ఆంధ్రప్రవాసి తరఫున – ద్వారకా తిరుమల వైభవ పరిచయం
ఆంధ్రప్రదేశ్ పశ్చిమ గోదావరి జిల్లాలో విరాజిల్లుతున్న శ్రీ ద్వారకా తిరుమల భక్తుల మన్ననలందుకున్న పవిత్ర క్షేత్రం. “చిన్న తిరుపతి”గా ప్రసిద్ధి చెందిన ఈ దివ్యధామం, భక్తి తత్వానికి, తపస్సు మహిమకు నిలువెత్తు నిదర్శనం.
శ్రీ ద్వారకా తిరుమల వైభవం –12 ద్వాదశ పద్య మాలిక
తనఅమూల్యమైన రచన ద్వారా, డా. పవన్ కుమార్ కాపెర్ల మహోన్నతమైన ద్వారకా తిరుమల క్షేత్ర మహిమను భక్తి పరిమళంతో, సాహిత్య సౌందర్యంతో పాఠకుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచేలా ద్వాదశ ఉత్పలమాల పద్య రూపంలో ఆవిష్కరించారు.
పద్య మాలిక : ఉ: ద్వారక నామ ధేయుడగు ధన్య తపోధను డీ గిరిన్ సదా
కోరి తపస్సు జేయగను కొల్వును దీరిన దేవు డీతడే
సారము గన్న భూమి పయి చక్కని క్షేత్రము భక్తు లెల్లరున్
చేరి భజింపగా వలయు చిన్మయ రూపము గన్న స్వామినిన్.
అర్థం : చూడండి! ద్వారక అనే మహర్షి తపస్సు చేస్తే, ఆ తపఃఫలానికి మెచ్చి పరమాత్మ స్వయంగా వచ్చి ఇక్కడ కొలువుతీరాడు. అందుకే ఇది 'ద్వారకా' తిరుమల అయ్యింది. ఎక్కడో వైకుంఠంలో ఉండే స్వామి, ఒక భక్తుడి కోసం కొండ మీదకు దిగి రావడం అంటే అది ఆ స్వామికి భక్తులపై ఉన్న వ్యామోహం కాక మరేమిటి?
పద్య మాలిక : ఉ: భూమిని చీల్చుకొంచు తను పుట్టను వెల్సిన దైవ మీతడే
ప్రేమను పంచగా నిలిచె పృథ్విని భక్తుల ప్రోవ నెంచెగా
నామము వెల్గె ద్వారకగ నమ్మిన వారల కామ ధేనువై
స్వామిని కొల్వ ముక్తులుగ సాగుదు రందరు మోక్ష మార్గమున్.
అర్థం : మనం ఏ పాపం చేశామో అని భయపడక్కర్లేదు. ఆయన 'స్వయంభూవు'. పుట్టలో నుంచి ఆవిర్భవించిన స్వామి. లోకాన్ని రక్షించడానికి, మనలాంటి సామాన్యులకి దర్శనమివ్వడానికి ఆ భూమిని చీల్చుకుని పైకి వచ్చాడు. ఆ స్వామి నామస్మరణ చేస్తే చాలు, మన జీవితాల్లోని అజ్ఞానమనే చీకటి తొలగిపోతుంది.
పద్య మాలిక : ఉ: పై పగ భాగమందు తను పాదము లూనక వెల్సె మూర్తిగా
చూపగ వింత రూపమును చోద్యముగా నిలిచెన్ గిరి పయిన్
కాపుగ నిల్చి భక్తులకు కల్మష మంతయు తీర్చి వెల్గెడిన్
దీపము వోలె లోకమున దివ్యము ద్వారక మూర్తి రూపమున్.
అర్థం : ఈ క్షేత్రంలో ఒక వింత ఉంటుంది. స్వామి వారి విగ్రహం నాభి వరకు మాత్రమే కనిపిస్తుంది. పాదాలు భూమిలో ఉంటాయి. ఎందుకంటే స్వామి వారు ఇంకా భూమిని వదిలి వెళ్లడం లేదు, తన భక్తులని కాపాడటానికి ఇక్కడే పాతుకుపోయి ఉన్నాను అని చెప్పడానికి అది ఒక సంకేతం. ఆ దివ్య మూర్తిని చూస్తే జన్మ ధన్యమైపోతుంది.
