ఉచిత హాస్టల్, భోజనం, కోచింగ్తో ఇంటర్ విద్యకు ప్రభుత్వం చేయూత..
ఐఐటీ-జేఈఈ, నీట్ కోచింగ్ ఉచితం.. ముస్లీమ్ విద్యార్థులకు భారీ అవకాశం..
అమరావతి: పేద ముస్లీమ్ విద్యార్థులకు ఉన్నత విద్య అందించే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక అవకాశాన్ని కల్పించింది. కార్పొరేట్ కళాశాలల్లో పూర్తిగా ఉచితంగా ఇంటర్మీడియట్ విద్యను అందించేందుకు కూటమి ప్రభుత్వం ముందుకొచ్చిందని రాష్ట్ర రెవెన్యూ, రిజిస్ట్రేషన్ మరియు స్టాంప్స్ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు.
ఈ పథకం ద్వారా ఎంపికైన విద్యార్థులకు ఇంటర్మీడియట్ విద్యతో పాటు ఉచిత హాస్టల్ సౌకర్యం, భోజనం, పాఠ్యపుస్తకాలు, నాణ్యమైన బోధన అందించనున్నారు. అంతేకాకుండా IIT-JEE, NEET, EAMCET వంటి పోటీ పరీక్షలకు ప్రత్యేక కోచింగ్ కూడా ఇవ్వనున్నట్లు మంత్రి వెల్లడించారు.
తెల్ల రేషన్ కార్డు కలిగి ఉండి, స్టేట్ బోర్డులో 450 మార్కులకుపైగా లేదా సీబీఎస్ఈలో 75 శాతానికి మించి మార్కులు సాధించిన పేద ముస్లీమ్ విద్యార్థులు ఈ అవకాశానికి అర్హులని చెప్పారు. విద్యార్థులను ప్రవేశ పరీక్ష ద్వారా ఎంపిక చేయనున్నట్లు తెలిపారు.
ఈ నెల 12వ తేదీ ప్రవేశ పరీక్ష దరఖాస్తులకు చివరి తేదీ అని మంత్రి గుర్తుచేశారు. అర్హులైన విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఆయన కోరారు. సంక్షేమానికి ప్రాధాన్యతనిచ్చే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం ముస్లీమ్ల అభ్యున్నతికి కట్టుబడి ఉందనడానికి ఈ పథకం నిదర్శనమని మంత్రి అనగాని సత్యప్రసాద్ పేర్కొన్నారు.