ సమావేశంలో రాజధాని అభివృద్ధికి సంబంధించిన పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. మొత్తం 18 అంశాలపై చర్చించి అథారిటీ ఆమోదం తెలిపింది.
భవిష్యత్ నగర అవసరాలను దృష్టిలో పెట్టుకుని అమరావతిలో అర్బన్ మొబిలిటీ ప్లానింగ్ను సమగ్రంగా రూపొందించాలని సీఎం అధికారులను ఆదేశించారు. ప్రజల రాకపోకలకు ఇబ్బందులు లేకుండా, ఆధునిక రవాణా వ్యవస్థకు అనుగుణంగా ప్రణాళికలు ఉండాలని సూచించారు.
హైకోర్టు భవనాల పరిసరాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు రూ.547.07 కోట్ల వ్యయానికి సీఆర్డీఏ అథారిటీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రహదారులు, పార్కింగ్, డ్రైనేజీ, విద్యుత్ తదితర సదుపాయాలను అభివృద్ధి చేయనున్నారు.
అమరావతిలో పర్యాటక రంగాన్ని ప్రోత్సహించేందుకు పీపీపీ విధానంలో భారీ జెయింట్ అబ్జర్వేషన్ వీల్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఇది రాజధానికి ప్రత్యేక ఆకర్షణగా మారుతుందని అధికారులు భావిస్తున్నారు.
ఎల్పీఎస్ లేఅవుట్లలో వీధిపోట్లు ఉన్న ప్రదేశాల్లో ఏటీఎంలు, కియోస్క్లు వంటి సదుపాయాలకు అనుమతులు ఇవ్వాలని అథారిటీ నిర్ణయించింది. అలాగే సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ను పీపీపీ లేదా జాయింట్ వెంచర్ విధానంలో అభివృద్ధి చేయడానికి కూడా ఆమోదం తెలిపింది.
రాజధాని పరిధిలో దిగువ, మధ్యతరగతి ప్రజలకు అందుబాటులో ఉండేలా గృహ సముదాయాలు నిర్మించాలని సీఎం స్పష్టం చేశారు. ప్రపంచ బ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంకు మార్గదర్శకాల ప్రకారం ఈ ప్రణాళికలు అమలు చేయాలని సూచించారు.
అమరావతిలో భవనాలు, అక్రమ నిర్మాణాలకు సంబంధించిన వివాదాల పరిష్కారం కోసం ప్రత్యేక బిల్డింగ్ ట్రైబ్యునల్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ప్రజలు కోర్టుల చుట్టూ తిరగకుండా సమస్యలు పరిష్కరించుకునేందుకు మీడియేషన్ సెంటర్ను కూడా ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించారు.
సీఆర్డీఏకు సొంత అగ్నిమాపక విభాగాన్ని ఏర్పాటు చేయాలని అథారిటీ అంగీకరించింది. దీంతో రాజధాని ప్రాంతంలో నిర్మాణాలకు అవసరమైన ఎన్వోసీలు వేగంగా జారీ చేసే అవకాశం ఉంటుంది.
రాజధానిలో డిస్ట్రిక్ట్ కూలింగ్ సిస్టమ్ ఏర్పాటు అంశంపై కూడా చర్చ జరిగింది. గత టాబ్రీడ్ ఒప్పందాన్ని రద్దు చేసి కొత్త టెండర్లు పిలవాలని నిర్ణయించారు. అన్ని భవనాలు, కార్యాలయాలకు ఒకే కేంద్రం నుంచి కూలింగ్ సరఫరా చేసే విధంగా వ్యవస్థ ఉండాలని సీఎం సూచించారు.
అమరావతి ఎకనామిక్ రీజియన్ అభివృద్ధికి సంబంధించి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఏలూరు నుంచి ప్రకాశం వరకు విస్తరించిన 9 జిల్లాల అభివృద్ధి కోసం ఆర్ఎఫ్పీ సిద్ధం చేయాలని అథారిటీ ఆమోదించింది. ఈ ప్రాంతంలో పారిశ్రామిక, వాణిజ్య, ఉపాధి అవకాశాలు పెరిగేలా ప్రణాళికలు రూపొందించనున్నారు.
అమరావతిని “బ్లూ-గ్రీన్ సిటీ”గా తీర్చిదిద్దాలని సీఎం చంద్రబాబు మరోసారి స్పష్టం చేశారు. ప్రతి టౌన్షిప్లో వర్క్ ఫ్రమ్ హోమ్ సదుపాయాలు, కమర్షియల్ కార్యకలాపాలు, నివాస వసతులు సమతుల్యంగా ఉండాలని సూచించారు. రాజధాని ప్రాంతంలో ఆర్థిక కార్యకలాపాలు పెరిగేలా ప్రణాళికలు రూపొందించాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.
అలాగే ఆస్పత్రుల్లో రోగులతో పాటు వారి వెంట వచ్చే అటెండెంట్లకు కూడా వసతి సదుపాయాలు కల్పించాలని సీఎం సూచించారు. హోటళ్లు, కన్వెన్షన్ సెంటర్ల నిర్మాణాన్ని వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో పురపాలక శాఖ మంత్రి నారాయణ, సీఎస్ జి.సాయి ప్రసాద్, పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శి సురేశ్ కుమార్, సీఆర్డీఏ అధికారులు పాల్గొన్నారు.