- కలెక్టర్ల సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక ఆదేశాలు..
- Politics: ఆగస్టు 15 నాటికి 2.5 లక్షల ఇళ్లకు సామూహిక గృహప్రవేశాలు..
Chandrababu: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పేద మరియు మధ్యతరగతి విద్యార్థుల ఉన్నత విద్యా కలలను సాకారం చేసే దిశగా ప్రభుత్వం అత్యంత కీలకమైన నిర్ణయం తీసుకుంది. జాతీయ మరియు అంతర్జాతీయ స్థాయిలోని ప్రతిష్టాత్మక విద్యాసంస్థల్లో ప్రవేశం పొందే విద్యార్థులకు ఆర్థిక భారతం లేకుండా, కేవలం పావలా వడ్డీకే (0.25 శాతం) విద్యా రుణాలు మంజూరు చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. అమరావతి సచివాలయంలో నిర్వహిస్తున్న ఏడవ జిల్లా కలెక్టర్ల సదస్సులో సంక్షేమ పథకాలపై జరిగిన సమీక్షలో ఆయన ఈ చారిత్రాత్మక ప్రకటన చేశారు. ఈ పథకం ద్వారా ఐఐటీ (IIT), ఐఐఎం (IIM), ఎన్ఐటీ (NIT) వంటి జాతీయ స్థాయి సంస్థలతో పాటు, విదేశాల్లోని ప్రముఖ యూనివర్సిటీలలో చదువుకోవాలనుకునే విద్యార్థులకు పెద్దపీట వేయనున్నారు.
ఈ సమావేశం సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, సామాజికంగా వెనుకబడిన ఎస్సీ, ఎస్టీ, బీసీ మరియు మైనారిటీ వర్గాలకు చెందిన విద్యార్థులు ప్రపంచ స్థాయి విద్యావకాశాలను అందిపుచ్చుకునేలా ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని సూచించారు. కేవలం ఆర్థిక సాయమే కాకుండా, ప్రఖ్యాత సంస్థల్లో సీట్లు సాధించేందుకు అవసరమైన శిక్షణను కూడా ప్రభుత్వం తరపున అందించాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ యువతకు అంతర్జాతీయ స్థాయిలో ఉద్యోగ అవకాశాలు లభించేలా వారికి జర్మన్ భాషలో ప్రత్యేక శిక్షణ ఇస్తున్నట్లు ఆయన వెల్లడించారు. విదేశీ విద్య ద్వారా యువత ప్రపంచ పౌరులుగా ఎదగాలని, తద్వారా రాష్ట్ర ప్రతిష్టను ఇనుమడింపజేయాలని ఆయన ఆకాంక్షించారు.
కేవలం డిగ్రీలు అందజేయడమే కాకుండా, యువతలో నైపుణ్యాభివృద్ధిని (Skill Development) పెంపొందించి వారిని ఉపాధికి సిద్ధం చేయడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని చంద్రబాబు స్పష్టం చేశారు. విద్యతోనే కుటుంబాల ఆర్థిక స్థితిగతులు మారి, సమాజంలో సమగ్ర అభివృద్ధి సాధ్యమవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రభుత్వం అందిస్తున్న ఈ పావలా వడ్డీ రుణ సదుపాయం వల్ల వేలాది మంది ప్రతిభావంతులైన విద్యార్థులకు ఆర్థిక ఇబ్బందులు తొలగి, వారి బంగారు భవిష్యత్తుకు మార్గం సుగమం అవుతుందని ప్రభుత్వం ధీమా వ్యక్తం చేస్తోంది.
సంక్షేమ పథకాలపై సమీక్ష, కీలక ఆదేశాలు
సూపర్ సిక్స్ పథకాల అమలు, లబ్ధిదారుల ఇంటిగ్రేషన్పై ముఖ్యమంత్రి చంద్రబాబు విస్తృతంగా సమీక్షించారు. 'తల్లికి వందనం' ద్వారా 67 లక్షల మందికి రూ.10 వేల కోట్లు అందిస్తున్నామని, 'స్త్రీశక్తి' పథకం కింద మహిళలు ఇప్పటివరకు 60.6 కోట్ల ప్రయాణాలు చేశారని, దీనికోసం ప్రభుత్వం ఏటా రూ.1940 కోట్లు ఖర్చు చేస్తోందని తెలిపారు. 'దీపం 2.0' కింద 1.08 కోట్ల మంది లబ్ధిదారులకు రూ.3504 కోట్లు అందజేశామన్నారు. మే 19న మత్స్యకారుల కోసం రూ.286 కోట్లు పంపిణీ చేయనున్నట్లు వెల్లడించారు.
బుడగజంగాలకు ఎస్సీ ప్రయోజనాలు
సమాజంలో వెనుకబడిన వర్గాల అభ్యున్నతికి ప్రభుత్వం కట్టుబడి ఉందని సీఎం స్పష్టం చేశారు. బుడగజంగాలను ఎస్సీలలో చేర్చాలన్న డిమాండ్పై కేంద్రంతో చర్చిస్తామని, కేంద్రం నుంచి అనుమతులు వచ్చేలోపు ఉద్యోగాలు మినహా ఎస్సీలకు వర్తించే అన్ని సంక్షేమ ప్రయోజనాలను వారికి వర్తింపజేయాలని కలెక్టర్లను ఆదేశించారు. ఇది వారి సామాజిక, ఆర్థిక అభివృద్ధికి ఎంతగానో దోహదపడుతుంది.
పేదల సొంతింటి కల సాకారం
రాష్ట్రంలో పేదల సొంతింటి కలను సాకారం చేసేందుకు ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్తోందని సీఎం తెలిపారు. ఆగస్టు 15 నాటికి 2.50 లక్షల ఇళ్లకు, డిసెంబర్ నాటికి మరో 2.38 లక్షల ఇళ్లకు సామూహిక గృహప్రవేశాలు నిర్వహించాలని లక్ష్యంగా నిర్దేశించారు. 2027 డిసెంబర్ నాటికి మరో 10 లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తి చేయాలని ఆదేశించారు. ప్రభుత్వ భూములు, కొండ ప్రాంతాల్లో నిర్మించుకున్న ఇళ్లను క్రమబద్ధీకరించాలని, దీనివల్ల ఒక్క విజయవాడలోనే 60 వేల మందికి, విశాఖలో 30 వేల మందికి లబ్ధి చేకూరుతుందని అన్నారు.
పరిపాలనలో పారదర్శకత, వేగం
ప్రజలపై ఆర్థిక భారం తగ్గించేలా అధికారులు పనిచేయాలని సీఎం సూచించారు. ముఖ్యంగా విద్య, వైద్యం, విద్యుత్ ఖర్చులు తగ్గించేలా చొరవ చూపాలన్నారు. భూవివాదాలను పరిష్కరించడంలో భాగంగా వచ్చే కలెక్టర్ల సమావేశం నాటికి 22ఏ కింద ఒక్క దరఖాస్తు కూడా పెండింగ్లో ఉండకూడదని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. 2027 మార్చి నాటికి భూ రీసర్వే ప్రక్రియ పూర్తి చేసి, పట్టాదారు పాసుపుస్తకాలు జారీ చేయాలని ఆదేశించారు. కలెక్టర్ల సమావేశాలు, సమీక్షలు కేవలం ప్రజల సంక్షేమం కోసమేనని, ప్రతి అధికారి ఈ విషయాన్ని గుర్తుంచుకుని పనిచేయాలని చంద్రబాబు స్పష్టం చేశారు.