పద్య మాలిక : ఉ: శంఖము చక్రమున్ ధరించి సాధుల బ్రోచెడి దివ్య మూర్తిగా
పంకజ నేత్రు డీతడెగ పాపము లన్నియు బాపు దేవుడున్
లంకను గెల్చినట్టి రఘు లక్ష్మణ మూర్తిగ భక్తు లెంచగా
వేంకట నాథుడై నిలిచె వింతగ ద్వారక కొండ పైననున్.
అర్థం : స్వామి వారి చేతుల్లో శంఖం ఉంది, అది జ్ఞానానికి గుర్తు. మరో చేతిలో చక్రం ఉంది, అది కాలానికి మరియు దుష్టశిక్షణకు గుర్తు. రాముడైనా, కృష్ణుడైనా, వేంకటేశ్వరుడైనా ఆ పరబ్రహ్మ ఒక్కడే. శరణు అని వెళ్ళిన వాడిని 'నేనున్నాను' అని అభయమిచ్చే తండ్రి ఆ ద్వారకా నాథుడు.
పద్య మాలిక : ఉ: బంగరు కాంతులందునను భాసిలు స్వామికి నంద ముండగన్
సింగర మొప్పు మాలలను చేర్చియు వేయగ శోభ లీనెడిన్
కన్నుల పండువౌను గద కాంచగ స్వామిని హార ముండగా
నమ్మిన వారి గుండెలను నవ్వుల విందును చేయు దైవమున్.
అర్థం : స్వామి వారికి అలంకారం చేస్తుంటే చూడాలి! ముత్యాల హారాలు, రత్నాల కిరీటాలు.. ఇవన్నీ ఆయన అందాన్ని పెంచడానికి కాదు, ఆయన్ని చూసి మన కళ్లు తరించడానికి. ఆయన నవ్వు చూస్తే, మన మనసులో ఉన్న భారమంతా ఒక్కసారిగా దిగిపోతుంది.
పద్య మాలిక : ఉ: శేషుడు కొండ రూపమున చిత్రముగా నిట వెల్సె భక్తితో
శేషుని పైన వేంకటేశు డేపుడు కొల్వును దీరి వెల్గెడిన్
ఆశలు తీర్చు దైవమని అందరు కొల్వగ వచ్చి చేరెడిన్
దోషము లారిపోవు గద తోయజ నాథుని దర్శనమ్మునన్.
అర్థం : సాక్షాత్తూ ఆదిశేషుడు కొండగా మారి స్వామిని మోస్తున్నాడు. అనంతుడైన ఆ శేషుడి మీద శేషశయనుడు కొలువై ఉన్నాడు. ఆ కొండపై అడుగు పెడితేనే మనలోని దోషాలన్నీ కాలి బూడిదైపోతాయి. అది సామాన్యమైన కొండ కాదు, భక్తితో నిండిన శేషతల్పం.
పద్య మాలిక : ఉ: ఎక్కడ ఉన్న వారయిన ఎంచగ ద్వారక క్షేత్రమందునన్
మ్రొక్కులు తీర్చుకొందురుగ మోదము తోడను చిన్న తిరుపతిన్
చక్కని శాంతి లభించును సత్యముగా నిట పాద మెత్తినన్
దిక్కును జూపు స్వామియెగ దీనుల కాశ్రయ మిచ్చు దైవమున్.
అర్థం : తిరుమలకు వెళ్ళలేకపోయినా, ఈ 'చిన్న తిరుపతి'కి వస్తే చాలు, ఆ శ్రీనివాసుడి అనుగ్రహం పరిపూర్ణంగా లభిస్తుంది. ఇక్కడ అడుగు పెట్టిన క్షణమే మనసులో ఒక అద్భుతమైన శాంతి కలుగుతుంది. దిక్కు లేని వాడికి ఆ దేవుడే దిక్కు అని చాటి చెప్పే క్షేత్రం ఇది.
