కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవేంకటేశ్వర స్వామిని దర్శించుకోవాలని వేచి చూసే భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) కీలక సమాచారం అందించింది. 2026 ఏప్రిల్ నెలకు సంబంధించిన వివిధ రకాల దర్శన టికెట్లు, ఆర్జిత సేవల కోటాను విడుదల చేసే తేదీలను అధికారులు ప్రకటించారు. ఏప్రిల్ నెలలో ఎండాకాలం సెలవులు ప్రారంభమవుతాయి కాబట్టి భక్తుల రద్దీ ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. అందుకే ముందుగానే ప్లాన్ చేసుకునే భక్తుల కోసం ఈ సమగ్ర సమాచారం.
శ్రీవారి సుప్రభాతం, తోమాల వంటి ప్రధాన సేవల కోసం భక్తులు లక్కీ డిప్ విధానం ద్వారా టికెట్లు పొందాల్సి ఉంటుంది. జనవరి 19న ఉదయం 10 గంటలకు సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాదపద్మారాధన సేవల రిజిస్ట్రేషన్ ప్రారంభమవుతుంది. జనవరి 21న ఉదయం 10 గంటల వరకు ఆన్లైన్లో నమోదు చేసుకోవచ్చు. లక్కీ డిప్లో టికెట్లు పొందిన వారు జనవరి 21 నుంచి 23వ తేదీ మధ్యాహ్నం 12 గంటల లోపు సొమ్ము చెల్లించి టికెట్లను కన్ఫర్మ్ చేసుకోవాలి.
దర్శన టికెట్ల విడుదల తేదీలు…
ఈ-టికెట్లు పొందిన వారు జనవరి 21 నుంచి 23వ తేదీ మధ్యాహ్నం 12 గంటల లోపు సొమ్ము చెల్లిస్తే.. టికెట్లు మంజూరవుతాయి.
22న ఉదయం 10 గంటలకు కల్యాణోత్సవం, ఊంజల్సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవా, సాలకట్ల తెప్పోత్సవాలు, సాలకట్ల వసంతోత్సవాల టికెట్లు ఆన్లైన్లో విడుదల చేస్తారు. వర్చువల్ సేవలు, వాటి దర్శన స్లాట్లకు సంబంధించిన కోటాను మధ్యాహ్నం 3 గంటలకు తితిదే ఆన్లైన్లో విడుదల చేయనుంది.
23న ఉదయం 10 గంటలకు అంగప్రదక్షిణ టోకెన్ల కోటాను విడుదల చేయనున్నారు. ఉదయం 11 గంటలకు శ్రీవాణి ట్రస్టు బ్రేక్ దర్శన టికెట్ల కోటా, మధ్యాహ్నం 3 గంటలకు వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్థులు, దివ్యాంగులకు ఉచిత ప్రత్యేక ప్రవేశ దర్శన టోకెన్ల కోటాను ఆన్లైన్లో విడుదల చేస్తారు.
24న ఉదయం 10 గంటలకు ప్రత్యేక ప్రవేశదర్శనం రూ.300 టికెట్ల కోటాను ఆన్లైన్లో విడుదల చేస్తారు. అదే రోజు.. మధ్యాహ్నం 3 గంటలకు తిరుమల, తిరుపతిలో అద్దె గదుల బుకింగ్ కోటాను విడుదల చేస్తారు.
మార్చి నెలకు సంబంధించిన శ్రీవారి సేవ, పరకామణి సేవ కోటాను ఈనెల 27న మధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేస్తారు. భక్తులు https://ttdevasthanams. ap.gov.in వెబ్సైట్లో మాత్రమే టికెట్లు బుక్ చేసుకోవాలని తితిదే అధికారులు సూచించారు.