టిఎజిడివి ఆధ్వర్యంలో ‘శ్రీ పరాభవ’ నామ సంవత్సర ఉగాది వేడుకలు..
వెయ్యిమందికి పైగా హాజరై వేడుకకు ప్రత్యేక గుర్తింపు..
డెలావేర్ వ్యాలీ: తెలుగు అసోసియేషన్ ఆఫ్ గ్రేటర్ డెలావేర్ వ్యాలి ఆధ్వర్యంలో నిర్వహించిన ‘శ్రీ పరాభవ’ నామ సంవత్సర ఉగాది వేడుకలు అమెరికాలోని తెలుగు ప్రజలను ఒకే వేదికపైకి తీసుకువచ్చాయి. మే 2, 2026న డౌనింగ్ టౌన్ హై స్కూల్ ఈస్ట్ లో జరిగిన ఈ వేడుకలు అత్యంత వైభవంగా, ఆనందోత్సాహాల మధ్య సాగాయి.
సంస్థకు ఉన్న 53 ఏళ్ల సుదీర్ఘ చరిత్రలోనే వెయ్యిమందికి పైగా హాజరైన ఈ వేడుక ప్రత్యేక గుర్తింపును సంపాదించింది. మధ్యాహ్నం ప్రారంభమైన కార్యక్రమాలు రాత్రి వరకు దాదాపు ఆరు గంటల పాటు నిర్విరామంగా కొనసాగాయి. శాస్త్రీయ నృత్యాలు, జానపద కళాప్రదర్శనలు, సినీ నృత్యాలు ప్రేక్షకులను అలరించగా, ‘తార ఆర్ట్స్ అకాడమీ’ ప్రత్యేక ప్రదర్శన సభలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
సంగీత ప్రియులకు ఈ వేడుక మరింత మధురానుభూతిని అందించింది. ప్రముఖ గాయకులు శ్రీకాంత్ సందుగు, మనీషా ఈరాబతిని నేతృత్వంలోని ‘బెఫికర’ బ్యాండ్ సంగీత విభావరి ప్రేక్షకుల్లో ఉత్సాహాన్ని నింపింది. పాటలు, సంగీత ప్రదర్శనలు సభను ఉర్రూతలూగించాయి.
ఈ కార్యక్రమానికి సాహితి వింజమూరి, శ్వేత కొమ్మోజు వ్యాఖ్యాతలుగా వ్యవహరించి తమ చురుకైన నిర్వహణతో ఆకట్టుకున్నారు. ఉచిత ప్రవేశంతో పాటు రుచికరమైన విందు భోజనాన్ని ఏర్పాటు చేయడం ద్వారా టిఎజిడివి సంస్థ సేవా భావాన్ని మరోసారి చాటిచెప్పింది.
వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన ప్రముఖ గీత రచయిత, ఆస్కార్ అవార్డు గ్రహీత చంద్రబోస్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈ సందర్భంగా ఆయన తన సినీ ప్రయాణం, ఆస్కార్ అవార్డు వరకు చేరుకున్న అనుభవాలు, జీవితంలోని మధుర జ్ఞాపకాలను సభలో పంచుకున్నారు. ప్రేక్షకుల అభ్యర్థన మేరకు ఆయన ఆలపించిన పాటలు, నిర్వహించిన ముఖాముఖి కార్యక్రమం అందరినీ విశేషంగా ఆకట్టుకుంది.
తెలుగు సంస్కృతి, సంప్రదాయాలు, కళలను విదేశాల్లోనూ సజీవంగా నిలబెట్టే ప్రయత్నంలో భాగంగా నిర్వహించిన ఈ ఉగాది వేడుకలు తెలుగు వారిలో కొత్త ఉత్సాహాన్ని నింపాయి. కుటుంబ సమేతంగా హాజరైన తెలుగు ప్రజలు సాంస్కృతిక వైభవాన్ని ఆస్వాదిస్తూ పండుగను ఆనందంగా జరుపుకున్నారు.