పద్య మాలిక : ఉ: నిత్యము పెండ్లి వేడుకలు నిండగ క్షేత్రము నందు వేడుకై
ప్రత్యక్ష దైవ మీతడెగ పద్మజ నాథుడు వేంకటేశుడున్
కృత్యము లెల్ల తీరుగను కృష్ణుడు కేశవు డంచు కొల్వగా
భృత్యుల బ్రోచు నమ్మికను ప్రేయసి తోడుగ నున్న స్వామియె.
అర్థం : లోకంలో ఎక్కడైనా పెళ్లి అంటే ఒకసారే జరుగుతుంది. కానీ ఇక్కడ స్వామికి రోజుకో పెళ్లి! నిత్య కల్యాణం.. పచ్చ తోరణం. ఎందుకంటే ఆయన జగన్నాటక సూత్రధారి. లక్ష్మీదేవితో కలిసి ఆయన ఇచ్చే దర్శనం, మన సంసార జీవితాల్లోని కలహాలను తొలగించి సుఖశాంతులను నింపుతుంది.
పద్య మాలిక : ఉ: మేలుకొలుపును పాడుదురు మెల్లగ స్వామికి భక్తి మీరగా
ఫాలమునందు నామమున భాసిలు సుందర రూప మూర్తికిన్
గాలిని వీచు పుణ్యములు ఘనముగ ద్వారక కొండ పైననున్
యేలును లోకమున్ సదా ఇందిర నాథుడు ప్రేమ తోడుతన్.
అర్థం : లోకాన్నంతటినీ నిద్రలేపే ఆ జగన్నాథుడిని, భక్తులు ప్రేమతో సుప్రభాతం పాడి లేపుతున్నారు. ఆ ముఖ వర్చస్సు, ఆ నుదుటి మీద తిరునామం చూస్తుంటే, కోటి సూర్యుల వెలుగు మన హృదయంలో నిండుతుంది. ఆ స్వామి మేలుకుంటేనే కదా ఈ సృష్టి అంతా మేలుకునేది!
పద్య మాలిక : ఉ: పుణ్యపు తీర్థముల్ గలవు పొంగుచు భక్తుల పాప రాశులన్
కన్యక లాది దేవతలు కాంక్షను వేడుచు నిల్చు క్షేత్రమిన్
ధన్యము ద్వారకా గిరియు ధన్యము స్వామిని జూచు కన్నులున్
వన్యము లైన చింతలను బాపును వేంకట నాథు డీశ్వరున్.
అర్థం : అక్కడ ఉన్న తీర్థంలో ఉన్నది సామాన్యమైన నీరు కాదు. దేవతలందరూ వచ్చి స్నానాలు చేసే పవిత్ర జలాలు. ఆ తీర్థాన్ని తల మీద చల్లుకుంటే, మనలోని మానసిక చింతలన్నీ తొలగిపోతాయి. ఆ క్షేత్రంలో వీచే గాలి కూడా మనల్ని పవిత్రులను చేస్తుంది.
పద్య మాలిక : ఉ: భేదము లేక మానవులు ప్రీతిగ వచ్చెడి పుణ్య ధామమున్
వేదము ఘోష చేయుచును వింతగ భక్తిని పెంచు క్షేత్రమున్
ఆదర మొప్పగా జనుల ఆపద లన్నియు తీర్చు దైవమై
పాదము లాశ్రయించినను ప్రాపుగ నిల్చును వేంకటేశుడున్.
అర్థం : స్వామి దగ్గరికి వెళ్ళడానికి కులం అక్కర్లేదు, మతం అక్కర్లేదు.. కేవలం 'భక్తి' ఉంటే చాలు. వేద ఘోషల మధ్య ఆయన అందరినీ సమానంగా చూస్తాడు. ఆపదలో ఉన్నవాడు 'గోవిందా' అని ఒక్కసారి పిలిస్తే, కొండంత అండగా నిలబడే దయామయుడు ఆయన.
పద్య మాలిక : ఉ: మంగళ మౌను స్వామికిని మంగళ మౌను క్షేత్రమునకున్
మంగళ మౌను భక్తులకు మౌని జనార్చన సేయు దైవమున్
సంగతి తోడ ద్వారకను సంతతమున్ స్మరియించు వారికిన్అం
గన తోడ వేంకటేశు డాయువు నిచ్చును సిరి సంపదల్.
