రికార్డు సమయంలో 15,491 టీచర్ నియామకాలు పూర్తి..
మెరిట్ ఆధారంగానే డీఎస్సీ నియామకాలు చేపట్టాం..
రాష్ట్రంలో నిర్వహించిన డీఎస్సీ నియామకాలపై వస్తున్న ఆరోపణలను రాష్ట్ర విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ తీవ్రంగా ఖండించారు. డీఎస్సీ నిర్వహణ పూర్తిగా పారదర్శకంగా జరిగిందని, ఎక్కడా అక్రమాలకు అవకాశం లేకుండా అన్ని చర్యలు తీసుకున్నామని స్పష్టం చేశారు. మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన, మెరిట్ ఆధారంగానే నియామకాలు చేపట్టామని వివరించారు.
రాష్ట్ర ప్రభుత్వం మొత్తం 16,347 టీచర్ పోస్టుల భర్తీకి డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయగా, 3.36 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసినట్లు తెలిపారు. డీఎస్సీ ప్రక్రియపై 226 కేసులు నమోదైనా, ప్రభుత్వం కేవలం 148 రోజుల్లోనే నియామక ప్రక్రియను పూర్తి చేసి 15,491 మందికి నియామక పత్రాలు అందజేసిందని చెప్పారు. రికార్డు స్థాయిలో నియామకాలు పూర్తి కావడం ప్రభుత్వ నిబద్ధతకు నిదర్శనమన్నారు.
డీఎస్సీ పరీక్షలను రాష్ట్రవ్యాప్తంగా 154 టీసీఎస్ అయాన్ కేంద్రాల్లో నిర్వహించామని, మొత్తం 89 సెషన్లలో పరీక్షలు జరిగాయని కోన శశిధర్ తెలిపారు. ఇతర రాష్ట్రాల్లోని 19 కేంద్రాల్లో కూడా పరీక్షలు నిర్వహించామని చెప్పారు. వేర్వేరు షిఫ్టుల్లో పరీక్షలు జరగడం వల్ల నార్మలైజేషన్ విధానాన్ని అమలు చేశామని వెల్లడించారు. మొత్తం 24 రోజుల పాటు పరీక్షలు జరిగినట్లు పేర్కొన్నారు.
డీఎస్సీ పరీక్షల భద్రతపై వచ్చిన సందేహాలను కూడా ఆయన తిప్పికొట్టారు. ప్రశ్నపత్రాల లీకేజీకి ఎలాంటి అవకాశం లేదని స్పష్టం చేశారు. ఒక్కో సబ్జెక్టుకు ఆరు నుంచి పది మంది నిపుణులు కలిసి ప్రశ్నపత్రాలు సిద్ధం చేస్తారని, ఆ తర్వాత వాటిని టీసీఎస్ సర్వర్లో అప్లోడ్ చేస్తారని చెప్పారు. ఎన్క్రిప్ట్ రూపంలో ఉండే ప్రశ్నపత్రాలు పరీక్ష సమయానికి మాత్రమే డీక్రిప్ట్ అవుతాయని వివరించారు. ఈ ప్రక్రియలో ఇద్దరు మాత్రమే సిస్టమ్లో అప్లోడ్ చేసే అవకాశం ఉంటుందని తెలిపారు. దేశంలోని అనేక ప్రభుత్వ సంస్థలు టీసీఎస్ అయాన్ ద్వారా పరీక్షలు నిర్వహిస్తున్నాయని, ఆ సాఫ్ట్వేర్లో అక్రమాలకు తావు లేదన్నారు.
సీబీటీ విధానంలో పరీక్షలు నిర్వహించడంతో పాటు పరీక్ష కేంద్రాల్లో సీసీ కెమెరాల పర్యవేక్షణ కూడా ఉన్నందున ఎలాంటి అవకతవకలు జరగలేదని కోన శశిధర్ స్పష్టం చేశారు. అభ్యర్థుల మార్కులను అధికారిక వెబ్సైట్లో ప్రచురించామని, మార్కులు బయటపెట్టలేదని జరుగుతున్న ప్రచారం పూర్తిగా అవాస్తవమని అన్నారు.
దరఖాస్తు సమయంలోనే అన్ని సర్టిఫికెట్లు అప్లోడ్ చేయాలని ముందుగానే సూచించామని, అయితే వేర్వేరు ప్రాంతాల్లో చదివిన అభ్యర్థులు వెరిఫికేషన్ సమయంలో సర్టిఫికెట్లు చూపించేందుకు అవకాశం ఇవ్వాలని కోరడంతో నిబంధనలో సడలింపు ఇచ్చామని తెలిపారు. సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం 1:3 నిష్పత్తిలో అభ్యర్థులను పిలిచామని చెప్పారు.
డీఎస్సీలో తొలిసారిగా ఎస్సీ సబ్ క్లాసిఫికేషన్తో పాటు హారిజాంటల్ రిజర్వేషన్లు అమలు చేశామని ఆయన వెల్లడించారు. స్పోర్ట్స్ కోటా, దివ్యాంగులు, మహిళలు, మాజీ సైనికుల కోసం ప్రత్యేక హారిజాంటల్ కోటాలు అమలు చేశామని తెలిపారు. అర్హత ఉన్న ఒక్క అభ్యర్థిని కూడా పక్కన పెట్టలేదని స్పష్టం చేశారు.
డీఎస్సీపై అభ్యర్థులు అడిగిన ప్రతి ప్రశ్నకు సమాధానం ఇచ్చామని, కోర్టులు కూడా సంతృప్తి చెందడం వల్లే నియామకాల ప్రక్రియకు ఎలాంటి ఆటంకాలు రాలేదని కోన శశిధర్ పేర్కొన్నారు. డీఎస్సీ నిర్వహణలో ప్రతి అంశం నిబంధనల ప్రకారమే జరిగిందని, ఆరోపణలకు ఎలాంటి ఆధారాలు లేవని ఆయన స్పష్టం చేశారు.