- 2026-27 అసెస్మెంట్ సంవత్సరానికి ఐటీఆర్ ఫైలింగ్ ప్రారంభం..
- Business: ఆన్లైన్, ఆఫ్లైన్ పద్ధతుల్లో రిటర్నులు దాఖలు చేసే సౌకర్యం..
Tax Payers: ఆదాయపు పన్ను చెల్లింపుదారులకు ఐటీ శాఖ కీలక ఊరటనిస్తూ 2026-27 అసెస్మెంట్ సంవత్సరానికి (2025-26 ఆర్థిక సంవత్సరం) సంబంధించిన ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ (ఐటీఆర్) ప్రక్రియను అధికారికంగా ప్రారంభించింది. ఇందులో భాగంగా ఐటీఆర్-1 (సహజ్), ఐటీఆర్-4 (సుగం) ఫారాలకు సంబంధించిన ఎక్సెల్ యుటిలిటీలను ఈ-ఫైలింగ్ పోర్టల్లో ఇప్పటికే అందుబాటులో ఉంచింది. పన్ను చెల్లింపుదారులు తమ సౌలభ్యాన్ని బట్టి ఈ ఫారాలను ఆన్లైన్లో నేరుగా పూర్తి చేయవచ్చు లేదా ఆఫ్లైన్ యుటిలిటీని డౌన్లోడ్ చేసుకుని, వివరాలు నింపిన తర్వాత JSON ఫైల్ను పోర్టల్లో అప్లోడ్ చేయవచ్చని ఆదాయపు పన్ను శాఖ తన సోషల్ మీడియా వేదికగా స్పష్టం చేసింది. సాధారణంగా ఆడిట్ అవసరం లేని వేతన జీవులు మరియు ఇతర పన్ను చెల్లింపుదారులు తమ రిటర్నులను దాఖలు చేయడానికి జూలై 31వ తేదీని తుది గడువుగా నిర్ణయించారు.
అర్హతల విషయానికి వస్తే, రూ. 50 లక్షల లోపు వార్షిక ఆదాయం కలిగిన నివాస భారతీయులు ఐటీఆర్-1 ఫారాన్ని ఉపయోగించుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా రూ. 50 లక్షల లోపు ఆదాయం ఉండి, వ్యాపార లేదా వృత్తిపరమైన ఆదాయం పొందే వ్యక్తులు, హెచ్యూఎఫ్లు మరియు ఎల్ఎల్పీలు మినహా మిగిలిన సంస్థలు ఐటీఆర్-4 ఫారాన్ని దాఖలు చేయవచ్చు. ఈ ఏడాది సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ (సీబీడీటీ) కొన్ని కొత్త నిబంధనలను కూడా అమల్లోకి తెచ్చింది. దీని ప్రకారం లాంగ్-టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ మరియు షేర్ల బైబ్యాక్ లావాదేవీల వల్ల తలెత్తే నష్టాలకు సంబంధించిన సమగ్ర వివరాలను పన్ను చెల్లింపుదారులు తప్పనిసరిగా వెల్లడించాల్సి ఉంటుంది.
కాగా, దేశ ఆర్థిక స్థితిగతులను ప్రతిబింబిస్తూ 2025-26 ఆర్థిక సంవత్సరంలో నికర ప్రత్యక్ష పన్ను వసూళ్లు 5.12 శాతం వృద్ధితో రూ. 23,40,406 కోట్లకు చేరుకున్నట్లు సీబీడీటీ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. పన్నుల వసూళ్లలో సానుకూల వృద్ధి కనిపిస్తున్న తరుణంలో, గడువు ముగియకముందే రిటర్నులు దాఖలు చేయడం ద్వారా పన్ను చెల్లింపుదారులు జరిమానాల నుండి తప్పించుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.