అర్థం : చివరిగా ఒక్కటే మాట.. ఆ స్వామికి మంగళం, ఆ క్షేత్రానికి మంగళం. ఎవరైతే ఈ ద్వారకా తిరుమల వైభవాన్ని వింటారో, మననము చేసుకుంటారో, వారికి ఆ వేంకటేశ్వరుడు ఆయుష్షుని, ఐశ్వర్యాన్ని, అంతకంటే ముఖ్యంగా ప్రశాంతతను ప్రసాదిస్తాడు.
ఉత్పలమాల అంటే ఏంటి?
"ఉత్పలమాల" (Utpalamala) అనేది తెలుగు ఛందస్సులో ఒక ప్రముఖమైన వృత్త పద్యం. దీని గురించి ముఖ్యమైన వివరాలు.
ఉత్పలమాల పద్య లక్షణాలు:
పాదాలు: ఈ పద్యంలో నాలుగు పాదాలు (lines) ఉంటాయి.
అక్షరాల సంఖ్య: ప్రతి పాదంలో 20 అక్షరాలు ఉంటాయి.
గణాలు: ప్రతి పాదంలో వరుసగా భ, ర, న, భ, భ, , ర, వ (భరణభభరవ) అనే గణాలు వస్తాయి.
యతి స్థానం: ప్రతి పాదంలో 10వ అక్షరం యతి స్థానంగా చెప్పబడింది (కొన్ని చోట్ల 11వ అక్షరం అని కూడా అంటారు, కానీ ప్రామాణికం 10వ అక్షరం).
ప్రాస నియమం: ప్రాస నియమం తప్పనిసరిగా పాటించాలి.
వృత్త జాతి: ఇది వృత్త జాతికి చెందిన పద్యం.
గణాలు అంటే ఏంటి అవి ఎన్ని రకాలు?
గణములు అంటే సమూహాలు, గుంపులు అని అర్థం, కానీ తెలుగు ఛందస్సులో, ఇవి అక్షరాల గురువు (U) మరియు లఘువుల (I) కలయికతో ఏర్పడే మూడక్షరాల సమూహాలు. ఈ గణాలను ఉపయోగించి పద్యాలను నిర్మిస్తారు, వాటికి లయ, శబ్దాన్ని చేకూరుస్తారు, వీటిని 'అక్షర గణాల'ని కూడా అంటారు, ఇవి పద్యానికి ప్రాణం పోస్తాయి.
గణముల ముఖ్య రకాలు (ఛందస్సు ప్రకారం):
అక్షర గణములు (మూడు అక్షరాలవి):
భ గణము (UII) : ఆది గురువు ( మొదటిది గురువు).
య గణము (IUU): ఆది లఘువు (మొదటిది లఘువు).
ర గణము (UIU): మధ్య లఘువు (మధ్యలో లఘువు).
త గణము (UUI): అంత్య లఘువు (చివరిది లఘువు).
న గణము (III): సర్వ లఘువులు (అన్నీ లఘువులు).
మ గణము (UUU): సర్వ గురువులు (అన్నీ గురువులు).
జ గణము (IUI): మధ్య గురువు (మధ్యలో గురువు).
స గణము (IIU): అంత్య గురువు (చివరిది గురువు).
వ గణం (I U) ఒక గురువు, ఒక లఘువు.
ఉప గణములు (సూర్య, ఇంద్ర గణములు): ఇవి పై గణాల కలయికతో ఏర్పడతాయి.
గణములు ఎందుకు ముఖ్యమైనవి?
పద్య నియమాలు: కంద పద్యం వంటివి గణాల ఆధారంగానే నిర్మించబడతాయి.
సంగీతమయత్వం: గణాల అమరిక పద్యానికి ఒక సంగీత లయను, మాధుర్యాన్ని ఇస్తుంది.
గుర్తుపట్టడం: పద్యాలను సులభంగా గుర్తించడానికి, గుర్తుంచుకోవడానికి సహాయపడతాయి.
ఆంధ్రప్రవాసి తరఫున, దేశ విదేశాల్లో ఉన్న తెలుగు ప్రజలందరికీ మా వినమ్ర విజ్ఞప్తి…. ఒక్కసారైనా ద్వారకా తిరుమల దర్శించి, ఆ స్వామి కరుణకు పాత్రులవ్వండి.